NTV Telugu Site icon

Off The Record: పావలా పనికి.. రూపాయి పావలా ప్రచారం..! ఆ ఎంపీ పబ్లిసిటీ కోసం పరువు తీసుకుంటున్నారా?

Mp Appalanaidu

Mp Appalanaidu

Off The Record: విజయనగరం ఎంపీగా తొలిసారి గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు నిత్యం ప్రజల్లో ఉండాలని అనుకోవడం వరకు బాగానే ఉందిగానీ… అందు కోసం ఆయన చేస్తున్న స్టంట్స్‌ పరువు తీసేస్తున్నాయన్న టాక్‌ బలంగా ఉందట నియోజకవర్గంలో. చిన్నచిన్న విషయాలను సాతం తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పడుతున్న తాపత్రయంతో మొత్తం బూమరాంగ్‌ అవుతోందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఎంపీగా ఎన్నికైన వెంటనే తాను చిన్నప్పుడు చదివిన ప్రభుత్వ హాస్టల్ గుర్తుకు వచ్చిందట అప్పలనాయుడుకు. వెంటనే శ్రీకాకుళం జిల్లాలోని ఆ హాస్టల్‌లో వాలిపోయి… రాత్రి భోజనం, బస అక్కడే చేశారాయన. ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చూసుకుని మురిసిపోయారు. బస్‌… ఇక అక్కడితో ఆ మేటర్‌ అయిపోయింది. తను కోరుకున్న ప్రచారం వచ్చేసిందని సంబరపడిపోయిన ఎంపీగారు…. ఆ తర్వాత ఆ హాస్టల్ సంగతే మర్చిపోయారు. అక్కడి విద్యార్థుల సమస్యలు తీర్చాలన్న కనీస ప్రయత్నం కూడా జరగలేదన్నది లోకల్‌ టాక్‌.

Read Also: West Bengal: కోల్‌కతాలో ఘోరం.. మెడికల్ విద్యార్థిని హత్య.. పరిస్థితి ఉద్రిక్తత

ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీ వెళ్లేముందు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలిశారు కలిశెట్టి. అప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నావా ? డబ్బులున్నాయా? మన వాళ్లతో చెప్పి చేయించమంటావా ? అని చంద్రబాబు అడిగారట. పార్టీ అధ్యక్షుడిగా, కింది స్థాయి నుంచి వచ్చిన లీడర్‌ గురించి చంద్రబాబు ఆ కేర్‌ తీసుకోవడం వరకు ఓకే. కానీ… దాన్ని కూడా కలిశెట్టి తన పబ్లిసిటీ కోసం విచ్చలవిడిగా వాడేస్తున్నారని గుసగుసలాడుకుంటోందట లోకల్‌ పార్టీ కేడర్‌. తాను చాలా పేదవాడినని, తన బీదరికం సంగతి తెలిసే బాబుగారు అలా అడిగారని, కనీసం ఢిల్లీకి ఫ్లైట్‌ టికెట్టు కొనుక్కోలేని స్థితిలో ఉన్నానంటూ కలరింగ్‌ ఇచ్చేశారట. ఆ సంగతి తెలిసినవారంతా… అవునా? నిజమా? విజయనగరం ఎంపీ నిజంగానే అంత పేదవాడా? అని ఆశ్చర్యపోతూ ఆరా తీశారట. అప్పుడే అసలు మేటర్‌ బయటపడి అలా సానుభూతి వరదలో మునిగి తేలినవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారట. అప్పల్నాయుడి పబ్లిసిటీ స్టంట్‌ చూసి నోరెళ్లబెట్టారట.

Read Also: MLC Duvvada Srinivas House: ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్‌..

ఎన్నికల సమయంలో కలిదిండి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ 6 కోట్ల 23లక్షల 65వేల187రూపాయలని, అప్పులు 2కోట్ల 12లక్షల 36వేల 714 రూపాయలని పేర్కొన్నారు. భార్యపేరున కూడా లక్షల్లో ఆస్తులు, బ్యాంక్ బేలన్స్ ఉన్నట్టు అఫిడవిట్ సమర్పించారాయన. ఇవి కాకుండా సుమారు 5 కోట్లకు పైనే విలువ చేసే వ్యసాయ భూములు ఉన్నట్టు వివరించారు. వీటితో పాటు ప్రైవేట్ స్కూల్, కాలేజుల్లోనూ వాటాలున్నట్టు సమాచారం. మరి ఇన్ని రకాలుగా ఆస్తులున్న కోటీశ్వరుడు సడన్‌గా నెలన్నరలోనే… ఫ్లైట్‌ టిక్కెట్‌ కొనుక్కోలేనంత కటిక పేదలా ఎలా మారిపోయారు? ఇంతలోనే అన్ని ఆస్తులు ఆవిరైపోయాయా అంటూ ఎకసెక్కాలాడే వాళ్ళు పెరిగిపోతున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆయన అలా కలరింగ్‌ ఇచ్చారని, ప్రచార యావ ఉండాలిగానీ… మరీ ఈ రేంజ్‌లోనా అంటూ నోళ్ళు నొక్కుకుంటున్నారట విజయనగరం జనం. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్‌లో ఎంపీ సాబ్ ఆస్తుల చిట్టా చూసిన వాళ్ళు… పబ్లిసిటీ కోసం మరీ ఇంత చీప్‌ స్టంటా అని చిరాకు పడుతున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఇటీవల ఫ్రెండ్‌షిప్‌ డే రోజున తన చిన్ననాటి పాత స్నేహితుల్ని పిలిపించుకుని ఈత కొట్టడం, ఎంపీగా మొదటి జీతం అమరావతి రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇస్తానని ప్రకటించడం లాంటివన్నీ ప్రచారయావే పరమావధిగా చేస్తున్నట్టు గుసగుసలాడుకుంటున్నారు.

Read Also: MLC Duvvada Srinivas House: ఎమ్మెల్సీ దువ్వాడ ఇంటి దగ్గర మళ్లీ టెన్షన్‌..

వాస్తవానికి అప్పలనాయుడు శ్రీకాకుళం జిల్లావాసి. రణస్థలం టీడీపీలో కింది స్థాయి నాయకుడిగా కొనసాగారు. ఉన్నత విద్యావంతుడు కావడంతో కింది స్థాయి కేడర్‌కు, నియోజకవర్గ స్థాయి నాయకులకు మోటివేషనల్‌ క్లాస్‌లు చెప్పేవారు. అలా అలా పరిచయాలు పెరిగి ఎంపీ సీటు దక్కించుకోవడం, పార్టీ వేవ్‌లో గెలవడం జరిగిపోయాయి. అంతవరకు బాగానే ఉంది. కింది స్థాయి నుంచి వచ్చిన నాయకుడిగా ఆయన టాలెంట్‌ను గౌరవించాల్సిందేగానీ… ఈ అతి పోకడల్నే భరించలేకపోతున్నామని అంటున్నారట విజయనగరం టీడీపీ లీడర్స్‌. పావలా సీన్‌కు రూపాయి పావలా పబ్లిసిటీ అవసరమా అప్పలనాయుడూ అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ఆ ఫోకస్‌ ఏదో నియోజకవర్గం అభివృద్ధి మీద పెట్టి… జనం మనసులో స్థానం సంపాదించుకుంటే… ఇన్ని తంటాలు అవసరం లేదు కదా అన్న సలహాలు సైతం వస్తున్నాయట. ఇకనైనా ఎంపీ గారు వాస్తవాలు గ్రహించి కాస్త హుందాగా వ్యవహరిస్తారా? లేక నా దారి నాదేనని అంటారో చూడాలంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌.