Off The Record: ఆంధ్రప్రదేశ్లో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతిపక్షం వైసీపీకి ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగానే ఉన్నాయట. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల్లె అందులో ఒకటని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక్కడ ఫ్యాన్ జెండా ఎగరేయాలని పార్టీ ఆవిర్భావం నుంచి ప్రయత్నిస్తున్నా ఏ మాత్రం వర్కౌట్ అవలేదు. మూడుసార్లు పోటీ చేసినా… ఒక్క విడత కూడా గెలుపు దక్కలేదు. రేపల్లె నుంచి వరుసగా మూడు సార్లు టీడీపీ తరపున పోటీ చేసిన అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. అటు వైసీపీ అభ్యర్థులను మార్చి ప్రయోగాలు చేసినా ఫలించలేదు. గతంలో రేపల్లె నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణ తర్వాత వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. ఇక సామాజిక సమీకరణల పేరుతో మోపిదేవిని కాదని గౌడ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి ఈవూరి సీతారావమ్మ కొడుకు గణేష్కు పోటీ చేసే ఛాన్స్ ఇచ్చింది వైసీపీ. ఈ నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గం ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. అందుకే ఈవూరికి ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఇక్కడ గౌడ సామాజికవర్గం తర్వాత అత్యధికంగా కాపుల ఓట్లు ఉన్నాయి. అందుకే రెండు పార్టీలు బీసీలకు ఇచ్చినా వైసీపీకి మాత్రం కలిసి రావడం లేదు. రేపల్లెనుంచి వరుసగా మూడోసారి గెలిచిన అనగానికి ఈసారి మంత్రి పదవి దక్కింది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ మరింత బల పడిందన్నది తాజా విశ్లేషణ. దీంతో.. ఎలాగైనా సరే రేపల్లెలో పట్టు పెంచుకోవాలని భావిస్తోంది వైసీపీ. అందులో భాగంగా…. యాక్టివ్గా లేని ఈవూరి గణేష్ స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన పీటా నాగమోహనకృష్ణను ఇన్ఛార్జ్గా నియమించారు. ఆయన మొదటిసారి రేపల్లె వచ్చినప్పుడు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
ఇదే సమయంలో వైసీపీ నేతలకు, పోలీసులకు మధ్య ఫ్లెక్సీల విషయంలో వాగ్వాదం జరిగింది. అయినాసరే తగ్గకుండా పార్టీ ప్రకటించిన కార్యక్రమాలను రేపల్లెలో నిర్వహిస్తూ కొత్త ఇన్ఛార్జ్ ముందుకెళ్తున్నారు. వరుస కార్యక్రమాలతో కేడర్లో కూడా కాస్త కాన్ఫిడెన్స్ పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. దాంతో… పార్టీని ఇంకా బలోపేతం చేద్దామని భావించిన అధిష్టానం రేపల్లెకు చెందిన సీనియర్ నేత, కాపు సామాజికవర్గ ముఖ్యుడు మోపిదేవి శ్రీనివాసరావును పార్టీలో చేర్చుకుంది. ఆయనకు రాజకీయంగా అండదండలు అందిస్తానని అధినేత జగన్ హామీ ఇచ్చారు. అలాగే…నియోజకవర్గంలో వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత నీదేనని చెప్పారట. రేపల్లెలో గౌడ సామాజికవర్గం ఓట్లు 45వేలవరకు ఉంటే…. కాపుల ఓట్లు 42వేల వరకు ఉన్నారు. ఆ విధంగా…ప్రభావ వంతమైన రెండు కులాలకు చెందిన ఇద్దరు నేతలు తమ పార్టీలోనే ఉన్నారని, ఇక రేపల్లెలో జెండా పాతేస్తామని భావించారట పార్టీ పెద్దలు. కానీ…. ప్రస్తుత వాతావరణం మాత్రం పూర్తి తేడాగా కనిపిస్తోందని, ఒకే ఒరలో రెండు కత్తుల్ని పెట్టినట్టయిందని అంటున్నారు. ఇన్ఛార్జ్ నాగమోహనకృష్ణ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేసే పనిలో ఉన్నారు. అయితే….మోపిదేవి శ్రీనివాసరావుతో ఎంత వరకు సమన్వయం ఉందన్న విషయంలో మాత్రం అన్నీ అనుమానాలే. ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొన్న దాఖలాలు లేవు.
ఏ ప్రోగ్రామ్ చూసినా… పీటా ఒక్కరే కనిపిస్తున్నారు. ప్రతి కార్యక్రమానికి తాము ఆహ్వానిస్తూనే ఉన్నా…. మోపిదేవి శ్రీనివాసరావు మాత్రం పాల్గొనడం లేదని చెబుతున్నారు ఇన్ఛార్జ్ వర్గీయులు. కానీ… ఇన్ఛార్జ్తో సంబంధం లేకుండా శ్రీనివాసరావు ఒక్కరే గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఇక్కడ ఇగో సమస్యలు వస్తున్నాయా అన్నది చాలా మంది డౌట్. ఇన్ఛార్జ్ పీటా కంటే మోపిదేవి రాజకీయాల్లో సీనియర్ నేత. అందుకే… జూనియర్తో కలిసి, ఆయన నాయకత్వంలో పని చేయడం ఇష్టంలేకే.. అలా చేస్తున్నారా అన్న అనుమానాలు చాలా మందికి ఉన్నాయి.ఎన్నికల సమయానికి పీటాకు బదులు మోపిదేవి శ్రీనివాసరావుకే పోటీచేసే అవకాశం వస్తుందన్న ప్రచారం సైతం రేపల్లెలో ఉంది. అందుకే ఆయన సపరేట్గా గ్రామాల్లో తిరుగుతూ తన వ్యక్తిగత ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. రెండు బలమైన సామాజికవర్గాలు కలిసి కట్టుగా పనిచేస్తే…. రేపల్లెలో వైసీపీ జెండా ఎగరెయ్యవచ్చని అధిష్టానం భావించి ఇద్దరికి నేతలకు బాధ్యతలు అప్పగిస్తే… ఇప్పుడు విడివిడిగా కార్యక్రమాలు చేస్తూ… మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాకంటూ పార్టీ కేడర్ కంగారు పడుతోందట.

