NTV Telugu Site icon

Off The Record: మంత్రిగారి ఇంట్లో టికెట్ల రగడ..?

Minister Vishwaroop

Minister Vishwaroop

రాజకీయాల్లో ఒక స్టేజ్‌కు వచ్చాక.. వారసులను బరిలో దించాలని చూస్తారు నాయకులు. ఒక్కరే కొడుకో.. కూతురో ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువ మంది సంతానం ఉన్నప్పటికీ ఒక్కోసారి ఒక్కరే పోటీ చేస్తారు. అలాంటి సమయంలోనూ పెద్దగా ఇక్కట్లు ఎదురు కాబోవు. కానీ.. ఇంట్లో ఉన్న వారసులంతా పోటీ చేస్తామని భీష్మిస్తే..! వారసులతోపాటు తండ్రి కూడా పోటీ చేస్తానని మొండి కేస్తే..! ఇంటిలోనే రాజకీయ రసకందాయంలో పడటం ఖాయం. మంత్రి విశ్వరూప్‌ సైతం ఇదే ఇరకాటంలోనే పడ్డారట.

అమలాపురం ఎమ్మెల్యేగా ఉన్న విశ్వరూప్‌.. ప్రస్తుతం ఏపీ రవాణా మంత్రి. ఇటీవల ముంబైలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకుని రెండు నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో అనే చర్చ నడుస్తోంది. అమలాపురంలో వైసీపీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనే ప్రశ్నలు ఉన్నాయి. నియోజవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం ఆగిపోయింది. ఆ కార్యక్రమం చేపట్టాలని ఎంపీ అనురాధను అధిష్ఠానం ఆశించినా ఆమె ధైర్యం చేయడం లేదట. విశ్వరూప్‌ వర్గం ఎంత వరకు సహకరిస్తుందనే అనుమానాలు ఆమెకు ఉన్నాయట. ఇదే సమయంలో విశ్వరూప్‌ ఇంట్లో టికెట్‌ వార్‌ నడుస్తుందనే చర్చ మొదలైంది. విశ్వరూప్‌కు ఇద్దరు కుమారులు. పెద్దోడు కృష్ణారెడ్డి. రెండో వాడు శ్రీకాంత్‌. కృష్ణారెడ్డికి విశ్వరూప్‌ భార్య మద్దతు ఉందట. విశ్వరూపేమో చిన్నకుమారుడు శ్రీకాంత్‌కు మద్దతుగా ఉన్నారట.

కృష్ణారెడ్డిది దూకుడు స్వభావం కావడంతో శ్రీకాంత్‌ వైపు మంత్రి మొగ్గు చూపుతున్నారనేది కేడర్‌ వాదన. అమలాపురం అల్లర్ల తర్వాత వైసీపీ కేడర్‌ను కృష్ణారెడ్డి బెదిరించిన ఫోన్‌ ఆడియో వైరల్‌ అయింది. దాంతో మంత్రికి అండగా ఉన్న ఒక వర్గం దూరమైందట. మరో సామాజికవర్గం కూడా మంత్రిపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో విశ్వరూప్‌పై ఆ ప్రభావం పడుతుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఆ కారణంగానే శ్రీకాంత్‌ను ప్రోత్సహిద్దామనే ఆలోచనలో విశ్వరూప్‌ ఉన్నట్టు సమాచారం. ఇక్కడే మరో తిరకాసు ఉందట. అసెంబ్లీకి బదులు లోక్‌సభకు పోటీ చేస్తానని మొండికేస్తున్నారట శ్రీకాంత్‌. ఇదే అంశాన్ని జిల్లా వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్న ఎంపీ మిధున్‌రెడ్డి వద్ద శ్రీకాంత్‌ ప్రస్తావించారట. పెద్దోడు కృష్ణారెడ్డి అసెంబ్లీకి పోటీ చేస్తానని ఒత్తిడి తెస్తున్నారట. మంత్రి ఇంట్లో ఈ పంచాయితీ తెగడం లేదని సమాచారం.

అమలాపురం అల్లర్ల తర్వాత కాపు, బీసీ సామాజికవర్గాల స్పందన మంత్రికి నెగిటివ్‌గా ఉంటే.. మొదటికే మోసం వస్తుందనే చర్చ అధికార పార్టీలోఉందట. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో మాల సామాజికవర్గానికి కాకుండా.. మాదిగ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థికి మద్దతివ్వాలని ఓసీ, బీసీ ఐక్య వేదిక ప్రచారం చేస్తోంది. దీంతో దూరమైన వర్గాలకు చేరువయ్యేందుకు మంత్రి విశ్వరూప్‌ ప్రయత్నిస్తున్నారట. మళ్లీ తానే పోటీ చేస్తే ఎలాంటి సమస్య ఉండబోదని విశ్వరూప్‌ భావిస్తున్నారట. ఇబ్బందులను అధిగమిస్తే.. ఎన్నికల్లో గెలిచి మళ్లీ మంత్రి కావచ్చనే లెక్కల్లో ఉన్నారట విశ్వరూప్‌. ఇంతకీ ఇంట్లో విశ్వరూప్‌ మాట నెగ్గుతుందా? వారసుల పంతం గెలుస్తుందా? ఒకే ఇంట్లో ముగ్గురికి టికెట్స్‌ అంటే సాధ్యమా? దానికి పార్టీ అంగీకరిస్తుందా? కాదూ.. ఒక్కరికే అవకాశం ఇస్తామని అంటే.. బరిలో ఉండేదెవరు? ఇంటిపోరు నుంచి విశ్వరూప్‌ ఎలా బయటపడతారు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.