బెల్లంపల్లి కాంగ్రెస్లో లొల్లి లొల్లి అవుతోందా? ఏకంగా ఎమ్మెల్యేకే వార్నింగ్ స్థాయికి వివాదం వెళ్లిపోయిందా? పరిస్థితి అంత తీవ్రంగా ఎందుకు మారింది? నియోజకవర్గ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్లో అసమ్మతి రాజుకుంటోంది. ఏకంగా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ పైనే సొంత పార్టీ నేతలు సమరశంఖం పూరించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీనియర్స్… అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా బెల్లంపల్లి పట్టణంలో సీనియర్ నాయకులు మత్తమరి సూరిబాబు, నాతరి స్వామి లాంటి వాళ్ళంతా కలిసి ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎమ్మెల్యే వినోద్ తమని విస్మరిస్తున్నారంటూ గళం విప్పారు అంతా. బెల్లంపల్లిలో కొంత కాలంగా పార్టీ మారి వచ్చిన వాళ్లు, పార్టీ కోసం ఉన్నవాళ్లు అంటూ రచ్చ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కోసం పనిచేస్తే… పదవుల దగ్గరికి వచ్చేసరికి సీనియర్లను విస్మరిస్తున్నారంటా గుస్సా అవుతోందట కట్టర్ కాంగ్రెస్ క్యాడర్. కష్టకాలంలో సైతం వెంటే ఉన్న వారిని కాదని వివిధ పార్టీల నుంచి వచ్చిన వారికి లేదా ఎమ్మెల్యే వినోద్ వెంట తిరిగే వారికే పదవులు వస్తున్నాయని ఫైరౌతోంది ఓ వర్గం. బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ స్థానికంగా అందుబాటులో ఉండరన్న విమర్శలున్నాయి. వచ్చినప్పుడు కూడా పార్టీకి అండగా ఉన్నవారిని పట్టించుకోరని చెప్పుకుంటున్నారు. తాజా మీటింగ్లో ఎమ్మెల్యే వైఖరిని నిరసించడంతో పాటు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ మనుషుల్ని పెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వినోద్ కేడర్ని అస్సలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసేందుకు, వినోద్ గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడిన నాయకులు, కార్యకర్తలను ఇప్పుడు పూర్తిగా విస్మరిస్తున్నారన్నది అభియోగం. పట్టణ, బ్లాక్ కమిటీలతోపాటు మండలకమిటీలు, మార్కెట్ కమిటి చైర్మన్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ పదవుల విషయాన్ని మీటింగ్లో చర్చించారంట. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలు, సీనియర్లను విస్మరిస్తూ ఒంటెత్తుపోకడలో ముందుకు సాగుతున్నారంటూ గుర్రుగా ఉన్నారు పాత కాంగ్రెస్ లీడర్స్. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో బెల్లంపల్లిలో కాంగ్రెస్కు భారీ నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎమ్మెల్యే వినోద్ టార్గెట్గా సీనియర్లు అల్టిమేటం ఇచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్ సిద్ధాంతాల కోసం నిలబడ్డ అసలైన నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పోవాలని లేదంటే.. ఎందాకైనా వెళ్తామని చెప్పేశారట. ఎమ్మెల్యే తీరుపై నేరుగా అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమని ప్రకటించారట.
ఏ కమిటీలో చూసినా… సీనియర్ నాయకులకు అవకాశం ఇవ్వడం లేదని, అంతా కొత్త వాళ్లతో లేదా ఎమ్మెల్యేకు నచ్చిన వాళ్లనే నింపేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న బెల్లంపల్లి కాంగ్రెస్లో.. ఈ పరిణామాలు ఎలాంటి మలుపు తిప్పబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.

