Tollywood : టాలీవుడ్‌ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!

Tollywood

Tollywood

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ వైపు అడుగులు వేస్తోంది. వందల కోట్ల బడ్జెట్లతో సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అయితే, పైకి కనిపిస్తున్న ఈ గ్లామర్ వెనుక టాలీవుడ్ తీవ్రమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. థియేటర్లలో ఒక పెద్ద సినిమా విడుదలై ఘనవిజయం సాధించిన తర్వాత కూడా.. సదరు నిర్మాతలు లాభాల మాట పక్కన పెట్టి, ‘కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే చాలు, బ్రేక్ ఈవెన్ అయితే చాలు’ అనే దయనీయ స్థితిలో ఉంటున్నారు. అసలు పరిశ్రమలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇండస్ట్రీని వేధిస్తున్న కొన్ని స్వయంకృత అపరాధాలు ఉన్నాయి.

1. వాయిదాల పర్వం
సినిమా సంక్షోభానికి ప్రధాన కారణం షూటింగ్స్, రిలీజ్ డేట్స్ విపరీతంగా ఆలస్యం కావడం. ఒక భారీ చిత్రం ఏడాది లేదా ఆరు నెలలు ఆలస్యమైతే వడ్డీలు, వేస్టేజ్ ఖర్చుల రూపంలో దాదాపు 50 నుండి 75 కోట్ల రూపాయల అదనపు భారం నిర్మాతపై పడుతోంది. డిజిటల్ టెక్నాలజీ వచ్చాక అవగాహన లేమితో షూటింగ్ డేస్ పెంచేస్తున్నారు. పెద్ద సినిమాకు రోజుకు 35 నుండి 40 లక్షల వర్కింగ్ కాస్ట్ అవుతుండటంతో, బడ్జెట్ అదుపు తప్పుతోంది. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి నిర్మాతలు టికెట్ ధరల పెంపును ఆశ్రయిస్తున్నారు.

×
×
Ad

2. టికెట్ హైక్
సినిమా బజ్ తగ్గడం ఒకెత్తయితే, టికెట్ ధరలు 500 నుండి 1000 రూపాయల వరకు పెంచేయడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు థియేటర్ల వైపు రావడమే మానేశాయి. మొదటి మూడు రోజులు ఫ్యాన్స్ హడావిడితో కలెక్షన్స్ బాగున్నట్లు కనిపించినా, ఆ తర్వాత ఫుట్ ఫాల్స్ దారుణంగా పడిపోతున్నాయి. సినిమా అనేది సామాన్యుడికి అందుబాటులో ఉండే వినోదం కాకుండా పోతోంది.

3. ఓవర్సీస్, ఓటీటీ మార్కెట్ భ్రమలు
ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ పరిమితంగా ఉండేది, కానీ ఇప్పుడు టికెట్ ధరలు 20 నుండి 30 డాలర్ల వరకు పెంచేస్తున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, నార్త్ అమెరికాలో ఐటీ ఉద్యోగాల అభద్రత, హెచ్-1బి వీసా సమస్యల వల్ల అక్కడి మన ప్రేక్షకులు వీకెండ్స్‌లో భారీ ఖర్చుతో కూడిన సినిమాలకు వెళ్లే లగ్జరీని కోరుకోవడం లేదు. మరోవైపు, కరోనా కాలంలో ఆపద్బంధువులా కనిపించిన ఓటీటీ సంస్థలు ఇప్పుడు తమ అసలు స్వరూపాన్ని చూపిస్తున్నాయి. ఒకప్పుడు వంద కోట్లు పెట్టిన సంస్థలు, ఇప్పుడు 50 కోట్లు పెట్టడానికి కూడా వెనకాడుతున్నాయి. ఎందుకంటే ఓటీటీ బిజినెస్ రికవరీకి పదేళ్ల సమయం పడుతుండటంతో, వారి రిసోర్సెస్ సగానికి పడిపోయాయి.

4. బలవంతపు ‘పాన్ ఇండియా’ చట్రం
‘బాహుబలి’కి బడ్జెట్ రికవరీ కోసం పాన్ ఇండియా మార్కెట్ అవసరమైంది. కానీ నేడు ప్రతి చిన్న కథను బలవంతంగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ చట్రంలో ఇరికిస్తున్నారు. నార్త్ ఇండియాకు వెళ్లి కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేస్తున్నా, హిందీ మార్కెట్ నుండి ఆశించిన రిటర్న్స్ రావడం లేదు. దీనికి తోడు ప్రమోషనల్ కంటెంట్ స్ట్రాటజీ పూర్తిగా విఫలమవుతోంది. టీజర్లు, గ్లింప్స్‌లు, ట్రైలర్లు అంటూ సినిమాలోని ప్రధాన కంటెంట్‌ను ముందే బయట పెట్టేస్తున్నారు. అలాగే, యూట్యూబ్ మిలియన్ల వ్యూస్ కోసం లిరికల్ వీడియోలలో మెయిన్ ‘హుక్ స్టెప్స్’ రిలీజ్ చేయడం వల్ల థియేటర్లలో ప్రేక్షకుడికి ఉండాల్సిన అసలైన ఎగ్జైట్‌మెంట్ చేజారిపోతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ వల్ల జరిగే ‘టార్గెటెడ్ నెగిటివ్ రివ్యూస్’ సినిమాను మరింత దెబ్బతీస్తున్నాయి.

ఇప్పటికైనా ‘వారణాసి’, ‘స్పిరిట్’ లాంటి భారీ చిత్రాల మేకర్స్, హీరోలు, దర్శకులు మేల్కోవాలి. ఇండస్ట్రీకి ఇప్పుడు కావాల్సింది కేవలం కలెక్షన్ల ‘మార్కెట్ కరెక్షన్’ కాదు.. నిర్మించే పద్ధతి మారే ‘మార్కెట్ మోడల్ కరెక్షన్’. బడ్జెట్ కంట్రోల్ చేస్తూ, టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చినప్పుడే సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ బతుకుతుంది, పరిశ్రమ మళ్లీ కళకళలాడుతుంది.