NTV Telugu Site icon

రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తున్నాయా?

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయం అంతా దర్బార్ చుట్టే తిరుగుతుందా? హైకమాండ్‌కు ఫిర్యాదులు చేసే వరకు సమస్య వెళ్లిందా? కంప్లయింట్స్‌ వెనక ఉన్నది ఎవరు? ఇంతకీ దర్బార్ ఏంటి..?

రేవంత్ పేరుతో ఉన్న సోషల్‌ మీడియా గ్రూపులపై హైకమాండ్‌కు ఫిర్యాదు..!

తెలంగాణ కాంగ్రెస్‌లో ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది. చీమ చిటుక్కుమన్నా.. పార్టీ హైకమాండ్‌కు కంప్లయింట్స్‌ వెళ్తున్నాయి. ఇన్నాళ్లూ మీడియా ముందు బయటపడితే.. ఇప్పుడు అంతా ఈమెయిళ్లపై కథ నడిపించేస్తున్నారట. పార్టీ కార్యక్రమాలు లేవని.. ఉద్యమాలు చేయడం లేదని ఇప్పటి వరకు ఫిర్యాదులు వెళ్తే.. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి పేరుతో ఏర్పాటైన గ్రూపులపై ప్రత్యర్థులు గురిపెట్టారట. ఆ విధంగా రేవంత్‌ మీద ఓ సీనియర్ నేత కంప్లయింట్ చేసినట్టు సమాచారం.

అప్పట్లో సీనియర్లపై ఆరోపణలు చేసేవారు..!
ప్రజాదర్బర్‌పై రేవంత్‌ను ప్రశ్నించిన హైకమాండ్‌?

ఫేస్‌బుక్‌లో రేవంత్ రెడ్డి ఫొటో పెట్టి రేవంత్ ప్రజాదర్బార్ పేరుతో అకౌంట్స్ వచ్చాయి. ఆ ఇమేజ్‌ సెటప్‌ ఆధారంగా నియోజకవర్గాల వారీగా మరిన్ని అకౌంట్స్‌ పుట్టుకొచ్చాయి. ప్రజాదర్బార్‌లో చేరండి.. రేవంత్‌కి మద్దతు పలకండి అని పోస్టులు పెడతున్నారు. పీసీసీకి రేవంత్‌ చీఫ్‌ అయినప్పుడు.. మళ్లీ ఈ దర్బార్ ఏంటన్నది పార్టీ వర్గాల ప్రశ్న. రేవంత్ పీసీసీ చీఫ్‌ కాకముందు కూడా ఆయన పేరుతో కొన్ని సోషల్‌ మీడియా అకౌంట్స్ వచ్చాయి. ఆ వేదికల నుంచి కాంగ్రెస్‌ ముఖ్య నాయకులపై ఆరోపణలు.. డ్యామేజీ చేసే విధంగా పోస్టింగ్‌లు పెట్టేవారు. ఇలాంటి పోస్టింగ్‌లపై అప్పట్లో జగ్గారెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు కూడా. అయితే ఆ పోస్టింగ్‌లతో తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చారు రేవంత్‌. ఇప్పుడు రేవంత్‌ ప్రజా దర్బార్‌ కాంగ్రెస్‌లో వేడి సెగలకు కారణమైంది. ఈ మధ్య రెండురోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన పీసీసీ చీఫ్‌ను.. అధిష్ఠానం పిలిచి ప్రజాదర్బర్‌పై ప్రశ్నించిందట. తనపై ఎవరు ఫిర్యాదు చేశారా అని రేవంత్‌ ఆరా తీయగా.. పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అని ఆయన గుర్తించారట.

ఉత్తమ్‌ ఇంటికెళ్లి వివరణ ఇచ్చుకున్న రేవంత్‌..!

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రావడం రావడమే ఉత్తమ్‌ ఇంటికి వెళ్లారు రేవంత్‌. ఫేస్‌బుక్‌లో వస్తున్న పోస్టింగ్‌లకు, ఆ అకౌంట్స్‌కు తనకు సంబంధంల లేదని వివరణ ఇచ్చారట. ఆ వివరణతో ఉత్తమ్‌ సంతృప్తి చెందలేదో లేక పార్టీలో రచ్చకాకుండా ఉండేందుకో కానీ.. వర్కింగ్‌ ప్రెసిడెంట్ మహేష్‌గౌడ్‌తో ప్రకటన చేయించారు రేవంత్‌. ప్రజాదర్బర్‌ పోస్టింగ్‌లకు పీసీసీకి సంబంధం లేదన్నది ఆ ప్రకటన సారాంశం. ప్రజాదర్బర్‌ అకౌంట్స్‌తో రేవంత్‌కు సంబంధం ఉందో లేదో కానీ.. ఈ రచ్చ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదని గాంధీభవన్‌ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తున్నాయా? | Off the Record | Ntv