OTR: విశాఖ మేయర్‌ సీటు కోసం వారసులు పోటీ ? మరి దక్కేదెవరికి ?

Otr

Otr

ఒక్క సీటు. కొడితే స్టేటంతా రీసౌండ్ వచ్చేయాలి. ఆ పార్టీ… ఈ పార్టీ అన్ని కాదు. అన్ని పార్టీల టార్గెట్‌ అదే. గెలుపు ప్రభంజనం కావాల్సిందేనని పొజిషన్‌ ఉన్నవాళ్లు ప్లాన్‌ చేస్తుంటే… దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వ్యూహాలతో అపోజిషన్ రెడీ అవుతోంది. దీంతో లోకల్ ఫైట్ హీటెక్కుతుండగా… అన్ని పార్టీల్లోనూ ఊహించని పోటీ కనిపిస్తోంది. సీనియర్లు వారసుల కోసం తపన పడుతుంటే… ఈ చాన్స్ తమదేనంటోంది యువతరం.

గ్రేటర్‌ విశాఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్ పీఠం అధికార కూటమికి ఇజ్జత్ కా సవాల్. స్ధానిక సమరానికి అంతా సిద్ధం అవుతోంది. ఈసారి మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో జరగబోతున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో ఫలితం ఇచ్చే సౌండ్ స్టేట్ అంతా వినిపిస్తుంది. అందుకే అధికార కూటమి విస్తృత కసరత్తు చేస్తోంది. అభ్యర్ధుల వ్యవహారంలో అనేక కొలమానాలు పెట్టుకుంది. మేయర్ పీఠానికి కూటమిలో ఆశావహుల పోటీ ఎక్కువగానే ఉందట. సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, యువనేతలు.. ఇలా అనేక మంది మేయర్ పదవికి పోటీపడుతున్నారట. అయితే సీనియర్‌ నేతలు తమ వారసులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కుమారుడు రవితేజ, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సమీప బంధువు, వ్యాపారి మురళీకృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయట. బీసీలకు చాన్స్ ఇస్తే యాదవ సామాజికవర్గం నుంచి పక్కుర్తి మురళీకృష్ణ బలమైన అభ్యర్ధిగా ప్రొజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఇప్పటికే కూడగట్టేందుకు మురళీకృష్ణ ట్రై చేస్తున్నారట.

2019 నుంచి పల్లా శ్రీనివాస్‌కు తలలో నాలుకలా వ్యవహరిస్తున్నారట పక్కుర్తి మురళి. వైసీపీ తరపున మేయర్‌గా గెలిచిన గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాసం పెట్టి దించేయడం టీడీపీకి యాదవ సామాజికవర్గంలో కొంత ప్రతికూలతను తెచ్చిపెట్టిందనే ఫీడ్ బ్యాక్ ఉందట. దానిని పోగొట్టుకోవడంతో పాటు దాదాపు 30 శాతం ఓటర్లున్న యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలని అధినాయకత్వం భావిస్తే మురళికి చాన్స్ దక్కుతుందనే చర్చ జరుగుతోంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ సిటీ రాజకీయాలపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారనే చర్చ కూటమిలో జరుగుతోందట. తన కుమారుడు రవితేజకు మేయర్‌గా పోటీ చేసేందుకు ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నారట. గంటా వియ్యంకుడు, రవితేజ మామ అయిన నారాయణ మున్సిపల్‌ మంత్రిగా ఉన్నారు. దాంతో అటు నుంచి కూడా గంటా శ్రీనివాస్‌ పావులు కదుపుతున్నారట. ఇప్పటికే ముఖ్య నేతలను కలిసి బలాబలాలపై చర్చించినట్టు భోగట్టా.

వెస్ట్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు తన కుమారుడు మౌర్యను దింపాలని భావిస్తున్నారట. గవర సామాజిక వర్గం కోటా, యువ నాయకత్వం ముద్ర వంటివి తనకు అడ్వాంటేజ్ అవుతాయని మౌర్య లెక్కలు వేసుకుంటున్నారట. తనకు మంత్రి పదవి ఇవ్వనందున… తన కొడుకు మౌర్యకు మేయర్‌ ఛాన్స్‌ ఇవ్వాలని అధిష్టానాన్ని గట్టిగానే కోరుతున్నారట ఎమ్మెల్యే గణబాబు. పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జీ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వంటి వారు కూడా ఆశావహుల జాబితాలో చేరిపోయారు. అయితే, అధినాయకత్వం రెండు అంశాలపై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఒకటి బీసీలకు చాన్స్ ఇవ్వడం. రెండోది యువతరాన్ని ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ రాజకీయాలకు బలమైన నాయకత్వాన్ని అందించడం. అందుకే రాజకీయ వారసత్వం ఒక్కటే సరిపోదని… నేతల చాటు బిడ్డలకు చాన్స్ ఇచ్చామనే మాట తెచ్చుకోవడం కంటే కొత్త ముఖాలకు ఛాన్స్‌ ఇవ్వడం ద్వారా మార్పును పరిచయం చేయడం ముఖ్యం అనే భావన వ్యక్తం అవుతోందట.

అయినప్పటికీ ఇప్పటికే కొందరు నేతలు ఖర్చీఫ్‌ వేసి సీట్‌ కన్‌ఫమ్‌ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట. సీఎం చంద్రబాబు విశాఖపై ప్రత్యేకంగా దృష్టి పెడతారు. అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తారు. అలాంటప్పుడు సామాజిక సమీకరణాలు, భవిష్యత్‌ ప్రయోజనాలు లాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఒకవైపు అధికార కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు, మేయర్ అభ్యర్థిత్వంపై లెక్కలు తేలాల్సి ఉంది. అయితే… విశాఖలో వైసీపీ స్ట్రాటజీ కూడా కూటమి మేయర్ అభ్యర్ధిని ప్రభావితం చేసే అవకాశాలు ఉందనే చర్చ జరుగుతోంది.