Off The Record: రాష్ట్రం మెత్తం ఒక లెక్క, మా జిల్లా తీరు మరో లెక్క అంటున్నారు సిక్కోలు వైసీపీ ద్వితీయ శ్రేణి లీడర్స్. ఇక్కడ పార్టీకి బలమైన నాయకత్వం, క్యాడర్ బేస్ ఉంది. కానీ… సమన్వయం చేసుకోవడంలోనే చతికిలపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే…ఇప్పుడప్పుడే కోలుకునే ఛాన్స్ కూడా ఉండబోదని పార్టీ వర్గాలో అంటున్నాయి. ఒకటి రెండు నియెజకవర్గాలు మినహా… ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్నిచోట్ల గ్రూప్స్ గోల ఉంది. పార్టీ కష్ట కాలంలో ఉన్నా… నేతల తీరు మాత్రం మారడం లేదంటోంది కేడర్. అప్పుడు అలా, ఇప్పుడు ఇలా అంటూ… ఇగోలకు పోతూ మరింత బలహీనపరుస్తున్నట్టు మాట్లాడుకుంటున్నారు. జిల్లాలోని అధికార కూటమి పార్టీలు మధ్య కొన్ని లొసుగులు ఉన్నా… అంతా ఒకే దారిలో వెళ్తున్నారని, మరి.. మనోళ్ళకు ఏమైందంటూ మధనపడుతున్నారట ఫ్యాన్ లీడర్స్. వర్గ విభేదాలు, నియెజకవర్గ స్దాయిలో ఉన్న గ్రూపులు పార్టీని మరింత బలహీన పరుస్తున్నాయన్న ఆందోళ వ్యక్తం అవుతోంది. ఎలాగూ… కేడర్ బేస్ ఉంది కాబట్టి.. అధిష్టానం ఇచ్చిన పిలుపును అందుకుని కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగితే… పూర్వపు స్థితి వస్తుందని, కానీ… ప్రస్తుతం చూస్తుంటే అలాంటి వాతావరణం ఏదీ కనిపించడం లేదని చెబుతున్నారు ద్వితీయ శ్రేణి నేతలు.
ఇచ్చాపురం, టెక్కలి, ఆమదాలవలస, నరసన్నపేట, రాజాం, ఎచ్చెర్ల, పలాస, పాతపట్నం…. ఇలా ఎటు చూసినా గ్రూపుల గోలే. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా విభేదాలున్నాయని, కాకుంటే… చిన్నగీతకు, పెద్ద గీతకు మధ్య ఉండే అంతరం తప్ప..గొప్పగా ఏం లేదని చెబుతున్నారు వైసీపీ లీడర్స్. అసలు వీటన్నిటికీ కారణం పార్టీ సీనియర్స్ వైఖరేనన్నది ద్వితీయ శ్రేణి మాట. ఇచ్చాపురంలో ఇన్ఛార్జ్ పిరియా విజయలక్ష్మి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కూడా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారట విజయలక్ష్మి. కానీ… నియెజకవర్గానికి చెందిన కొందరు కీలక నేతలు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు వెలగబెట్టిన వారు మాత్రం కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నట్టు సమాచారం. గతంలో యాక్టివ్గా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సైతం మున్సిపల్ ఛైర్పర్సన్ విషయంలో తేడాగా ఉన్నట్టు తెలుస్తోంది. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినా… వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఇప్పటికీ ఆయనతో టచ్ లోనే ఉన్నారట. ఆమదాల వలసలో కొత్త ఇంచార్జ్ చింతాడ రవికుమార్కు మాజీ స్పీకర్ తమ్మినేని వర్గం సహకరించడం లేదంటున్నారు. ఎచ్చెర్లలో మాజీ ఎమ్మెల్యే సైతం పార్టీ ఇంటర్నల్ ఇష్యూస్ తో సతమతం అవుతున్నారట. రాజాంలో కొత్త ఇంచార్జ్ డాక్టర్ తలేరాజేష్, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు వర్గాల మధ్య అంతే స్దాయిలో కోల్డ్ వార్ ఉందంటున్నారు.
ఇలా… ఏ నియెజకవర్గాన్ని చూసినా… ఎక్కడికక్కడ తన్నుకోవడాలు, తలంట్లు పోసుకోవడాలు తప్ప… కష్టాల్లో ఉన్న పార్టీని కలిసి నడిపిద్దామన్న స్పృహ ఒక్కరికీ ఉండటం లేదన్నది లోకల్ పార్టీ వాయిస్. ఇంకా మాట్లాడుకుంటే… ఇక్కడ టిడిపి బలం కంటే వైసిపి బలహీనతే ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు. సమస్యలు పరిష్కరించి…ముందుకు తీసుకువెల్లాల్సిన జిల్లాకు చెందిన బడానేతలు… నియెజకవర్గాల్లోని గ్రూపులను తమ ఆధిపత్యం కోసం వాడుకుంటూ పరిస్థితిని ఇంకా దిగజారుస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. బడా నేతల తీరులో మార్పు రాకుంటే భవిష్యత్లో సిక్కోలు వైసీపీకి సమస్యలు తప్పవన్నది ద్వితీయ శ్రేణి మాట.
