Off The Record: మాగంటి బాబు….. ఏలూరు మాజీ ఎంపీ. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసి, తర్వాతి పరిమామాలతో టీడీపీలో చేరి… 2014లో ఆ పార్టీ తరపున ఏలూరు ఎంపీగా ఎన్నికయ్యారాయన. 2019 ఎన్నికల్లో ఓడిపోయి… 2024లో మరో ఛాన్స్ కోసం చూసినా… పక్కన పెట్టేసింది టీడీపీ అధిష్టానం. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్కు అవకాశం ఇవ్వడంపై ఆగ్రహించిన మాగంటి…. పార్టీ కార్యక్రమాలకు దూరం జరిగారు. తాను ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ మాట మాత్రం చెప్పకుండా పక్కన పెట్టడాన్ని తీవ్ర అవమానంగా భావించారట ఆయన. అదే సమయంలో ఓవైపు కుటుంబ, మరోవైపు ఆరోగ్య సమస్యలతో పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు మాగంటి. ఆ దశలో ఆయన ఇక రాజకీయాల్ని వదిలేసినట్టేనా అన్న అనుమానాలు కూడా వచ్చాయి చాలామందికి. గత ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం ఇవ్వకపోవడానికి స్థానిక నేతలతో మాగంటి బాబుకు ఉన్న ఇబ్బందులు ఒక కారణమని చెప్పుకుంటారు టిడిపి నేతలు. 2014- 19 మధ్య ఎంపీగా పనిచేస్తున్నప్పుడు ఓవరాల్గా లోక్సభ నియోజకవర్గ అభివృద్ధి కంటే చింతలపూడి, పోలవరం, కైకలూరు లాంటి సెగ్మెంట్స్లో ఎక్కువగా వేలు పెట్టి వర్గ విభేదాలను పెంచి పోషించారనే విమర్శలు ఉన్నాయి.
తన వర్గం మాట నెగ్గించుకునేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో విభేదాలు పెంచుకున్నారన్నది కారణమైతే…. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆర్థికంగా సహాయపడలేకపోయారన్నది మరో కారణం. ఆ రెండిటి వల్ల స్థానికంగా మాగంటి మీద వ్యతిరేకత పెరిగిందట. ఇలాంటి ఇంకా అనేక అంశాలు కలిసి 2024 ఎన్నికల్లో ఆయన మరోసారి ఏలూరు పార్లమెంటు బరిలో లేకుండా చేశాయని చెప్పుకుంటారు. కనీసం సీనియర్ నాయకుడిగా అయినా పార్టీ పెద్దలు పట్టించుకోకుండా పుట్టా కుటుంబం నుంచి కొత్త అభ్యర్థిని తీసుకువచ్చి పోటీ చేయిచారు. ఈ విషయంలో తీవ్ర స్థాపనం చెందిన మాగంటి బాబు కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఏడాదిన్నర పాటు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ… ఇక తెగేదాకా లాగితే మనకే నష్టం అనుతున్నారోఏమోగానీ…. తిరిగి యాక్టివ్ అవబోతున్న సంకేతాలిస్తున్నారాయన. ఏలూరు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఇటీవల సుడిగాలి పర్యటనలు చేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ నేనున్నానని చెబుతున్నారాయన. ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం, ఆ కార్యక్రమానికి జిల్లా నాయకుల్ని ఆహ్వానించడంతో మాగంటి బాబు మళ్ళీ యాక్టివ్ అయ్యారన్న మాటలు వినిపిస్తున్నాయి.
దీంతో వచ్చే ఎన్నికలకు ఆయన సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే…. ఏలూరు పార్లమెంటు స్థానంలో మాగంటికి అవకాశం దొరకడం కాస్త కష్టమేనని అంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న బాబు పార్లమెంటు సీటు తిరిగి సంపాదించుకుంటారా అనేది అనుమానంటున్నారు పరిశీలకులు. అయితే…. కైకలూరు నియోజకవర్గంలో టీడీపీకి దీటైన నాయకుడు లేకపోవడం, అది మాగంటి సొంత నియోజకవర్గ కావడంతో ఫోకస్ అటువైపు మళ్ళే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు కొందరు. ఇప్పటికే పార్టీకి దూరమై కొంతమేర ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న మాజీ ఎంపీ వచ్చే ఎన్నికల నాటికి తన అవకాశాల్ని మెరుగుపరుచుకోవాలంటే ఇప్పటి నుంచే యాక్టివ్గా ఉండాలన్న విషయాన్ని గుర్తించినట్టు తెలుస్తోంది. టిడిపి పెద్దల దృష్టిలో మాగంటి బాబుకి మంచి స్థానమే ఉండడంతో.. అలకపానుపు ఎక్కకుండా పార్టీ కోసం కష్టపడి ఉంటే ఈపాటికే…. కనీసం మంచి నామినేటెడ్ పోస్ట్ అయినా వచ్చి ఉండేదని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఉన్న గుర్తింపు పోతూ… మెల్లిగా లైట్ తీసుకోవడం మొదలైపోవడంతో… ఇంతకు మించి లాగకూడదని డిసైడై మనసు మార్చుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా పార్టీ కోసం కష్టపడి పని చేస్తే తిరిగి సీనియర్ నాయకుడిగా అవకాశం కల్పించొచ్చు అన్న చర్చ నడుస్తోంది టీడీపీలో. మాజీ మంత్రిగా, మాజీ ఎంపీగా పనిచేసిన మాగంటి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అవుతుందో లేదో చూడాలి.