OTR: సొంత జిల్లాలో రామ్మోహన్‌కు అసంతృప్తి సెగ?

Otr

Otr

ఆ… సెంట్రల్‌ మినిస్టర్‌ నేల విడిచి సాము చేస్తున్నారా? మనం ఎక్కడెక్కడికి ఎగిరి వెళ్లినా…. చివరికి ఇక్కడికే రావాలన్న వాస్తవాన్ని గ్రహించలేకపోతున్నారా? అంతన్నాడింతన్నాడే…. అంటూ సొంత జిల్లా వాళ్ళు ఎందుకు మెటికలు విరుస్తున్నారు? మూడుసార్లు గెలిపించిన ఢిల్లీ పంపితే… మంత్రి అయ్యాక ఇలా… మెరుపుతీగలా మారిపోతే ఎలాగంటూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఏ జిల్లా వాసుల్లో తమ ప్రజాప్రతినిధి మీద అసహనం పెరిగిపోతోంది?

పార్టీలో పట్టు, కేడర్‌లోని తిరుగులేని అభిమానం… ప్రభుత్వ వ్యవహారాల్లో డైనమిజం. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడి గురించి ఇన్నాళ్లు తరచూ వినిపించే మాటలివి. కానీ… క్రమంగా సీన్‌ సితారవుతోందట. శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన రామ్మోహన్‌ తీరు ఈసారి తేడాగా ఉందన్నది లోకల్‌ టాక్‌. ఆయన ప్రజల మనిషి, సాదకబాదకాలు తెలుసుకుంటారుగానీ…. ఈ మధ్య కాలంలో మాత్రం తన స్వభావానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ సిక్కోలు జనం గుసగుసలాడుకుంటున్నారు. విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక చూపులన్నీ ఆకాశంలోనే తప్ప… శ్రీకాకుళం వైపు ఉండటంలేదని, సాధారణ ప్రజలతో పాటు పార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు సైతం దూరమయ్యారన్న మాటలు టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఓ సినిమాలో అమ్మా… మెరుపుతీగ అన్న డైలాగ్‌ను గుర్తు చేసుకుంటూ… ఈయన్ని అయ్యా…. మెరుపుతీగ అని పిలుచుకోవాల్సి వస్తోందంటూ సెటైర్స్‌ కూడా వేస్తున్నారు. పార్టీలకు అతీతంగా అభిమానించే రామూ… ఇప్పుడిలా మారిపోయాడేంటి? కేంద్ర మంత్రి పదవేం శాశ్వతం కాదుకదా…? ఇంకో రెండున్నరేళ్ళకు మళ్ళీ మన ముందుకే రావాలి? మనమే ఓట్లేయాలి కదా…? అంత చిన్న లాజిక్‌ ఎలా మిస్‌ అవుతున్నారంటూ రకరకాల డిస్కషన్స్‌ జరిగిపోతున్నాయి శ్రీకాకుళంలో.

గతంలో రకరకాల సమస్యల పరిష్కారం కోసం ఎంపీ ఆఫీస్‌కు వచ్చేవాళ్ళకు ప్రస్తుతం తిప్పలు తప్పడం లేదట. సార్‌… వచ్చేదే తక్కువ, ఆ వచ్చినప్పుడు కూడా సరిగా టైం ఇవ్వడం లేదంటూ స్థానికంగా అసంతృప్తి పెరిగిపోతోందంటున్నారు. అసలిప్పుడు రామ్మోహన్‌ నాయుడుని కలవాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్నది నియోజకవర్గంలోని సామాన్యుల మాట. కేంద్ర మంత్రిగా ఎక్కువ రోజులు ఢిల్లీలో ఉండాల్సి రావడం సహజమే అయినా…. సొంతూరిని పూర్తిగా వదిలేస్తే ఎలా? రేపు మళ్లీ వీళ్లనే కదా ఓట్లు అడగాల్సింది అని అంటున్నారు ఎక్కువ మంది. అయితే ఢిల్లీ, కాకుంటే విశాఖ అన్నట్టు ఉంటున్నారని, ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం ఉంటే తప్ప శ్రీకాకుళం ముఖం చూడ్డం లేదని చెప్పుకుంటున్నారు. అప్పుడు కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారన్నది లోకల్‌ కంప్లయింట్‌.

శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం టిడిపికి కంచుకోట. దశాబ్దాలుగా కింజరాపు కుటుంబం చేతిలోనే ఉంది. తండ్రి ఎర్రన్నాయుడి వారసత్వాన్ని రామ్మోహన్‌ బాగానే కొనసాగిస్తున్నారని చెప్పుకుంటున్న టైంలో… ఇప్పుడు ఆయన వైఖరిలో మార్పు వస్తోందని, ఇంకా బోలెడు రాజకీయ జీవితం చూడాల్సిన నేతకు ఇది సరైన వైఖరి కాదన్న వార్నింగ్స్ సైతం వినిపిస్తున్నాయి. వరుసగా 2014 , 2019 , 2024లో గెలిచిన రామ్మోహన్‌ నాయుడి మీద జిల్లా వాసులు గట్టి ఆశలే పెట్టుకున్నారు. స్థానిక అభివృద్ధిలో ఆయన మార్క్ కనిపిస్తుందని ఆశించారు. కానీ… ప్రతి విషయంలోనూ వెనుకబడ్డట్టు కనిపిస్తున్నారన్నది లేటెస్ట్‌ టాక్‌. అభివృద్ధి అంశాన్ని ప్రక్కన పెడితే.. కనీసం పలుకే బంగారమైందంటూ సొంత కేడరే ఆవేదన వ్యక్తం చేస్తోందట. ప్రభుత్వ కార్యక్రమం అయినా, ప్రైవేట్‌ ప్రోగ్రామ్‌ అయినా… దగ్గరకు వచ్చిన వాళ్లకు సెల్ఫీలు ఇవ్వడానికే పరిమితం అవుతున్నారని, సెల్ఫీలతో సమస్యలు తీరతాయా అని నిలదీస్తున్నారు ఎక్కువ మంది. ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదంటూ నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలు సైతం అసహనంగా ఉంటున్నారట. రేపు మళ్లీ ఓట్లు అడగడానికి రావాల్సింది ఇక్కడికే…. ఆ సంగతి మర్చిపోతే ఎలాగని టీడీపీ నాయకులే అంటున్నారంటే… కేంద్ర మంత్రి విషయంలో ఎంత అసంతృప్తి పెరుగుతోందో అర్ధం చేసుకోవాలంటున్నారు పరిశీలకులు.