NTV Telugu Site icon

Congress : ఆ ఇద్దరూ ఒకే గూటిలో ఉన్నా మొదటినుంచి పడదా..?

New Project (38)

New Project (38)

పీసీసీ మాజీ చీఫ్‌.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వైరం ముదిరిపోయింది. 2009లోనే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ వరకు న్యాయపోరాటం చేసిన నాయకులు వీరిద్దరూ. అలాంటిది పదేళ్ల తర్వాత అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒకరికొకరు హస్తం అందించుకుని నేస్తమయ్యారు. ఆ సమయంలో వారి మైత్రీని చూసిన వాళ్లంతా ఇద్దరూ కలిసిపోయారనే అనుకున్నారు. కానీ.. తెలంగాణలో పీసీసీ నిర్వహిస్తున్న రచ్చబండ వీరిమధ్య మరోసారి విభేదాలకు తెరతీసింది.

చేర్యాల డివిజన్‌ దూల్మిట్టలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రచ్చబండకి వెళ్తుండగా ఆయన్ని పొన్నాల వర్గీయులు అడ్డుకున్నారు. ప్రతాప్‌రెడ్డి కాన్వాయ్‌పై దాడి చేశారు. దీంతో కాంగ్రెస్‌లో జనగామ జాతర రచ్చ రచ్చగా మారిపోయింది. పొన్నాల, కొమ్మూరి మధ్య అంతర్గతంగా కొనసాగుతున్న గొడవలు రోడ్డెక్కేశాయి. కొమ్మూరిని కాంగ్రెస్‌ నుంచి సస్పెండ్ చేయాలన్నది పొన్నాల వర్గం డిమాండ్‌. ఇదంతా కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరాటంగా శ్రేణులు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనగామ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ఇద్దరు నాయకులు పోటీపడుతున్నట్టు ఓపెన్‌ టాక్‌. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

2018 ఎన్నికల సమయంలో పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి మధ్య ఒక ఒప్పందం జరిగిందట. అది కూడా ఒకసారి పొన్నాల ఎన్నికల్లో నిలుచుంటే..కొమ్మూరి మద్దతివ్వడం.. వచ్చే ఎన్నికల్లో కొమ్మురి పోటీ చేయడం ఆ ఒప్పందంలోని షరతులుగా ప్రచారం చేస్తున్నారు. ఆ ఎన్నికలు అయిపోయాయి.. పొన్నాల ఓడిపోయారు. ఇప్పుడు జనగామలో కొమ్మూరి యాక్టివ్‌ కావాలని చూస్తున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కూడా. ఇది పొన్నాల వర్గానికి రుచించడం లేదు. వచ్చే ఎన్నికల్లో పొన్నాలే పోటీ చేస్తారని కుండబద్దలు కొట్టేస్తున్నారు. దీంతో రెండు శిబిరాల మధ్య మాటల దాడి పెరిగింది. ఒప్పందానికి కట్టుబడలేదని ఒకరు.. అలాంటిదేమీ లేదని మరోవర్గం విమర్శల వేడి పెంచుతోంది. ఒకవేళ అలాంటి ఒప్పందమే జరిగి ఉంటే బయట పెట్టొచ్చుగా అనేది కొందరు పార్టీ శ్రేణుల ప్రశ్న.

ఈ వర్గపోరు ఫలితంగా జనగామ కాంగ్రెస్‌లో నేతల జాతర కొత్త పుంతలు తొక్కుతోంది. పరస్పరం దాడులు చేసుకునే వరకు తీవ్రత పెరిగింది. పొన్నాల పీసీసీ చీఫ్‌గా పనిచేసి ఉన్నారు. కొమ్మూరి మాజీ ఎమ్మెల్యే. ఇద్దరూ పార్టీలో తమ ప్రాబల్యం మేరకు పట్టు నిరూపించుకొనే పనిలో పడ్డారు. పరస్పరం ఫిర్యాదులు.. విమర్శలు.. ఆరోపణలు కామనైపోయాయి. మరి.. ఈ పంచాయితీకి పార్టీ పెద్దలు ఫుల్‌స్టాప్‌ పెడతారో లేక.. ఎన్నికల నాటికి విభేదాలు మరింత రసకందాయంలో పడాతయో చూడాలి.