Off The Record: ఉమ్మడి వరంగల్ జిల్లా తాజా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హాట్ అయ్యాయి. తన మాటలతో ఆయన… కొందరికి క్లారిటీ ఇచ్చేశారా..? ఆ స్పష్టతతో వాళ్ళ ఆశలు గల్లంతయ్యాయా..? వాళ్ళు అనుకున్నదొకటైతే… అయ్యింది మరొకటా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల టిక్కెట్ మీద కొండంత ఆశ పెట్టుకుంది మంత్రి కొండా సురేఖ కుటుంబం. తమ కుమార్తె సుశ్మితను అక్కడి నుంచి పోటీ చేయించే ప్లాన్లో ఉన్నారట కొండా దంపతులు. కానీ… ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలతో వాళ్ళ ఆశల మీద నీళ్ళు చల్లినట్టయిందని అంటున్నారు పరిశీలకులు. మీకా ఛాన్స్ లేదని ఆయన చెప్పకనే చెప్పేశారా అంటూ చర్చించుకుంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డినే మళ్ళీ గెలిపించండని సభా వేదిక మీది నుంచి సీఎం పిలుపునివ్వడం గురించి హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో.
గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల పంచాయతీ సందర్భంగా కూడా… తాను పరకాలలో పోటీ చేసి తీరతానని ప్రకటించారు సుశ్మిత. అందుకు తగ్గట్టే అక్కడ ఫోకస్ కూడా పెడుతున్నారామె. ఈ సీట్లో తమ కుటుంబం నుంచే ఒకరు బరిలో ఉండాలని మొదట్నుంచి కొండా కుటుంబం ఆశిస్తోంది. కుమార్తెను ఇక్కడి నుంచే రాజకీయాలకు పరిచయం చేయాలన్నది కొండా సురేఖ, మురళి దంపతుల ప్లాన్. ఈ పరిస్థితుల్లో… తాజాగా సీఎం రేవంత్ రెడ్డి…పరకాల పర్యటనలో మాట్లాడిన మాటలు కొత్త చర్చకు దారి తీశాయి. వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్రెడ్డినే మళ్ళీ గెలిపించండని అప్పీల్ చేయడం ద్వారా… మళ్ళీ ఆయనే బరిలో ఉంటారని చెప్పకనే చెప్పేశారు. దీంతో… సీఎం…క్లారిటీ ఇవ్వాలనే ఇచ్చారా..? అనే చర్చే ఎక్కువగా నడుస్తోంది. ఐతే నియోజక వర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలులోకి వస్తే… అసలు రాజకీయ ముఖచిత్రం బయట పడుతుంది. ఆ సంగతి ఎలా ఉన్నా… ఇప్పటికైతే… సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనను అలా బయటా పెట్టేసినట్టున్నారని అంటున్నారు. ఆ స్టేట్మెంటే మంత్రి కొండా ఫ్యామిలీ ఆశల పై నీళ్లు చల్లినట్టు అయ్యింది. జిల్లాలో తరచూ రేగుతున్న వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యారా..? లేదంటే ఆ సీటు ప్రకాష్ రెడ్డిదేనని చెప్పాలనుకున్నారోగానీ… మొత్తం మీద ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మాత్రం..కొండా ఫ్యామిలీకి తీవ్ర నిరాశ మిగిల్చిందన్నది ఓరుగల్లు వాయిస్.

