Off The Record: తెలంగాణలో పురపోరు ముగిసింది. పట్టణ ఓటర్ తీర్పు చెప్పేశాడు. ఇక రిజల్ట్ కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా వెయిటింగ్. గతానికి భిన్నంగా ఈ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పక్షాలు విస్తృతంగా ప్రచారం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల రేంజ్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నిటినీ వాడేశారు లీడర్స్. ఎవరికి వారు గెలుపు ఓటముల లెక్కల్లో మునిగి తేలుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఇప్పుడు కూడా ఎక్కువ మున్సిపాలిటీల్లో త్రిముఖ పోరే నడిచింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సంగతి కాసేపు అలా ఉంచితే…. ఈసారి బీజేపీ లెక్కలు మాత్రం వేరుగా ఉన్నాయట. వచ్చే ఎన్నికల్లో సీఎం సీటే టార్గెట్ అంటున్న కమల దళం… అందుకు మున్సిపల్ ఎలక్షన్స్ని ట్రయల్ రన్గా భావిస్తోందన్న చర్చలు సైతం జరిగాయి ఎన్నికలకు ముందు. ఇప్పుడు పార్టీ నాయకత్వం ఆలోచనలు, అంచనాలు ఆ విషయాన్నే నిర్ధారిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మున్సిపల్ ఎన్నికల మీద భారీ ఆశలు పెట్టుకుంది బీజేపీ. రెండంకెల మున్సిపల్ ఛైర్మన్ సీట్లను, ఓవరాల్గా వెయ్యికి పైగా వార్డ్లను గెలుచుకుంటామని ధీమాగా ఉంది తెలంగాణ బీజేపీ. ఈసారి కేంద్ర పార్టీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం, స్పెషల్ ఇన్ఛార్జ్లు ఇక్కడే ఉండి పర్యవేక్షించడం లాంటివి కలిసి వస్తాయని అంటున్నారు.
అదంతా ఒక ఎత్తయితే… ఇక మున్సిపల్ ఫలితాల తర్వాతి నుంచి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ముందుగా బీఆర్ఎస్ను టార్గెట్ చేయాలనుకుంటున్నారట. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వచ్చే ఫలితాలను అనాలసిస్ చేసుకుని ఒక నిర్ధారణకు రావాలనుకుంటున్నట్టు సమాచారం. పోలింగ్ సరళిని బట్టి చూస్తుంటే… వాతావరణం తమకు అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తోందని, టార్గెట్ పెట్టుకున్న వరకు గ్యారంటీగా గెలుస్తామని అంటున్నారు బీజేపీ నాయకులు. ప్రస్తుతం బీఆర్ఎస్లో అంతర్గతంగా జరుగుతున్న, జరిగిన పరిణామాలు కావొచ్చు, ఎన్నికల్లో ఆ పార్టీ నేతల ప్రచార తీరు కావొచ్చు… అన్నీ కలగలిసి కేడర్లో ఉత్సాహం నింపలేకపోయాయని, అదే తమకు ప్లస్ అవుతుందన్న అంచనాల్లో ఉన్నారు కాషాయ లీడర్స్. కారు పార్టీ నెగెటివ్ తమకు కలిసి వస్తుందన్నది వాళ్ళ లెక్క. గులాబీ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో చూపించినంత ప్రభావం ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో చూపించలేకపోవచ్చని, పుర పోరులో తాము గట్టి ఫైట్ ఇచ్చామన్న అభిప్రాయంతో ఉన్నారు బీజేపీ నాయకులు. అధికార పార్టీగా కాంగ్రెస్ను పక్కనపెడితే…. ప్రతిపక్షాల్లో తమదే పైచేయి అవుతుందని మాట్లాడుకుంటున్నారట.
కార్పొరేన్స్లో బీఆర్ఎస్కన్నా ఎక్కువ డివిజన్స్ తామే గెల్చుకుంటామని, ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపును కొనసాగించి ఇక రాజకీయంగా గులాబీ వికాసాన్ని అడ్డుకుంటే… తామే ప్రత్యామ్నాయ శక్తి అవుతామన్నది కమలం నేతల కేలిక్యులేషన్. స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అయితే ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎవరి వైపు చూస్తారన్నది ముఖ్యమని, ఆ శక్తి తామే కావాలన్నది బీజేపీ ప్లాన్. గత మున్సిపల్ ఎన్నికల్లో వన్ సైడ్ కొట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేకపోతే…. ఆ పార్టీ లీడర్స్, కేడర్ మీద నైతికంగా దెబ్బ పడుతుందని, అదే సమయంలో తమ పార్టీలో కాన్ఫిడెన్స్ పెరిగి దూకుడుగా ముందు వెళ్తామన్నది కాషాయం లెక్క. ఫలితాలు ఎలా ఉంటాయి? వాటినిబట్టి పరిణామాలు ఎలా మారతాయన్న ఉత్కంఠ పెరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో.
