Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్‌లో ఏముంది?

Climate Change Explained

Climate Change Explained

ఈ ఏడాది భానుడి ప్రతాపం చూసి ఇప్పటికే మీరు ఉక్కిరిబిక్కిరైపోయారు కదా..? అయితే ఈ తరహా ఎండల వ్రతను..ఉక్కపోతలను ఇకపై భరించడానికి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే రానున్న ఐదేళ్లు మీరు ఊహించని స్థాయిలో సూర్యుడు నిప్పులు చిమ్మబోతున్నాడు. వాతావరణ మార్పుల వల్ల జరిగే అసలు సిసలు వినాశనం ఎలా ఉండబోతోందో… రానున్న ఐదేళ్లలోనే చూడబోతున్నామని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించి వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్ తాజాగా ఓ షాకింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. అది చూస్తే భూమిపై భవిష్యత్ జీవితం ఎంత కఠినంగా ఉండబోతోన్నాయో అర్థమవుతుంది.

2026-2030 మధ్య ఏం జరగనుంది?

రాబోయే ఐదేళ్లలో భూమి కనీవినీ ఎరుగని రీతిలో వేడెక్కనుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఇదివరకటి రికార్డులన్నీ బద్దలయ్యే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తాజా నివేదిక స్పష్టం చేసింది. 2026 నుంచి 2030 మధ్యకాలంలో భూమి సగటు ఉష్ణోగ్రతలు పారిశ్రామిక విప్లవానికి ముందున్న స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ దాటిపోవడానికి 75 శాతం అవకాశం ఉందని యూకే మెటియోరలాజికల్ ఆఫీస్ అంచనా వేసింది. అలాగే రాబోయే ఐదేళ్లలో కనీసం ఒక్క సంవత్సరమైనా ఈ 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని దాటే అవకాశం ఏకంగా 91 శాతం ఉందని తెలిపింది. పారిస్ వాతావరణ ఒప్పందంలో నిర్దేశించుకున్న ఈ 1.5 డిగ్రీల మార్కును దాటితే వినాశనం తప్పదని.. 2024లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డు కూడా రాబోయే రోజుల్లో బ్రేక్ అయ్యే అవకాశాలు 86 శాతం ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరోవైపు ఉష్ణోగ్రతల పెరుగుదలకు వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులు కూడా తోడవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే పసిఫిక్ మహాసముద్రంలో బలమైన ఎల్ నినో ఏర్పడి… దాని ప్రభావం 2028 వరకు కొనసాగే అవకాశం ఉంది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయి.. భూమి దశాబ్దానికి 0.45 డిగ్రీల ఫారెన్ హీట్ చొప్పున చాలా వేగంగా వేడెక్కుతోంది.

×
×
Ad

ముఖ్యంగా భూమిపై మిగతా ప్రాంతాల కంటే ఆర్కిటిక్ ప్రాంతం మూడున్నర రెట్లు వేగంగా వేడెక్కుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచు కరిగిపోవడం వల్ల సూర్యరశ్మిని తిరిగి అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ తగ్గిపోయి.. సముద్రపు మంచు మరింత వేగంగా కరుగుతోందని బ్రిటన్ వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

WMO ఏం చెబుతోంది?

ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కేవలం ఎండలు మాత్రమే కాదు.. విపరీతమైన కరువు.. వరదలు.. వడగాలులు లాంటి ప్రకృతి విపత్తులు కూడా ముంచుకొస్తాయని WMO హెచ్చరిస్తోంది. భూమి వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచే అమెజాన్ బేసిన్‌కు కూడా రాబోయే రోజుల్లో భారీ ముప్పు పొంచి ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగి కరువు పరిస్థితులు నెలకొనడం వల్ల అమెజాన్ అడవుల్లో భారీగా కార్చిచ్చు రగిలే ప్రమాదం ఉందని నివేదిక పేర్కొంది. వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకునే అమెజాన్ అడవులు.. మంటల వల్ల కార్బన్‌ను విడుదల చేసే ప్రాంతాలుగా మారి పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంది. ఆఫ్రికాలోని సహెల్ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడి వరదలు వచ్చే అవకాశం ఉందని… మొత్తంగా వాతావరణ మార్పులను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం సరిపోవడం లేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

: ఫణి కుమార్ (NTV DIGITAL)