Site icon NTV Telugu

Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

Otr Janasena Party Strategy

Otr Janasena Party Strategy

Off The Record: రాజకీయ పార్టీలు వ్యూహకర్తల్ని నియమించుకోవడం, వాళ్ళ సలహాల ప్రకారం ముందుకుపోవడం సక్సెస్‌ఫుల్‌ ట్రెండ్‌. ఆ విషయంలో ఐ ప్యాక్‌ తర్వాతే ఎవరైనా. 2019లో వైసీపీ, ఐ ప్యాక్‌ కాంబినేషన్ సూపర్ హిట్ అయ్యాక సామాన్య జనంలో కూడా వ్యూహకర్తల చర్చలు జరుగుతున్నాయి. ఇక టీడీపీ చాలా కాలంగా బ్యాక్ ఎండ్‌లో టీమ్స్‌ని రన్ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడిక జనసేన వంతు వచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు. ఇప్పటి వరకు సొంత ఆలోచనలతోనే రాజకీయ ప్రయాణం చేసింది గ్లాస్‌ పార్టీ. గత ఎన్నికల్లో 100శాతం స్ట్రయిక్ రేట్ సక్సెస్‌ తర్వాత… భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకుని కొంత ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఓవైపు మిత్రపక్షాలతో సామరస్యంగా ఉంటూనే… మరోవైపు కూటమిలో తన పట్టు తగ్గకుండా… అదే సమయంలో క్షేత్ర స్థాయి నుంచి బలపడేందుకు ప్రత్యేకమైన వ్యూహాలను అనుసరించాలనుకుంటోందట జనసేన అధిష్టానం. పదవులు, రాజకీయ అవకాశాలు దక్కలేదంటూ కొన్నిచోట్ల కేడర్ డీలా పడినట్టు కనిపించినా…. విస్తృతమైన మెంబర్ షిప్ డ్రైవ్ ద్వారా జోష్ ఎక్కడ తగ్గలేదని చెప్పే ప్రయత్నం చేసింది. అదే సమయంలో పార్టీకి గట్టిపట్టుందని చెప్పుకుంటున్న ఉమ్మడి విశాఖ జిల్లాపై మరింతగా ఫోకస్‌ పెడుతోందట అధినాయకత్వం.

అవకాశం దొరికిన ప్రతిసారి ఉమ్మడి విశాఖకు వచ్చేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు పవన్‌కళ్యాణ్‌. అరకు, పాడేరు వంటి నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా తిష్టవేసిన సమస్యలకు తన శాఖ ద్వారా పరిష్కారం చూపించడంతో మంచి మైలేజ్ వస్తోందని చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు వివిధ కారణాలతో ఆలస్యం చేసిన రహదారులు., మౌలిక వసతులపై ఫోకస్డ్‌గా పనిచేయడం కలిసి వచ్చే అంశమని అంటున్నారు. ఇలాంటి వాతావరణంలో… తాజాగా పార్టీ తరపున విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఐ ప్యాక్ మాజీ టీం రంగంలోకి దిగడం ఆసక్తికరంగా మారింది. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ, ప్రభుత్వం పనితీరుకు సంబంధించి కేడర్, పబ్లిక్ ఒపీనియన్‌ను తీసుకుంటున్నారట సర్వే బృందం సభ్యులు. 30మంది ఉన్న టీమ్ ఇప్పటికే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంతర్గత సర్వే మొదలు పెట్టినట్టు తెలిసింది. వాళ్ళంతా గతంలో ఐ ప్యాక్‌లో పనిచేసిన అనుభవంతో బయటికి వచ్చిన వాళ్ళేనట. పార్టీ గ్రాఫ్, ఎమ్మెల్యేల పనితీరు సహా వివిధ అంశాల ప్రాతిపదికన ఫీడ్ బ్యాక్ రాబడుతున్నట్టు సమాచారం. ఇది పూర్తయిన తర్వాత మిగిలిన స్థానాల్లోనూ సర్వే నివేదికలు రూపొందించి జనసేన అధిష్టానానికి అందజేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్‌ కిషోర్‌ బీహార్ రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత ఐ ప్యాక్ నుంచి బయటకు వచ్చిన ఈ టీమ్ ఇటీవల బెంగాల్, తమిళనాడులోనూ పనిచేసింది. ఇప్పుడు అదే బృందం జనసేనకోసం వర్క్ చేయడం వెనుక కారణాలు ఆసక్తికరంగానే కనిపిస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కేడర్, లీడర్ షిప్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇక్కడ పవన్‌కళ్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ. అదే సమయంలో విశాఖ వైసీపీ, టీడీపీకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. గ్రేటర్ విశాఖలోని కీలకమైన నాలుగు అసెంబ్లీ సీట్లలో ఇప్పటి వరకు వైసీపీ బోణీ కొట్టలేకపోయింది. టీడీపీ నుంచి సీనియర్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నా కేడర్ పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేదు. రేపు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే….రాజకీయంగా విశాఖలో జనసేనకు మంచి స్కోప్ ఉంటుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. అన్నిటికీ మించి జీవీఎంసీలో స్థాన బలం సాధించడం గ్లాస్ పార్టీ ప్రధాన లక్ష్యంగా భావిస్తోంది. సంస్థాగతం నిర్మాణం పరంగా టీడీపీ, వైసీపీలతో పోల్చుకుంటే జనసేన చాలా బలపడాలి. జీవీఎంసీకి ఈ ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. అదే జరిగితే కూటమి పార్టీగా పోటీ చేసే అన్ని సీట్లను గెలవడం కీలకం. అందుకే…. లోకల్ బాడీ ఎన్నికలపై ఫోకస్ పెట్టి వ్యూహకర్తల టీం ను రంగంలోకి దించినట్టు తెలిసింది. ప్రస్తుతం వైజాగ్‌లో తిరుగుతున్న బృందాలు…..ఈ నెలాఖరు నాటికి పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. ప్రస్తుతానికైతే విశాఖ వరకు పరిమితం అయినా… ఆ రిపోర్ట్‌, దానికి పవన్‌ కన్విన్స్‌ అయ్యే తీరును బట్టి…వచ్చే మూడేళ్లు కూడా జనసేనకు వర్క్ చేసేందుకు కొత్త టీమ్ సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

Exit mobile version