ఆయనేమో మంత్రి.. ఇంకొకరు మాజీ మేయర్. రాజకీయంగా ఇద్దరి మధ్య పాత పగలు ఉన్నాయట. అవి కొత్తగా సెగలు పుట్టిస్తాయేమోనని డౌట్. అందుకే అందరి దృష్టీ ఆ ఇద్దరిపైనే ఉంది. ఎవరా నాయకులు? ఏంటా వివాదం?
రవీందర్ సింగ్ రీఎంట్రీ.. వాడీవేడీ చర్చ..!
కరీంనగర్ టీఆర్ఎస్ రాజకీయాల్లో సెగలు రాజుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉందన్నది అధికారపార్టీ వర్గాల మాట. ఇందుకు మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ మధ్య నెలకొన్న విభేదాలే కారణం. ఇద్దరూ టీఆర్ఎస్ నేతలే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో TRS రెబల్గా రవీందర్సింగ్ బరిలో దిగడంతో… గంగులకు ఇంటిపోరు తప్పిందని అనుకున్నారు. కానీ.. అదే రవీందర్సింగ్ ఇటీవల సీఎం కేసీఆర్ను కలిసి టీఆర్ఎస్లోకి ఘర్వాపసీ కావడంతో.. పరిణామాలు మారిపోయాయి. అందరూ గంగుల, రవీందర్సింగ్ మధ్య ఏం జరుగుతుందా అని ఒక్కటే చర్చ.
ఇద్దరి మధ్య దశాబ్దాలుగా రాజకీయ విభేదాలు..!
మంత్రి గంగుల కమలాకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇద్దరి రాజకీయ క్షేత్రం కరీంనగరే. ఇద్దరి మధ్య పొలిటికల్గా చాలా గ్యాప్ ఉంది. రాజకీయంగా ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదల్లేదు. అందుకే ఇద్దరి మధ్య ఇప్పటి వరకు జరిగిన గొడవలు.. ఇకపై ఏం జరుగుతుందో అన్న ఆందోళన.. అది అధికారపార్టీలో ఎలాంటి రచ్చకు దారితీస్తుందో అనే ఉత్కంఠ గులాబీ వర్గాల్లో నెలకొంది.
2009లోనే విభేదాలకు బీజం?
రవీందర్ సింగ్ గతంలో బీజేపీలో ఉండేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లో చేరి.. ఉద్యమ నేతగా కేసీఆర్కు సన్నిహితమయ్యారు. ఆ సమయంలో గంగుల కమలాకర్ టీడీపీ నేత. 2009 మహాకూటమి సమయంలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రవీందర్ సింగ్ భావించారు. నామినేషన్ కూడా వేశారు. కానీ.. కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు టీడీపీకి కేటాయించడంతో గంగుల కోసం వదులుకోవాల్సి వచ్చింది. అలా గంగుల వల్ల తనకు ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ పోయిందనే ఆవేదన రవీందర్ సింగ్లో ఉండిపోయిందని చెబుతారు. తర్వాత ఇద్దరూ టీఆర్ఎస్లోనే ఉన్నా ఆ గ్యాప్ కొనసాగింది.
గంగుల వర్గానికి మేయర్గా రవీందర్సింగ్ చెక్..!
రవీందర్ సింగ్ కరీంనగర్ మేయర్గా ఉన్న సమయంలో గంగుల కమలాకర్కు ఆయన మధ్య ఉప్పు నిప్పులా ఉండేది. టెండర్ల విషయంలో ఓ రేంజ్లో ఎత్తుకు పైఎత్తులు వేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. మంత్రి గంగుల అనుచరులు వేసిన టెండర్లను మేయర్ హోదాలో రవీందర్సింగ్ రద్దు చేశారని చెప్పుకొనేవారు. చివరకు ఉద్యమకారులకు ప్రతినిధిగా రవీందర్సింగ్, టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన వారికి గంగుల అండగా ఉండేవారు. ఇటీవల హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో ఈటల రాజేందర్ అనుచరుడిగా ముద్ర వేసి.. దూరం పెట్టడం వెనక మంత్రి గంగుల ఉన్నట్టు రవీందర్సింగ్ అనుమానం. చివరకు మొన్నటి ఎన్నికల్లో రవీందర్సింగ్కు ఎమ్మెల్సీగా టికెట్ రాకపోవడానికి కూడా మంత్రే కారణమని ఒక వర్గం వాదన.
వచ్చే ఎన్నికలపై రవీందర్సింగ్ ఫోకస్ పెట్టారా?
ఇప్పుడు సీఎం కేసీఆర్ పిలుపుతో రవీందర్ సింగ్ ప్రగతి భవన్కు వెళ్లడం.. తిరిగి టీఆర్ఎస్లో యాక్టివ్ కావడంతో.. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుతుందా అన్న చర్చ జరుగుతోంది. గంగులకు టికెట్ ఇవ్వకపోవచ్చని.. రవీందర్సింగ్ టీఆర్ఎస్ నుంచి బరిలో దిగుతారని కొందరు ప్రచారం మొదలుపెట్టేశారు. అందుకే రానున్న రోజుల్లో ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు తీవ్రస్థాయికి చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారట. మరి.. కరీంనగర్ టీఆర్ఎస్లో ఎలాంటి మలుపులు ఉంటాయో చూడాలి.
