Off The Record: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు వ్యవహారం గురించి ప్రస్తుతం రకరకాల చర్చలు జరుగుతున్నాయి, కొందరికి కొత్త కొత్త డౌట్స్ వస్తున్నాయి. అసలు ఆయన్ని ఏ కోణంలో చూడాలంటూ…పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. పైకి మంచి అనిపిస్తున్నా…. కాస్త లోతుల్లోకి తొంగి చూస్తే… ఎక్కడో ఏదో తేడా కొడుతోందని అనేవాళ్ళ సంఖ్య నియోజకవర్గంలోనే పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లోనే… తాజాగా టీడీపీ అధిష్టానం ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించి ఎంపీ పనితీరుకు సంబంధించిన ప్రశ్నలు సంధించడం కలకలం రేపుతోంది. 2019లో తొలిసారి నరసరావుపేట నుంచి వైసీపీ తరపున గెలిచారు లావు. 2024 ఎన్నికల్లో మరోసారి అక్కడి నుంచే బరిలో దిగాలని అనుకున్నా… గుంటూరు పంపాలని నిర్ణయించింది అధిష్టానం. ఆ క్రమంలోనే వైసీపీకి రాజీనామా చేసి కొన్నాళ్ళ తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారాయన. రెండోసారి సైకిల్ గుర్తు మీద నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో అందరూ టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా… మెల్లిగా పదవుల పంపకాల్లో శ్రీకృష్ణదేవరాయులుతో పాటు టీడీపీలో చేరిన వారికి ప్రాధాన్యత లభిస్తోందంటూ వివాదం మొదలైంది. వినుకొండకు చెందిన మక్కెన మల్లిఖార్జునరావుకు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి దక్కడం వెనక ఎంపీ చొరవ ఉందని పార్టీలో ప్రచారం జరిగింది. అలాగే…లావుతో పాటు టీడీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు మెంబర్గా అవకాశం లభించింది. ఎంపీ పరపతిని గట్టిగా వాడటం వల్లే వాళ్ళకు పదవులు వచ్చాయన్న టాక్ గట్టిగా నడిచింది పల్నాడు టీడీపీలో. అటు లోక్సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఎంపీకి టీడీపీ అధిష్టానం కూడా ప్రాధాన్యం ఇచ్చింది.
అదంతా ఒక ఎత్తయితే…శ్రీకృష్ణ దేవరాయలు పార్టీలో గ్రూప్స్ని ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ఇదే ఇప్పుడు సమస్యగా మారుతోందట. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన గ్రూపులు ప్రోత్సహించారన్న ఆరోపణలున్నాయి. టీడీపీలో కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నారంటూ లోకల్గా పార్టీలో అసహనం వ్యక్తం అవుతోంది. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబుతో ఎంపీకి పొసగడం లేదని చెప్పుకుంటున్నారు. ఎంపీతో సన్నిహితంగా ఉంటాడని పేరున్న నర్సరావుపేట జనసేన నేత తరచూ తమనేతను టార్గెట్ చేస్తూ ఆరోపణల డోస్ పెంచడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు ఎమ్మెల్యే వర్గీయులు. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలతో ఇప్పటికిప్పుడు విబేధాలు బయటపడకున్నా…అంతర్గతంగా ఏదో నడుస్తోందన్నది ఇంటర్నల్ టాక్. లావు తనతోపాటు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం టీడీపీలో కొంతమంది సీనియర్లకు ఇష్టం లేదట. నియోజకవర్గాల్లో తమ ప్రాధాన్యత తగ్గకుండా చూసుకోవాలన్న టార్గెట్తో… ముందు జాగ్రత్తగా ఎంపీ వర్గీయులకు చెక్ పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే… తాజాగా ఎంపీ పనితీరు ఎలా ఉందంటూ నియోజకవర్గంలో చాలా మందికి ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి. లావుకు పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఇస్తందని చెప్పుకుంటున్న టైంలో… ఆయన పనితీరు గురించి టీడీపీ అధిష్టానం సర్వే నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీకృష్ణదేవరాయలు వ్యవహారశైలి గురించి పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్ళడం వల్లే…ఈ సర్వే నిర్వహించారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎంపీ తీరు నచ్చని కొంతమంది నేతలైతే…. అవును, నిజమే…. అందుకే సర్వే చేశారంటూ బల్ల గుద్దుతున్నారు. మొత్తం మీద నరసరావుపేట టీడీపీలో ఇప్పుడు ఐవీఐర్ఎస్ ప్రకంపనలు రేగుతున్నాయి.
