కూటమి ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని చర్యలు ఆ ఎంపీకి ఇబ్బందికరంగా మారాయా..అందుకే నేరుగా ఆయన రంగంలోకి దిగారా.. అంటే అవుననే సమాధానం వస్తోందట. తమ ప్రభుత్వం హయాంలో…తమ పార్టీకి చెందిన వారి ఇంటి కూల్చివేత వ్యవహారాన్ని ఎంపీ పర్సనల్ గా తీసుకోవటం వెనుక పెద్ద చర్చే జరుగుతోంది. నేరుగా ఎంపీ రంగంలోకి దిగటంతో రాజకీయం హాట్ హాట్ గా మారింది. కూల్చివేతతో రాబోయే రోజుల్లో జరిగే డ్యామేజ్ను అంచనా వేసిన సదరు ఎంపీ…ప్యాచప్ పనులు మొదలుపెట్టారా? ఇంతకీ ఎవరా ఎంపీ…డ్యామేజ్ కంట్రోల్ కారణాలపై జరుగుతున్న చర్చ ఏంటి?.
మచిలీపట్నంలో జనసేన పార్టీకి చెందిన కార్యకర్త శ్రీపతి వెంకటా చలం ఇంటి కూల్చివేత వ్యవహారం ఇప్పుడు కూటమిలో పొలిటికల్ రచ్చగా మారుతోంది. ఇక్కడ మచిలీపట్నం నుంచి ఎంపీగా జనసేన నుంచి బాలసౌరి గెలుపొందారు. పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న పార్టీ క్యాడర్ తో టచ్ లో ఉంటూ ఆయన తన పట్టు నిలుపుకుంటున్నారనే పేరుంది. మచిలీపట్నంలోని కొబ్బరి తోటలో జనసేన పార్టీకి చెందిన వెంకటా చలం అనే వ్యక్తి ఇల్లు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వెంకటా చలం ఎన్నికల సమయంలో కూటమి కోసం పనిచేయడంతో పాటు జనసేనకు సానుభూతిపరుడుగా ఉన్నారు. వెంకటా చలం ఇల్లు కూల్చివేత జరిగిన రోజు పేర్ని నాని కుమారుడు కిట్టు రావటంతో పోలీసులతో వాగ్వివాదం జరగడం వైరల్ గా మారింది. అదేరోజు మధ్యాహ్నం కూల్చివేతకు గురైన ఇంటి దగ్గరకు వచ్చిన పేర్ని నాని, బాధితుడు వెంకటా చలంను పరామర్శించారు. పేర్ని నాని ఎంట్రీతో ఈ వ్యవహారం కూటమిలో రచ్చకు కారణమైంది.
జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త వెంకటాచలం ఇంటి కూల్చివేత ఘటనపై పేర్ని నాని స్పందించడంతో వ్యవహారం ముదిరింది. కాపు సామాజిక వర్గానికి చెందిన వాడైనా, నీకోసం పనిచేశాడు కదా, అయినా ఇలా చేశావంటూ మంత్రి కొల్లు రవీంద్రను టార్గెట్ చేస్తూ పేర్ని మాట్లాడటం కూటమిలో హాట్హాట్ డిస్కషన్కు కారణమైంది. ఇదే సమయంలో స్థానిక జనసేన పార్టీ నేతలు కూడా ఇంటి కూల్చివేత వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు…ఎంపీ బాలసౌరికీ విన్నవించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండటం వల్లే ఇంటి నిర్మాణాన్ని కూల్చేస్తారన్న మంత్రి కొల్లు రవీంద్ర మాటలు….పుండు మీద కారంచల్లినట్టయ్యింది. కొల్లు వ్యాఖ్యానాలతో జనసేన క్యాడర్ మరింతగా లోలోన రగిలిపోతోందని లోకల్గా చర్చ నడుస్తోంది. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని ఎంట్రీ ఇవ్వటంతో ఎంపీ బాలసౌరి విషయాన్ని సీరియస్ గా తీసుకుని డ్యామేజ్ కంట్రోల్ కు రంగంలోకి దిగారని పొలిటికల్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.
జనసేన ఎంపీ అయ్యివుండి, అదే పార్టీ నేత ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నా, ఎంపీ ఏమీ చెయ్యలేకపోయారన్న అసంతృప్తి క్యాడర్లో కొంచెం రాజుకుంటోందన్న చర్చ స్థానికంగా వినిపించింది. అగ్గికి ఆజ్యం తోడైనట్టుగా ప్రతిపక్ష నేతలు లోకల్గా దీన్నొక పొలిటికల్ అజెండా చేసుకోవడంతో ఎంపీ బాలసౌరి ఆలస్యంగానైనా స్పందించారు. మరింత లేటయితే, క్యాడర్కు నెగెటివ్ సంకేతాలు వెళతాయని భావించిన బాలసౌరి… స్వయంగా వెళ్లి బాధితున్ని పరామర్శించారు. ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగిన అనేక ఇండ్లు ఉండగా, 40 లక్షలకు పైగా వెచ్చించి కట్టిన ఇంటిని అధికారులు కూల్చివేయడం అత్యుత్సాహం గా బాలసౌరి వ్యాఖ్యానించారు. మంత్రి కొల్లు రవీంద్రపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ అధికారుల తీరుపై మాత్రం ఆయన మండిపడ్డారు.
బాలసౌరి రంగంలోకి దిగటం వెనుక కూడా ఆసక్తికర చర్చ జరుగుతోందట. బందరు పార్లమెంటు పరిధిలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో పాటు జనసేనకు కూడా కాపు సామాజిక వర్గం అత్యంత సన్నిహితంగా ఉంటుందని భావించేవారు ఎక్కువ. అందుకే అదే పార్టీకి సంబంధించిన, అదే సామాజిక వర్గానికి చెందిన వెంకటాచలం ఇంటి కూల్చివేత వ్యవహారం పార్టీపై ప్రభావం చూపిస్తుందని బాలసౌరి ముందుగానే గుర్తించి ఆ ప్రభావం తగ్గించేందుకు నేరుగా రంగంలోకి దిగారు. తానే ఆ ఇంటిని తిరిగి నిర్మిస్తాను అని హామీ కూడా ఇచ్చారు. ఇదే సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వెంకటాచలం ఇంటి కూల్చివేతపై పేర్ని నాని స్పందించి కూటమిని ఈ ఘటనపై ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారని కూడా ఎంపీ వర్గంలో చర్చ జరుగుతోందట. పేర్ని నాని ముందుగా మాట్లాడటంతో కాపుల సానుభూతి ఆయనకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండటానికి బాలసౌరి నేరుగా రంగంలోకి దిగి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది.