OTR : నేను తెలుగు భాష లెక్క…. ఆడా ఉంటా, ఈడా ఉంటానన్నది పాపులర్ సినిమా డైలాగ్. ఈ డైలాగ్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో మరోసారి మోగిపోతోంది. కానీ…. కాస్త తేడాగా. ఆడా…ఈడా… అంటే నడవదు భయ్…! యాడుంటావో చెప్పు. ఛాయిస్ ఈజ్ యువర్స్…. అంటూ ఏకంగా ఓ ప్రభుత్వ సంస్థే లైన్ గీసేస్తోంది. డబుల్ డైలాగ్ ఎక్కడైనా ఓకేగానీ… మా దగ్గర మాత్రం కాదంటోంది. తేడా చేస్తే సర్తో సుర్రుమనిపిస్తామంటోంది. ఇంతకీ ఏంటా ఆడా..ఈడా..గోల? ఏ విషయంలో కొత్త ఇబ్బంది వచ్చింది?
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్… SIR. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్. రెండు చోట్ల ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. దీంతో డబుల్ ఓట్ల గురించి గట్టి చర్చలే జరుగుతున్నాయి, చాలా మంది ఓటర్లలో కంగారు కూడా మొదలైందట. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళలో ఈ టెన్షన్ కనిపిస్తోందని అంటున్నారు. ఏపీ మూలాలు ఉండి ఇక్కడ స్థిరపడ్డ చాలా మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. అలాగే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి సిటీలో సెటిలైన వాళ్ళలో ఎక్కువ మందికి కూడా సొంత ఊళ్ళో, హైదరాబాద్లో డబుల్ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలవడంతో వీళ్ళంతా ఏదో ఒక చోటును ఎంచుకోక తప్పని పరిస్థితి. ఆ గట్టునుంటావా…. నాగన్న ఈ గట్టునుంటావా అన్నట్టు ఏదో ఒక గట్టును ఎంచుకోకుంటే…. మొత్తంగా ఓటే మాయమైపోయే ముప్పు పొంచి ఉంది. కొందరికైతే రెండు, మూడు ఓట్లు కూడా ఉన్నాయట. అలాంటి వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఉంచుకోవాలి, ఎక్కడ వదులుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓటర్ ఎన్యూమరేషన్పై రకరకాల సందేహాలు, సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాదీల్లోనే ఈ గందరగోళం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. సిటీ ఓటు ముఖ్యమా…? సొంతూరి ఓటు కావాల్నా అన్న విషయంలో చాలామంది ఎటూ తేల్చుకోలేకపోతున్నారన్న చర్చలు జరుగుతున్నాయి.
గతంలో లాగా ఆడా…ఈడా అంటే సర్తో అస్సలు కుదరదు. హైదరాబాద్లో ఓటు ఉన్నవాళ్ళు తమ సొంతూర్లో కూడా కొనసాగిస్తామంటే ఏదో ఒకటి ఎగిరిపోవడం ఖాయం. సరిగ్గా ఇక్కడే రాజకీయ పార్టీల్లో కూడా కొత్త భయాలు పెరుగుతున్నాయట. సిటీ, శివారు ప్రాంతాల్లో తమ మద్దతుదారులుగా ఉన్నవాళ్ళు ఊళ్ళకే ప్రయారిటీ ఇస్తే… ఇక్కడ ఇబ్బందులు వస్తాయని కొన్ని పార్టీల అధినాయకత్వాలు భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ విషయంలో బీజేపీ నాయకులైతే… అందరికంటే ముందే ఓపెన్ అయిపోయారు. ఆంధ్రా మూలాలు ఉన్న వాళ్ళయినా, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల వాళ్ళయినా… ఎవరైనా సరే… హైదరాబాద్ సిటీలో ఓటు ఉంటే మాత్రం అస్సలు వదులుకోవద్దని విజ్ఞప్తి చేస్తోంది కాషాయ దళం. ఊళ్ళలో సంగతి అక్కడి వాళ్ళకు వదిలేయండి గానీ… మీ హైదరాబాద్ ఓటును మాత్రం అస్సలు వదులుకోవద్దని కోరుతోంది. అందుకో ప్రత్యేకమైన కారణాన్ని కూడా చెబుతున్నారు కమలం లీడర్స్. సిటీ ఓటర్లలో హిందువులు మైనార్టీలు అయిపోతున్నారన్నది వాళ్ళ వాదన. గ్రేటర్ పరిధిలో ఉండే హిందువుల ఓట్లు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోతే… హైదరాబాద్లో ప్రాబల్యం చూపలేరన్నది కాషాయ వాయిస్. పాతబస్తీలో ఇప్పటికే ఆ పరిస్థితి ఉందని, సిటీ మొత్తం అలాంటి స్థితి రానీయవద్దని అంటున్నారు బీజేపీ నాయకులు. కావాలంటే ఊళ్ళకు తర్వాత షిఫ్ట్ చేసుకోండిగానీ… ఇప్పుడు మాత్రం హైదరాబాద్లోనే నమోదు చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. ఈ మాటలు వింటూ…. ఎవరి గోల వారిదని సెటైర్స్ వేసే వాళ్లు సైతం లేకపోలేదు. మొత్తంగా చూసుకుంటే మాత్రం…. ఆ గట్టో… ఈ గట్టో ఏదో ఒకటి తేల్చుకోక తప్పనిసరి పరిస్థితి ఓటర్స్ది. ఫైనల్గా ఎస్ఐఆర్ సిటీ ముఖచిత్రాన్ని ఎలా మారుస్తుందో చూడాలి.

