Off The Record: అమరావతిలో రాజధాని నిర్మాణం ఒక ఎత్తయితే… అందుకోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలు మరోఎత్తు. ఒకవైపు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే… ఇంకోవైపు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు, రెండో విడత భూ సమీకరణకు సంబంధించిన సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇక్కడే కొత్త అస్త్రాలకు పదును పెడుతోందట ప్రతిపక్ష పార్టీ. బాధిత రైతుల తరపున వైసీపీ డైరెక్ట్గా యాక్షన్లోకి దిగే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి ఆగమేఘాల మీద పార్టీ తరపున ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడమే ఇందుకు ఉదాహరణ అంటున్నారు పరిశీలకులు. రాజధాని ప్రాంతానికి చెందిన కొందరు రైతులు తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ను కలిశారు. వాళ్ళు తమ సమస్యల్ని చెప్పిన వెంటనే పార్టీ కమిటీలు ఏర్పాటవడం చూస్తుంటే… ఈ విషయలో విపక్షం ఎంత సీరియస్గా ఉందో అర్ధమవుతోందని అంటున్నారు ఈ వ్యవహారాలను దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు. అమరావతి రైతుల సమస్యల్ని క్షేత్రస్థాయి పరిశీలించడం కోసం పార్టీ తరపున కీలకమైన సీఆర్డీఏ కమిటీ ఏర్పాటైంది. బలవంతపు భూ సమీకరణకు తాము వ్యతిరేకమని.. తాము అధికారంలోకి వచ్చాక అవసరమైతే భూముల్ని తిరిగి ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని జగన్ చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
ప్రభుత్వం చెబుతున్నట్టు అమరావతిలో అంతా పారదర్శకంగా ఏమీ లేదని, చాలా మందికి తీవ్రమైన అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే వైసీపీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని అంటున్నారు. 400 మందికి పైగా రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇంకా కేటాయించాల్సి ఉందని చెప్పుకుంటున్నారు. కొన్ని భూములపై కోర్టు కేసులు కొనసాగుతుండగా.. వాటి పరిష్కారం తర్వాతే ప్లాట్లు కేటాయిస్తామని అంటోందట ప్రభుత్వం. లంక భూములకు సంబంధించిన సమస్యలు కూడా ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని తెలుస్తోంది. రెండు వేలకుపైగా ప్లాట్లు వివిధ కోర్టు వివాదాల్లో ఉన్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ఇలా అధికారికంగా వెలుగులోకి వచ్చిన సమస్యలతో పాటు.. బయటకు రాని ఇబ్బందులు కూడా చాలానే ఉన్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కోర్టులకు వెళ్లే స్థోమత లేక.. ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం చాలని చాలామంది రైతులు తమ సమస్యలను బయటపెట్టలేకపోతున్నారని వైసీపీ నేతలు గుర్తించినట్లు సమాచారం. అలాంటి వారికి అండగా ఉండి న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ అధ్యక్షులు పేర్ని నాని, అంబటి రాంబాబులతో పాటు దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, నందిగం సురేష్, దొంతిరెడ్డి వేమారెడ్డి, వనమా బాల వజ్రబాబులకు ఈ కీలక కమిటీలో చోటు కల్పించారు.
కేవలం రాజకీయ కమిటీ మాత్రమే కాకుండా…. కోర్టుల్లో పోరాడేందుకు పార్టీ లీగల్ సెల్ నుండి పొన్నవోలు సుధాకర రెడ్డి లాంటి వాళ్ళను కూడా రంగంలోకి దించారు. ఇప్పటివరకు రాజధాని విషయంలో అధికార కూటమి వాదనలే ఎక్కువగా వినిపించాయని, అందుకే రైతుల సమస్యల పేరుతో వైసీపీ ప్రత్యామ్నాయ వేదికను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి విడతలో రిటర్నబుల్ ప్లాట్లు అందని రైతులు, రెండో విడత భూ సమీకరణలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, కోర్టుల చుట్టూ తిరగలేని బాధితులు.. ఇలా అన్ని వర్గాల వాళ్ళను సపోర్ట్ చేయడమే ప్రతిపక్ష పార్టీ అజెండాగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో… అమరావతి రైతులు ఏం కోరుకుంటే అది చేస్తాం.. బలవంతపు భూసేకరణ అనేదే ఉండదు.. అవసరమైతే భూములు వెనక్కు ఇస్తాం.. ప్రస్తుతానికి మనం చేయగలిగింది న్యాయ పోరాటం మాత్రమేనన్న జగన్ మాటల చుట్టూ గట్టి చర్చలే జరుగుతున్నాయి. ఇదే సమయంలో… తమ మావిగన్ ప్రతిపాదన అయితే… అమరావతి ప్రాంత రైతుల నుంచి మరోసారి భూములు తీసుకోవాల్సిన అవసరం ఉండదన్న వాదనను తెరపైకి తెస్తోంది వైసీపీ. మొత్తం మీద అమరావతి రైతుల సమస్యలను కేంద్రంగా చేసుకుని వైసీపీ లీగల్ అస్త్రంతో డైరెక్ట్ వార్ డిక్లేర్ చేసినట్టేనన్నది విస్తృతాభిప్రాయం. భూ సమీకరణ బాధితులకు అండగా నిలవడం ద్వారా రాజధాని పేరుతో ప్రభుత్వానికి వస్తున్న మైలేజీకి బ్రేకులు వేయాలన్నది విపక్షం స్కెచ్గా కనిపిస్తోంది. మరి ఈ లీగల్ ఫైట్కు రైతులు కలిసి వస్తారా…? కూటమి ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ ఉంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో.
