Off The Record: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన, ప్రజావ్యతిరేక విధానాలు అంటూ… విపక్షం వైసీపీ దూకుడుగా వెళ్తుంటే.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటికీ అంతర్గత కలహాలతోనే కునారిల్లుతోందట. అలాంటి లిస్ట్లో గుంతకల్లును ప్రస్తావిస్తున్నారు వైసీపీ నాయకులు. వాస్తవంగా గుంతకల్లు నియోజకవర్గ వైసీపీలో ఎలాంటి గ్రూపులు లేవు. 2014కు ముందు నుంచే వై.వెంకట్రామిరెడ్డి ఇక్కడ కీలకంగా ఉన్నారు. ఆయన స్థాయిలో ప్రత్యామ్నాయ నాయకత్వం కూడా గుంతకల్లు వైసీపీకి లేదు. ఉన్న కొద్దిమంది కూడా మండల స్థాయికే పరిమితమయ్యేవారు తప్ప నియోజకవర్గ రేంజ్ కాదన్నది ఫ్యాన్ టాక్. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మరింత బలపడ్డారు వెంకట్రామిరెడ్డి. కానీ… 2024 కూటమి వేవ్లో ఆయనకు కూడా ఓటమి తప్పలేదు. ఆ తర్వాత ఆయనకు ఆరోగ్య పరమైన సమస్యలు రావడంతో… గుంతకల్లు వైసీపీలో కూడా స్తబ్దత నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వెంకట్రామిరెడ్డి కుమార్తె నైరుతిరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్గా పని చేశారామె. ప్రస్తుతం పార్టీ పరంగా రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా గుంతకల్లు వైసీపీని నైరుతి రెడ్డే లీడ్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మల్చుకోవడంపై ఫోకస్ చేశారామె.
అయితే…. హైస్పీడ్లో ఉన్న నైరుతిరెడ్డికి కొందరు సొంత పార్టీ నేతలే స్పీడ్ బ్రేకర్లుగా మారినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ భారీ స్థాయిలో ఏ కార్యక్రమం చేపట్టినా.. ఏదో ఒక వివాదం తెరపైకి వస్తోంది. ఇటీవల పామిడిలో వెన్నుపోటుకు రెండేళ్ల కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించింది. ఇందులో నైరుతిరెడ్డి పాల్గొన్నారు. అదే సమయంలో ఏడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ పామిడి వీరాంజనేయులు కూడా హాజరయ్యారు. అయితే వైసీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నకేశవరెడ్డి వర్గీయులు పామిడిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నైరుతి రెడ్డి సమక్షంలో వీర గో బ్యాక్ అని నినాదాలు చేస్తూ ఆయన్ని అక్కడి నుంచి పంపించేశారు కూడా. కళ్ల ముందు అంత జరుగుతున్నా… ఇరువర్గాలకి నచ్చచెప్పే ప్రయత్నం చేయకుండా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. పైగా…. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు కూడా పాల్గొనడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్స్ చేయడం ఇంకా ఇంట్రస్టింగ్గా మారింది. ఆ ఘటన మరవకముందే.. ఈనెల 12న గుంతకల్లులో వెన్నుపోటు ర్యాలీని భారీ స్థాయిలో నిర్వహించారు. నైరుతి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు.
అదే ప్రోగ్రామ్లో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాది లింగేశ్వర బాబు, నైరుతి వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. చెరో చోటి నుంచి ర్యాలీగా బయలుదేరడం, నినాదాలతో హోరెత్తిస్తున్న క్రమంలో… అపోలో సర్కిల్ వద్దకు రాగానే మేం ముందంటే మేమే ముందంటూ పరస్పరం తోపులాటకు దిగారు. ఈ క్రమంలోనే… పార్టీలో ఎలాంటి విబేధాలు ఉండకూడదని కామెంట్ చేశారు నైరుతి. గుంతకల్లులో నాయకుడు ఒక్కరేనని అది వెంకట్రామిరెడ్డి మాత్రమేనన్నట్టుగా మాట్లాడారామె. ఇప్పుడు ఇదే అసలు గొడవకు కారణంగా తెలుస్తోంది. ఆమె చెప్పేదేంది… మేం నాయకులం కాదా అని మిగతా నేతలు అంటున్నట్టు తెలిసింది. అయితే… పార్టీకష్టకాలంలో ఉన్నప్పుడు కలిసికట్టుగా పని చేయాల్సిన వాళ్ళు ఇలా విబేధాలు రాజేయడం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి కేడర్లో. పోనీ… అభ్యంతరపెట్టేవాళ్ళు సొంతగా బలం పెంచుకుంటున్నారా అంటే అదీకూడా లేదని అంటున్నారు. మొత్తం మీద గుంతకల్లు వైసీపీలో వాతావరణం మారుతోందని, దీని పర్యవసానాలు ఎలా మారాతాయోనన్న చర్చలు నడుస్తున్నాయి కార్యకర్తల్లో.

