Site icon NTV Telugu

Off The Record: కేటీఆర్ మీద డైరెక్ట్ గా కవిత అటాక్..! కవిత మాటలతో బీఆర్ఎస్ డిఫెన్స్‌లో పడిందా..?

Otr Kavitha

Otr Kavitha

Off The Record: శత్రువులు ఎక్కడో ఉండర్రా…. కూతుళ్లు, చెల్లెళ్ళ రూపంలో మారు వేషాల్లో మన కొంపల్లోనే తిరుగుతుంటారన్న పాపులర్‌ సినిమా డైలాగ్‌ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు పదేపదే గుర్తుకు వస్తోందట. ఎంత సర్దుకుపోదామన్నా…. చెల్లెలు కవిత అస్సలు వదిలిపెట్టం లేదని ఆయనలో అసహనం పెరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. కవిత తాజాగా అన్నను డైరెక్ట్‌గా అటాక్‌ చేయడం హాట్‌ టాపిక్‌ అవుతోంది. పైగా… ఏ విషయంలో అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేయాలని బీఆర్‌ఎస్‌ భావిస్తోందో… అదే సంగతి ప్రస్తావించి… అసలు ఆ వివాదాస్పద నిర్ణయానికి ఆద్యుడు కేటీఆరేనని చెప్పడం కలకలం రేపుతోంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్ళలో చాలా అవినీతి జరిగిందన్నారు కవిత. ముఖ్యంగా తన భర్త అనిల్ కుమార్ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇస్తూ… బీఆర్ఎస్ హయాంలో పెద్దపెద్ద బిల్డర్లకు అనుకూలంగా జీవోలు తెచ్చినట్టు చెప్పారు. అంతటితో ఆగకుండా డైరెక్ట్‌గా కేటీఆర్‌ మీద ఓ పెద్ద బాంబే వేసేశారు.

Read Also: Roja vs TDP: మాజీ మంత్రి రోజాపై టీడీపీ నేతల తీవ్ర వ్యాఖ్యలు..

హైదరాబాద్‌ శివారు ఇండస్ట్రియల్‌ ఏరియాల్లోని పారిశ్రామిక భూముల్ని మల్టీ పర్పస్‌ జోన్స్‌గా మార్చేందుకు ఉద్దేశించిన హిల్ట్‌ పాలసీని ఇటీవల ప్రకటించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. దీనికి సంబంధించి దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల భారీ స్కాం జరగబోతోందంటూ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌. ఇప్పుడు సరిగ్గా ఈ పాయింట్‌ మీదే కొట్టారు కవిత. ఇప్పుడేదో కొత్తగా జరిగిపోతున్నట్టు గుండెలు బాదుకుంటున్న కేటీఆర్‌ గతాన్ని మర్చిపోతే ఎలాగన్నది కవిత క్వశ్చన్‌. అసలీ హిల్ట్‌ పాలసీకి గతంలోనే పునాది పడిందని, బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడే జీవోలు ఇచ్చారని చెప్పి బీఆర్‌ఎస్‌ పెద్దలకు షాకిచ్చారు జాగృతి అధ్యక్షురాలు. పరిశ్రమల భూముల్ని రెసిడెన్షియల్ జోన్స్‌గా మార్చే జీవోలను కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు లిటరల్‌గా పార్టీ మీద పెద్ద బాంబ్‌ వేసినట్టేనని అభిప్రాయ పడుతున్నారు విశ్లేషకులు. ఇలాంటి హిల్ట్ విషయంలో సాధారణంగా కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తే అదో లెక్క. రాజకీయ ఆరోపణగా కొట్టిపారేసేవారు. కానీ స్వయంగా కేసీఆర్ కుమార్తె, అప్పట్లో ప్రభుత్వ వ్యవహారాలను అతి దగ్గరనుంచి చూసిన కవిత ఇలా మాట్లాడ్డంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. అప్పుడు అధికారం చెలాయించిన కుటుంబానికే చెందిన వ్యక్తి చెప్పారు కాబట్టి అందులో వాస్తవం ఉండి ఉండవచ్చన్న చర్చ సామాన్య జనంలో కూడా జరుగుతోందట.

హిల్ట్‌ పాలసీతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల అవినీతి చేయబోతోందని కేటీఆర్‌ ఆరోపించడం, అదే పాలసీకి కేటీఆర్‌ ఓకే చెప్పారన్న కవిత వ్యాఖ్యలతో…ఈ లెక్కన అప్పట్లో ఎన్ని లక్షల కోట్లు తిన్నారో అన్న చర్చలు సైతం మొదలయ్యాయి. కవిత ఇలా… అన్న మీదే డైరెక్ట్‌ అటాక్‌ మొదలుపెట్టడంతో… ఇక నుంచి పార్టీలో కేసీఆర్‌ మినహా ఎవ్వర్నీ ఉపేక్షించకపోవచ్చన్న అభిప్రాయం బలపడుతోంది. హరీష్‌రావు సహా… మాజీ మంత్రులు, కీలక నేతలంతా ఇప్పటికే కవిత రాడార్‌ పరిధిలోకి వచ్చారు. ఇప్పుడు డైరెక్ట్‌గా కేటీఆర్‌ హయాంలోనే ఓ పెద్ద భూ స్కామ్‌కు పునాది పడిందని చెప్పడాన్ని తక్కువగా చూడకూడదని అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. కవిత వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌ డిఫెన్స్‌లో పడిందన్న అభిప్రాయం పెరుగుతోంది పొలిటికల్‌ సర్కిల్స్‌లో. అయితే ఆమె ఆరోపణలకు కచ్చితంగా సమాధానం చెబుతామని అంటున్నారు పార్టీ నేతలు. వాళ్ల రియాక్షన్‌ ఎలా ఉంటుందో, అందుకు కవిత కౌంటర్‌ ఇంకెలా ఉంటుందోనన్న ఆసక్తి పెరుగుతోంది.

Exit mobile version