Off The Record: ప్రకాశం జిల్లా అధికార పార్టీలో పొలిటికల్ హీట్.. ఎంపీ VS మంత్రి..!

  • ప్రకాశం జిల్లా అధికార పార్టీలో పొలిటికల్‌ హీట్ ..
  • ఎంపీ మాగుంట, మంత్రి డోలా మధ్య వివాదం..
  • సింగరాయకొండలో విగ్రహం ద‌గ్గర‌ మొద‌లైన‌ వివాదం..
  • ఎంపీ నిధుల వినియోగంపైనా అంత‌ర్గత చ‌ర్చ ..
  • కొండెపి నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌పై అంచ‌నాలు..
  • అగ్రనేతల మధ్య ప్రొటోకాల్ రచ్చ..
Otr Ong Tdp

Otr Ong Tdp

Off The Record: ప్రకాశం జిల్లా అధికార టీడీపీలోనే ఇద్దరు అగ్ర నేతల మధ్య కోల్డ్ వార్‌ పీక్స్‌కి చేరింది. ఆ ఇద్దరిలో ఒకరు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాగా..మరొకరు రాష్ట్ర మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి. ఇద్దరి మ‌ధ్య సింగరాయకొండలో విగ్రహం ద‌గ్గర‌ మొద‌లైన‌ వివాదం…కనిగిరి వేదికగా రచ్చకెక్కింది. మ‌రోసారి అదే విగ్రహం వద్ద సర్కిల్ పేరుతో వ్యవహారం కేసుల వ‌ర‌కు వెళ్లిందట. గ‌తంలో సింగ‌రాయ‌కొండ అంబేద్కర్ గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వ‌ద్ద రోడ్డు విస్తర‌ణ కోసం దిమ్మెల‌ను ప‌గుల‌గొట్టారు. ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి వ‌ర్గీయులు ఈ విష‌యాన్ని ఆయ‌న‌కు చెప్పారు. అదే స‌మ‌యంలో గురుకుల పాఠ‌శాల‌లో ఓ కార్యక్రమానికి హాజ‌ర‌య్యేందుకు మంత్రి స్వామి, ఎంపీ మాగుంట అక్కడ‌కు వ‌చ్చారు. అయితే జ‌రిగిన ప‌రిణామంపై గుర్రుగా ఉన్న ఎంపీ మాగుంట ఆ కార్యక్రమానికి హాజ‌రు కాకుండానే వెళ్లిపోయారట. ఆ తర్వాత నేరుగా మంత్రి స్వామికి ఫోన్ చేసి..ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కోట్లు కావాలి కానీ.. మీకు మా విగ్రహాలు మాత్రం ఉండటం ఇష్టం లేదా?అంటూ ఘాటుగానే ప్రశ్నించినట్లు ప్రచారం న‌డిచింది. ఆ త‌ర్వాత ఇద్దరి మధ్య మ‌ళ్లీ ఇలాంటి ఇష్యూస్ రిపీట్ కాలేదని తెలిసింది. ఇద్దరి మ‌ధ్య స‌ర్దుబాటు జ‌రిగింద‌ని అంతా భావించారట. ఇలాంటి సమయంలోనే ఇద్దరి మ‌ధ్య కొన‌సాగుతున్న వివాదం మళ్లీ బ్లాస్ట్‌ అయ్యింది. కనిగిరి వేదికగా జ‌రిగిన ఓ కార్యక్రమం అనంత‌రం ఒక్కసారిగా బట్టబయలైన‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌ల కనిగిరిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి కేంద్రమంత్రులు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంత‌రం ముఖ్య నేత‌లంతా స‌మావేశ‌మ‌య్యారు. కేంద్ర ప్రభుత్వ ప‌థకాల‌తో పాటు ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంపైనా అంత‌ర్గత చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలిసింది. చ‌ర్చ స‌మ‌యంలోనే మంత్రి స్వామి త‌న కొండెపి నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించిన అంచ‌నాలు రూపొందించే స‌మ‌యంలో అస‌లు త‌న‌కు స‌మాచారం కూడా ఇవ్వడంలేద‌ని గ‌ట్టిగానే ప్రశ్నించారట. దీనికి ఎంపీ మాగుంట కూడా అదే రేంజ్‌లో ప్రతిస్పందించ‌టంతో ఇద్దరి మ‌ధ్య మాటామాటా పెరిగిన‌ట్లు తెలిసింది. అగ్రనేతల మధ్య ప్రొటోకాల్ రచ్చ.. వేదికపై ఉన్న మిగతా మంత్రులను సైతం విస్మయానికి గురిచేసిందనే ప్రచారం పొలిటికల్‌ సర్కిల్స్‌ వినిపించింది. దీంతో అక్కడే ఉన్న ఇత‌ర నేత‌లు జోక్యం చేసుకొని ఇద్దరిని కూల్ చేయ‌టంతో అప్పటికి ఆ వివాదం స‌ద్దుమ‌ణిగిందని టాక్‌. పార్టీ వర్గాలు ఈ విషయాన్ని బయటకు రాకుండా చేయాలని చూసినప్పటికీ వీలు కాలేదని తెలుస్తోంది.

×
×
Ad

కొద్ది రోజుల క్రితం మాగుంట శ్రీనివాసులు రెడ్డి వ‌ర్గీయుడు షేక్ సలీంబాషా సింగ‌రాయ‌కొండ అంబేద్కర్ గురుకుల పాఠశాల సమీపంలో ఉన్న మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వద్ద…మాగుంట సర్కిల్ అంటూ ఓ బోర్డును ఏర్పాటు చేయ‌టం చ‌ర్చనీయాంశంగా మారింది. సింగరాయకొండలో మాగుంట‌ సర్కిల్ పేరు చుట్టూ మొదలైన వివాదం అధికార పార్టీలో అంతర్గత విభేదాలపై కొత్త చర్చకు తెరతీసిందట. ఆ విగ్రహం ముందు మాగుంట స‌ర్కిల్ పేరు పెట్టడంపై స్థానిక టీడీపీ నేతలు వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ విషయాన్ని మంత్రి స్వామి దృష్టికి తీసుకెళ్లారు. అంతే..సీన్ రివర్స్ అయింది. మంత్రి ఆదేశాలతో అదే రోజు ఆ బోర్డును తొలగించి, అక్కడ బాలయోగి నగర్ సర్కిల్ అంటూ కొత్త బోర్డును పెట్టేశారు క్యాడర్‌. ఆ బోర్డు పెట్టిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసేందుకు సైతం రంగం సిద్ధమైన‌ట్లు టాక్ న‌డుస్తోంది. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత‌ల వ్యవ‌హారం కావ‌టంతో పోలీసులు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. దీనిపై మాగుంట రియాక్షన్ ఎలా ఉండ‌బోతుందనేదే ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ ప్రచారంపై ఇరువురు నేతలు ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. ఒక‌రు జిల్లా మంత్రి.. మ‌రొక‌రు ఎంపీ కావ‌టంతో ఎవ‌రికి ఎలా స‌ర్ది చెప్పాలో అర్థంకాక జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ముక్కు ఉగ్రన‌ర‌సింహారెడ్డి స‌హా ఇత‌ర నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌ర‌గుతోంది. ఇద్దరి మ‌ధ్య మొదలైన ఈ రచ్చ ప్రకాశం జిల్లా టీడీపీలో పెద్ద కుదుపునకు కారణమైందని భావిస్తున్నారట క్యాడర్‌. ఈ కోల్డ్ వార్ రాబోయే రోజుల్లో ఎలాంటి ట‌ర్న్స్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరి…ఈ వివాదానికి అధిష్టానం చెక్ పెడుతుందా?కూల్‌గానే స‌ర్దుబాటు అవుతుందా? మరింత ముదురుతుందా?చూడాలి మరి.