Site icon NTV Telugu

Off The Record: మడకశిరను పట్టించుకోని వైసీపీ హైకమాండ్ .. గందరగోళంలో కేడర్..

Otr Madakasira Ycp

Otr Madakasira Ycp

Off The Record: అసెంబ్లీ ఎన్నికల షాక్‌ నుంచి వైసీపీ నాయకత్వం త్వరగానే కోలుకుంటున్నట్టు కనిపిస్తున్నా… ఇప్పటికీ అక్కడక్కడా కొన్ని నియోజకవర్గాల్లో ఆ వాతావరణమే కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా ఎన్నికల టైంలో ప్రయోగాలు చేసి విఫలమైన చోట్ల ఆ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గాన్నే ఇందుకు ఉదాహరణగా పార్టీ నాయకులే చూపిస్తున్నారు. ఇక్కడ పార్టీ కేడర్‌ తీవ్ర గందరగోళంలో ఉందట. నాయకత్వంలేమే అందుకు ప్రధాన కారణం. ఆ నాయకత్వలేమికి కూడా అధిష్టానం తీసుకున్న నిర్ణయాలే మెయిన్‌ రీజన్‌ అన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకి షాక్ ఇస్తూ… ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చి.. వైసీపీ అధిష్టానం వినూత్న ప్రయోగం చేసింది. కానీ… ఆ ఎక్స్‌పెరిమెంట్‌ ఘోరంగా విఫలమై నియోజకవర్గంలో పార్టీని కోలుకోలేని దెబ్బ తీసిందని అంటున్నారు. ఇది ఇప్పటితో పోదు, ఈ ఎఫెక్ట్‌ సుదీర్ఘకాలం ఉండేట్టు కనిపిస్తోందని వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. మడకశిర నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్‌. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున డాక్టర్ తిప్పేస్వామి మంచి మెజార్టీతో గెలిచారు. కానీ… ఆ తర్వాత ఆయన స్వీయ తప్పిదాలతో ఎమ్మెల్యే మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది.

2024 ఎన్నికల టైం వచ్చేసరికి అది పీక్స్‌కు చేరింది. తిప్పేస్వామికి టికెట్ ఇస్తే మేం సహకరించే ప్రసక్తే లేదంటూ మడకశిరకు చెందిన కొందరు వైసీపీ నాయకులు అధిష్టానానికి ఫుల్‌ పిక్చర్‌ ఇచ్చేశారు. సరిగ్గా ఇక్కడే పార్టీ పెద్దలకు ఫ్లాష్‌లాంటి ఐడియా వచ్చి కొత్త ప్రయోగానికి తెర తీశారు. అందుకు స్థానిక వైసీపీ నాయకులు కూడా తలూపేశారు. ఆ ఎన్నికల్లో ఒక సామాన్య ఉపాధి హామీ కూలీ అయిన ఈర లక్కప్పకు వైసీపీ టిక్కెట్‌ దక్కింది. లక్కప్పకు అసలు రాజకీయాలతో సంబంధం లేదు. ఆయన ఒక సామాన్య నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇంకా నిర్మొహమాటంగా చెప్పాలంటే ఒక పది మంది కార్యాకర్తల్ని వెంటేసుకుని వెళ్లి భోజనం పెట్టించాలన్నా జేబులు తడుముకోవాల్సిన ఆర్థిక స్థితి ఆయనది. అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి వైసీపీ అధిష్టానం ఒక రకంగా సాహసమే చేసిందని అప్పట్లో చెప్పుకున్నారు. ఫైనల్‌గా ఆ ప్రయోగం గట్టిగా బెడిసి కొట్టింది. ఇటు టీడీపీ నుంచి చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న ఎంఎస్ రాజు విజయం సాధించారు. ఇక ఓటమి తర్వాత వైసిపి అధిష్టానం మడకశిరను పూర్తిగా వదిలేనట్టు కనిపిస్తోంది.
నియోజకవర్గంలో నాయకులందర్నీ ఏకతాటిపైకి తేవడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పిప్రేర్ చేయడం లాంటివి మచ్చుకైనా కనిపించడం లేదు. అసలు ఆ దిశగా ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చని పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు.

ఇటు ఇదే జిల్లాలో ఎస్సీ రిజర్వ్ గా ఉన్న శింగనమలకు మంచి నాయకుడు దొరికారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా ఉన్న శైలజానాథ్ వైసిపిలో చేరారు. మెల్లిగా శింగనమల మీద గ్రిప్‌ పెంచుకుంటున్నారు శైలజానాథ్‌. కానీ…. అదే ఊపు, ఉత్సాహం మడకశిరలో మాత్రం కనిపించడం లేదు. పైగా… ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చాలా దూకుడుగా ఉన్నారు. ఓ వైపు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు.. ఇంకో వైపు పార్టీని బలోపేతం చేస్తూ తన మార్క్ వేసుకుంటున్నారాయన. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి లాంటి బలమైన నాయకుల్ని కలుపుకుని పోతూ… పార్టీలో, నియోజకవర్గంలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారాయన. మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అందుకోసం అన్ని ప్రాంతాల్లో వైసీపీ ఇప్పటికే వ్యూహ రచన చేస్తుంటే.. ఇక్కడ మాత్రం అలాంటి ఊసే లేదుసరికదా…. కనీసం ఫ్యాన్‌ స్విచ్చేద్దామన్న స్పృహకూడా లేకుండా పోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అందరిలోనూ ఒకటే క్వశ్చన్‌. అధిష్టానం ఇలాగే వదిలేస్తుందా? లేక టైం వచ్చినప్పుడు చూసుకుందామనుకుంటోందా అన్న సందేహాలు స్థానిక వైసీపీ నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి.

Exit mobile version