Off The Record: రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అలా…. మిగతా వాళ్ళకంటే కాస్త డిఫరెంట్గా ఉండే ప్రయత్నం చేస్తారు అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. తాను పవర్లో ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ట్రెండ్ సెట్ చేశారు. పొలిటికల్ కెరీర్ తొలినాళ్లలో అదే ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది, ప్లస్ అయింది. కానీ…. ఐదేళ్ళు గడిచి 2024 ఎన్నికలు వచ్చేసరికి అదే రివర్స్ అయింది కూడా. గుడ్ మార్నింగ్ పేరుతో తిరుగుతూ ఎక్కడెక్కడ కబ్జాకు అనువైన భూములు ఉన్నాయో వెదుక్కునే వారంటూ కేతిరెడ్డి ప్రత్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని జనం నమ్మారా లేదా అన్న సంగతి అలా ఉంచితే…. 24 ఎన్నికల్లో మాత్రం వెంకట్రామిరెడ్డికి ఓటమి తప్పలేదు. తన ఓటమి తర్వాత వైరాగ్యంతో కొన్ని మాటలు, వాస్తవంలో చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొన్ని రోజులు నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉన్నా.. ఆ తర్వాత రీ ఛార్జ్ అయ్యారు కేతిరెడ్డి. అలాగే లోకల్ కేడర్కు కూడా బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారాయన. ఈ క్రమంలో తాజాగా చేసిన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాశం అయ్యాయి. ఆయన ఎందుకలా మాట్లాడారంటూ రకరకాల విశ్లేషణలు చేసేస్తున్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే…. ధర్మవరంలో మరోసారి గుడ్ మార్నింగ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ఇటీవల చెప్పుకొచ్చారు.
గతంలో తాను గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేస్తే ఆస్తులు కబ్జా చేసేందుకు వెళ్ళినట్టు ప్రచారం చేశారని, నేనేదో మంచి చేద్దామని వెళ్ళి చెడు మూటగట్టుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. ఆ కబ్జాలేంటో నిరూపించమని సవాల్చేసి రెండేళ్లు టైం ఇచ్చినా ఏ ఒక్కరూ నిరూపించలేకపోయారన్నారు. అందుకే… అనే వాళ్లు అంటుంటారు, మనమెందుకు వెనక్కి తగ్గాలనుకుంటూ మరోసారి ప్రజా క్షేత్రంలోకి వెళ్తానని చెప్పారు. అంతవరకు బాగానే ఉన్నా…ఆ తర్వాత అన్నమాటలే కలకలం రేపుతున్నాయి. నియోజకవర్గంలో ఇప్పుడు ఎవరైతే వైసీపీని వీడి పోతారో… వాళ్ళకు ఇక పర్మినెంట్గా డోర్స్ క్లోజ్ అని చెప్పేశారాయన. ప్రస్తుతం రాజకీయాల్లో జంప్ జిలానీలకు కొదవ లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కొందరు పార్టీలు మారడం సహజంగా చూస్తుంటాం. అధికారం పోయాక.. పార్టీని వీడే వారు కూడా ఉంటారు. గతంలో ధర్మవరం వైసీపీలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. కేతిరెడ్డి కూడా అలాంటి వారిని లైట్ తీసుకుని పార్టీలో జాయిన్ చేసుకునే వారట. అయితే ఈసారి మాత్రం పార్టీ మారిన వారికి నో ఏంట్రీ బోర్డు పెట్టినట్టు చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నారాయన. ఇటీవల కొత్తగా పదవులు పొందిన నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులతో పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే. ఈ సమావేశంలో కేతిరెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు కొందర్ని భయపెడితే…, మరికొందరు వైసీపీ లీడర్స్ ఆశ్చర్యపోయారట.
గత సార్వత్రిక ఎన్నికల టైం నుంచి వైసీపీ వీడిన వారు ఎవరైనాసరే… తిరిగి పార్టీలోకి వస్తామంటే చేర్చుకునే పరిస్థితి లేదని కరాఖండీగా చెప్పేశారు కేతిరెడ్డి. శత్రువునైనా పార్టీలోకి రానిస్తానేమోగాని, ఇక్కడ డబ్బులు సంపాదించుకుని, దాన్ని నిలబెట్టుకునేందుకు వేరే పార్టీలోకి వెళ్లిన వారు మళ్లీ వస్తామంటే.. గేటు దగ్గరే చెప్పు సైజు నంబర్ ముద్ర పడేలా కొడతానంటూ హెచ్చరించడం హాట్ టాపిక్ అయింది. బంధువులు, స్నేహితులను అడ్డంపెట్టుకుని మళ్లీ పార్టీలోకి వస్తామంటే కుదరదని, వారిని రానిచ్చేది లేదన్నారు మాజీ ఎమ్మెల్యే. దీంతో అసలు కేతిరెడ్డి ఎందుకు ఇంత వైల్డ్గా రియాక్ట్ అయ్యారన్న చర్చలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న ఐదేళ్ళు తన వెంట నడిచిన చాలా మంది ఈసారి పార్టీ మారిపోయారట. గతానికి భిన్నంగా ఇప్పుడు నంబర్ చాలా ఎక్కువగా ఉండటంతో… వీళ్ళకు ఎంత చేసినా ఇంతేనా అన్న ఫ్రస్ట్రేషన్ పెరిగిందని, అందుకే అంత గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద వెంకట్రామిరెడ్డి వార్నింగ్ మాత్రం ధర్మవరం జంపింగ్ జపాంగ్స్కి గుబులు పుట్టిస్తోందట.
