OTR: జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!

Jangaon

Jangaon

మనుషులు మారినా… ఆ జిల్లాలో కాంగ్రెస్‌ పోస్ట్‌ల మధ్య పోరు మారదా? ఆ రెండు పదవుల మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ నడుస్తూనే ఉంటుందా? పార్టీ నష్టపోతున్నా…. ఆ విషయం స్పష్టంగా కంటికి కనిపిస్తున్నా నేతల్లో మార్పు ఎందుకు రావడం లేదు? గాంధీభవన్‌ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు? డీసీసీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ మధ్య కేడర్‌ నలిగిపోతున్న పరిస్థితి ఎక్కడుంది? అక్కడి ప్రత్యేక రాజకీయ వాతావరణం ఏంటి?

ఆది, అంతం లేదన్నట్టుగా సాగుతోంది జనగామ కాంగ్రెస్‌లో వర్గపోరు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైనాగానీ…. నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ ఎవరైనా ఉండనీ…. ఇద్దరి మధ్య సయోధ్య మాత్రం కుదరడం లేదు. వ్యక్తులు మారినా… ప్రతి సందర్భంలో ఎవరికి వారే ఇన్నట్టుగా ఉంటోంది. గత ఎన్నికల్లో… ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌ గాలి జోరుగా వీచినా…. జనగామలో మాత్రం ఓడిపోవడానికి ఈ ఆధిపత్య పోరే కారణం అని, అయినా సరే… ఇక్కడి నేతల్లో మార్పు రావడంలేదని కార్యకర్తలే కామెంట్‌ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ ఆందోళనల్లో రాహుల్ గాంధీ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది పీసీసీ. ఆ సందర్భంగా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్‌ ధన్వంతి మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. రాష్ట్రం మొత్తం కార్యక్రమాలు ఉధృతంగా జరిగితే… జనగామ జిల్లాలో రెండు వర్గాలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఒకే పార్టీ, ఒకటే అజెండా…. కానీ వేర్వేరు శిబిరాలుగా ఏర్పడి నిరసనలు తెలపడంచూసి జనగామ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. వీళ్ళసలు పార్టీ బాగుకోసం పోరాడు తున్నారా…? లేక పరస్పరం తొక్కేసుకోవడానికా అంటూ చర్చలు కూడా మొదలయ్యాయి. డీసీసీ నాయకత్వానికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్‌కు మధ్య కనీస కమ్యూనికేషన్ కూడా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అంటున్నారు. జనగామ జిల్లాగా ఏర్పడినప్పటి నుంచి ఇదే ఆనవాయితీగా కొనసాగుతోందని అంటున్నారు. జనగామ జిల్లాకు ఇదో శాపమని కూడా చెప్పుకుంటున్నారు. గతంలో పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన వర్సెస్ జంగా రాఘవ రెడ్డిగా ఉండేది. రాఘవరెడ్డి జిల్లా అధ్యక్ష పదవి నుండి తప్పుకున్నార కొమ్మూరి బాధ్యతలు చేపట్టారు.దీంతో ఆ విబేధాలు మళ్లీ పొన్నాల వర్సెస్ కొమ్మూరిగా టర్న్‌ అయ్యాయి.
పార్టీ అధికారంలోకి రాక ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు కూడా…పొన్నాల, కొమ్మూరి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ విభేదాల కారణంగా ఏకంగా పొన్నాల పార్టీనే వదిలేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో… ఇప్పుడు డిసిసి అధ్యక్షురాలిగా మాజీ జడ్పీ చైర్ పర్సన్ లకావత్‌ ధనవంతి బాధ్యతలు చేపట్టాక జనగామ నియోజకవర్గం ఇన్చార్జ్‌గా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మళ్లీ సేమ్‌ సీన్‌. కొంత కాలంగా కొమ్మూరి వర్సెస్ ధన్వంతి అన్నట్టుగా మారిపోయింది నియోజకవర్గ రాజకీయం. మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలోనే రెండు వర్గాల విభేదాలు బయటపడ్డాయి. అప్పుడు రెండు వర్గాలకు వార్నింగ్ ఇచ్చి కలిసి పని చేయాలని సూచించారాయన.

అయినా పరిస్థితిలో మార్పు లేదు. దాని ఫలితంగా ఏకపక్షంగా గెలవాల్సిన మున్సిపాలిటీని టాస్‌దాకా తెచ్చుకున్నారు. ఎన్నికల సమయంలో కొమ్మూరికి వ్యతిరేకంగా పని చేసిన వారు ఇప్పుడు డీసీసీ అధ్యక్షురాలి వర్గంలోఉండడం ప్రతాప్‌రెడ్డికి మింగుడు పడ్డం లేదట. అందుకే నేతలిద్దరూ కలవడంలేదని తెలుస్తోంది. పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా రెండు వర్గాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. వెంటనే అధిష్టానం జోక్యం చేసుకుని రెండు వర్గాలను సెట్‌ చేయకుంటే…ఇది ఎప్పటికీ అలాగే ఉండిపోతుందని అంటున్నారు జిల్లా కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నాయకులు.