Minister Roja : అధినేత పిలుపు ఆ కొత్త మంత్రికి ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్నట్లుగా మారిందట. అక్కడ జరిగే సమావేశానికి ఎవర్ని దూరం పెట్టాలి…ఎవరితో వెళ్లాలనేది ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. ఎవర్ని తీసుకొని వెళ్తే ఎలాంటి సమస్య వస్తుందో అర్థంకాక తెగ ఇబ్బంది పడుతున్నారు. వెళ్లకపోతే పరిస్థితి ఏంటో అర్థంకాక టెన్షన్ పట్టుకుందట. అసలు…ఎవరా మంత్రి?ఏంటా టెన్షన్?
మంత్రి రోజాకు కొత్త సమస్య వచ్చి పడిందట. అది కూడా అధినేత వల్లే ఆ సమస్య వచ్చిపడిందని సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ నియోజకవర్గాల్లోని స్థానిక నాయకులతో బేటీ అయ్యే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు సీఎం జగన్. జయాపజయాలతో నిమిత్తం లేకుండా పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న కార్యకర్తలకు, స్థానిక నాయకుల మధ్య సయోధ్య తగ్గుతోందనే ప్రచారం ఊపందుకుంటోంది. ఈ ప్రచారంలో వాస్తవాలను తెలుసుకొని అవసరమైన నష్ట నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు సామాన్య కార్యకర్తలకు తానున్నాననే ధీమాను ఇవ్వాలని భావిస్తున్నారట అధినేత. వివిధ శాసనసభ నియోజకవర్గాల వారీగా పార్టీ కోసం పనిచేసేవారితో, స్థానికంగా కీలక పదవులలో కొనసాగుతున్న వారితోనూ ముఖాముఖి మాట్లాడి వాస్తవాలను తెలుసుకునేందుకు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
ఇక…అందులో బాగంగానే తొలి భేటీ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాకు చెందిన కుప్పం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు జగన్. ఇప్పటికే వాళ్ళతో భేటి అయ్యారు. ఇప్పుడు నియోజకవర్గం ఏంటనే చర్చ నేతల్లో మొదలైందట. ముఖ్యంగా మంత్రి రోజాకు ఈ టెన్షన్ ఎక్కవైందని టాక్. అసలే గ్రూపులకు కేరాఫ్ అడ్రస్గా మారింది నగరి నియోజకవర్గం. ఇక్కడి నుంచి నేతలు అందరినీ అధినేత జగన్ వద్దకు ఎలా తీసుకొని వెళ్లాలని తెగ టెన్షన్ పడుతోందట రోజా వర్గం.
2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించిన నియోజకవర్గంలో పార్టీలోని గ్రూపు గోల రోజాకు పెద్దగా తలనొప్పిగా మారిందట. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు ఎప్పుడూ ఏదో ఒక రచ్చ అక్కడ జరగాల్సిందే. రోజా ప్రత్యర్ధి వర్గం సమావేశం ఏర్పాటు చేసుకుందట. రోజా మంత్రి అయ్యాక వ్యతిరేక వర్గం దూకుడు తగ్గలేదు. నగరి ప్లీనరీకి అందరూ డుమ్మా కొట్టారు. రోజా సైతం వారిని పిలవలేదు. తాజాగా గ్రానైట్ గొడవ తారాస్దాయికి చేరింది. ఇలాంటి సమయంలో అధినేత నియోజకవర్గాల మీటింగ్కు ఎలా వెళ్లాలో అనే ఆలోచన రోజాను తెగ ఇబ్బంది పెడుతోందని సమాచారం. వ్యతిరేక వర్గానికి చెప్పాలా?చెప్పకుండా వెళ్ళాలా?అలా వెళితే జగన్ ఏం అంటారోనని టెన్షన్లో ఉన్నారట. వ్యతిరేక వర్గం సైతం రోజా మీటింగ్కు పిలవకపోతే ఏం చేయాలన్నదానిపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారట.
కెకె కుమార్, రెడ్డివారి చక్రపాణిరెడ్డి,అమ్ములు సహా అందరూ కీలక నేతలే కావడంతో వీరిని వదిలేసి అమరావతికి వెళితే పరిస్థితి ఏంటనే డైలామాలో ఉన్నారట మంత్రి రోజా. మీటింగ్ కోసం ముందస్తుగా వడమాలిపేటలోని కొద్దిమంది నేతలతో సమావేశమైన రోజాకు షాక్ ఇచ్చారట అక్కడి నేతలు. ఆమె ముందే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారట. చివరికి మాటమాటా పెరిగి కొట్టుకునే స్ధాయిలో గొడవ జరిగిందనే ప్రచారం సాగుతోంది. దీంతో అధినేత దగ్గర జరిగే సమావేశంలోనూ ఇలానే జరిగితే ఇక అంతే సంగతి అని రోజా వర్గంలో హాట్హట్గా టాక్ నడుస్తోందట.
ఐతే…అధినేత జగన్ ముందుకు ఎవర్ని తీసుకెళ్లాలనే దానిపై రోజా తేల్చుకోలేకపోతున్నారట. తన నియోజకవర్గం వంతు ఎప్పుడు వస్తుందో ఏమో కానీ..ఈ వర్గాలు..ఆ వర్గాల్లోని కొందరు తన మీదే పడటంతో ఆమె కంగారు పడుతున్నారట. గిట్టని వారిని పక్కనపెట్టి..వదిలేసి వెళ్తే ఏం కొంప మునుగుతుందోననే భయంతో ఓ పక్క..ఇంకో పక్క తీసుకెళ్తే జగన్ ముందు తన చిట్టా విప్పితే ఏం అవుతుందోననే బెంగ మంత్రిని వేధిస్తోందట.
మరి ఇన్నాళ్లూ ఒక లెక్క.. జరగబోయే మీటింగు ఓ లెక్క అన్నట్లుగా పరిస్థితి మారింది. మంత్రి రోజా ఏం చేస్తారన్నదే ప్రస్తుతం ఆసక్తిగా మారింది.