Site icon NTV Telugu

Off The Record: ఏపీలో కూటమి ఉన్నన్నాళ్లు ఆ టీడీపీ లీడర్లు త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా?

Otr Varma And Vangaveeti

Otr Varma And Vangaveeti

Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో ఇద్దరు నేతల రాజకీయ భవిష్యత్‌ను గందరగోళలో పడేశాయి. ఒకరు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే… ఇంకొకరు వంగవీటి రాధా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు టిడిపి నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా ఉన్న వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ…టీడీపీ పెద్దలు ఆ వ్యవహారాన్ని స్మూత్‌గా డీల్ చేశారు. రాబోయేది మన ప్రభుత్వమే… వచ్చాక మీకు ఎమ్మెల్సీగా ప్రమోషన్‌ ఇస్తామని నచ్చజెప్పారు. ఆ విషయాన్ని ఓపెన్‌గానే చెప్పేశారు కూడా. అటు పవన్‌కళ్యాణ్‌ కూడా వర్మకు పొలిటికల్‌గా సపోర్ట్‌ చేస్తానని పలు సందర్భాల్లో చెప్పారు. అనుకున్నట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ… ఇంతవరకు తనకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదంటూ తీవ్ర అసహనంతో ఉన్నారట వర్మ. మరోవైపు వంగవీటి రాధా కూడా 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. అప్పుడు, ఆ తర్వాత 24 ఎన్నికల్లో కూడా రకరకాల ఈక్వేషన్స్‌తో పోటీకి దూరంగా ఉన్నారాయన. కానీ ప్రచారం చేశారు. మన ప్రభుత్వం వచ్చాక ప్రయారిటీ ఇస్తామని ఆయనకు కూడా కమిట్మెంట్ ఇచ్చారట పార్టీ పెద్దలు. ఇద్దరివీ వేరు వేరు ప్రాంతాలు, రెండు పరిస్థితులు వేరైనప్పటికీ ఇప్పుడు కలిపే డిస్కస్‌ చేసుకుంటున్నారు టీడీపీ నాయకులు.

పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి… అక్కడే వర్మకు పదవి ఇస్తే మరో పవర్‌ సెంటర్‌ తయారైపోయి లేనిపోని తలనొప్పులు వస్తాయని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పిఠాపురంలో ఆల్రెడీ టీడీపీ, జనసేన వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. లోకల్‌ లీడర్స్‌కు సెట్‌ కావడంలేదన్నది ఇంటర్నల్‌ టాక్‌. ఇలాంటప్పుడు వర్మకు పదవి, ప్రోటోకాల్ ఇస్తే ఆ రచ్చ మరింత పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో ఆచితూచి స్పందిస్తున్నారట పార్టీ పెద్దలు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయం, డిప్యూటీ సీఎంగా బాధ్యతల బరువు…. ఇలా రకరకాల కారణాలతో పవన్ కళ్యాణ్ తరచూ పిఠాపురం నియోజకవర్గానికి వచ్చే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు అదేచోట వర్మకు హైప్ ఇస్తే… లేని పంచాయతీల్ని తయారు చేసినట్టవుతుందన్నది టీడీపీ అధిష్టానం ఆలోచన. అందుకే ఇక కూటమి ఉన్నన్నాళ్ళు పిఠాపురంలో వర్మకు నో ఛాన్స్‌ అన్న చర్చలు జరుగుతున్నాయి టీడీపీలో. మరోవైపు వంగవీటి రంగా వారసుడు రాధా, పవన్ కళ్యాణ్ ఇద్దరిదీ కాపు సామాజికవర్గమే. రెండూ కులంలో ప్రభావం చూపగలిగిన కుటుంబాలే. ఈ పరిస్థితుల్లో…. టీడీపీ తరపున రాధాకి ప్రయారిటీ ఇస్తే….పవన్‌కు అంత కంఫర్ట్‌గా ఉండదేమోనన్న ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే సామాజిక వర్గ పరంగా కూడా సున్నితమైన అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారట. అందుకే ఆ ఇద్దరి జోలికి పార్టీ వెళ్లడం లేదని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. టిడిపిలోని కాపు నేతలైతే…. ఒక అడుగు ముందుకేసి కులానికి సంబంధించినంతవరకు పార్టీ పెద్దలు ఇప్పుడున్నదానికి మించి ఆలోచించకపోవచ్చని అంటున్నారు.

కానీ… ఇటు వర్మ, అటు రాధ అనుచరులు మాత్రం పదవుల మీద గంపెడాశలు పెట్టుకున్నారు. తమ నాయకుల్ని పార్టీ వాడుకుని వదిలేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్ని ఎన్నికలకు ముందు అంచనా వేయలేకపోయారా? స్ట్రాటజీలు అప్పుడేమయ్యాయంటూ నిలదీస్తున్నారు. వైసీపీ నుంచి రాధా ఏ పరిస్థితుల్లో బయటికి వచ్చారో టిడిపి పెద్దలకు కూడా తెలుసు కదా…? అయినాసరే ఈ నాన్చివేత ధోరణి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అందరూ కంఫర్ట్ గా ఉండడం కోసం మావాళ్ళే త్యాగరాజులుగా మిగిలిపోవాలా అన్నది ఇద్దరు నాయకుల అనుచరుల ప్రశ్న. మోకాలికి, బోడి గుండుకి లింక్ పెట్టి మాట్లాడ్డం, కనీసం పరిగణనలోకి తీసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదిగో రాజ్యసభ సీటు, ఇదిగో ఎమ్మెల్సీ అంటూ ఈ ఇద్దరి గురించి చాలా చర్చలే జరిగాయి. కానీ పార్టీ మాత్రం అటువైపు ఆలోచించడం లేదన్నది ఇద్దరి అనుచరుల బాధ. కేలిక్యులేషన్స్‌లో తేడా వస్తే ఈక్వేషన్స్ మారుతాయని కూడా అంటున్నట్టు తెలిసింది. మొత్తం మీద ఈ ఇద్దరు నేతలకు పార్టీ అధికారంలో ఉన్నా పదవియోగం మాత్రం ఉండేట్టు లేదన్న వాదన బలంగా ఉంది. టీడీపీ పెద్దలు అటు కాన్స్ట్యుయెన్సీని,
ఇటు కమ్యూనిటీని బ్యాలెన్స్ చేసే క్రమంలో…ఈ ఇద్దర్నీ పర్మినెంట్‌గా పక్కన పెడతారా, లేక కాస్త లేటైనా లేటెస్ట్‌ పోస్ట్‌లు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version