Site icon NTV Telugu

Nuke Testings: 40 లక్షల మంది హ*త్య.. సంచలనం రేపుతోన్న నివేదిక.. ఈ పాపం ఎవరిది?

Nuclear Tests

Nuclear Tests

1945లో మొదటి అణు బాంబు పేలిన క్షణం నుంచి మానవ చరిత్ర ఒక కొత్త గాయాన్ని మోసుకుంటూ వస్తోంది. యుద్ధాలు ముగిశాయి. ఒప్పందాలు కుదిరాయి. కానీ అణు పరీక్షలు వదిలిన విషం మాత్రం ఆగలేదు.

ఇప్పుడు బయటకు విడుదలైన ఒక అంతర్జాతీయ నివేదిక ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తోంది. 1945 నుంచి 2017 వరకు జరిగిన అణు పరీక్షల ప్రభావంతో కనీసం 40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని ఆ నివేదిక చెబుతోంది. ఇవి యుద్ధంలో చనిపోయిన సంఖ్యలు కావు. కనిపించని రేడియేషన్ వల్ల నెమ్మదిగా చనిపోయిన జీవితాలు. నిజానికి అణు పరీక్షలు కొన్ని దేశాల భూభాగాల్లో మాత్రమే జరిగాయి. కానీ వాటి ప్రభావం ఒక్క దేశానికి పరిమితం కాలేదు. ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి మనిషి శరీరంలో ఆ పరీక్షల జాడలు ఉన్నాయని సైన్స్‌ చెబుతోంది. ఇంతకీ ఈ అణు పరీక్షలు ప్రపంచాన్ని ఎలా విషపూరితం చేశాయి? ఎవరు ఎక్కువగా ఈ మూల్యం చెల్లించారు? ఎందుకు ఇప్పటికీ ఈ గాయాలపై మౌనం కొనసాగుతోంది?

ఇప్పటివరకు అణు ఆయుధాలు అంటే యుద్ధంలో ఉపయోగించిన రెండు బాంబుల గురించే అందరూ మాట్లాడుకునేవాళ్లు. కానీ నిజమైన విధ్వంసం యుద్ధంలో కాదు. శాంతి పేరుతో చేసిన పరీక్షల్లో జరిగింది.

1945 నుంచి 2017 వరకు ప్రపంచవ్యాప్తంగా 2,400కి పైగా అణు పరికరాలు పేల్చారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా నుంచి భారత్, పాకిస్తాన్ వరకు అణుశక్తి ఉన్న దేశాలన్నీ ఈ పరీక్షల్లో భాగమే. ఈ పేలుళ్లలో ఎక్కువ భాగం భూవాతావరణంలోనే జరిగాయి. ఆకాశంలోకి వెళ్లిన రేడియేషన్ గాలితో కలిసి ఖండాలు దాటింది. సముద్రాల్లో కలిసింది. భూమిలోకి చొచ్చుకెళ్లింది. చివరకు మన ఆహారంలోకీ వచ్చింది. నార్వేజియన్ పీపుల్స్ ఎయిడ్ అనే మానవతా సంస్థ విడుదల చేసిన ఈ నివేదిక ఒక భయంకరమైన నిజాన్ని బయటపెడుతోంది.

అణు పరీక్షల వల్ల విడుదలైన అయానైజింగ్ రేడియేషన్ మన DNAను నేరుగా దెబ్బతీసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ఫలితమే క్యాన్సర్లు, గుండె జబ్బులు, స్ట్రోక్‌లు, పుట్టుక లోపాలు. వాతావరణంలో జరిగిన అణు పరీక్షల కారణంగా మాత్రమే భవిష్యత్తులో 20 లక్షల క్యాన్సర్ మరణాలు, మరో 20 లక్షల గుండె సంబంధిత మరణాలు సంభవించే అవకాశముందని నివేదిక హెచ్చరిస్తోంది.

రేడియేషన్‌కు సురక్షితమైన స్థాయి అనే మాటే లేదని సైన్స్ స్పష్టంగా చెబుతోంది. తక్కువ మోతాదులోనైనా ప్రభావం తప్పదన్నది నిపుణుల అభిప్రాయం కూడా.మరోవైపు అణు పరీక్షలు జరిగిన ప్రాంతాల చుట్టూ ఉన్న ప్రజలే ఎక్కువగా మూల్యం చెల్లించారు. ఫ్రెంచ్ పోలినీషియా, మార్షల్ దీవులు, కజకస్తాన్, అల్జీరియా లాంటి ప్రాంతాల్లో నివసించిన ప్రజలు తరతరాలుగా అనారోగ్యాలతో జీవిస్తున్నారు. పిల్లలు పుట్టేలోపే శరీర లోపాలతో బాధపడుతున్నారు. మహిళలు, బాలికలు రేడియేషన్ వల్ల కలిగే క్యాన్సర్లకు పురుషులకంటే 52 శాతం ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. గర్భంలో ఉన్న శిశువులు, చిన్న పిల్లలు ఈ విషానికి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యారు.

ఇంకో భయంకరమైన విషయం ఏంటంటే ఈ పరీక్షలపై ఇప్పటికీ పూర్తి నిజం బయటకు రాలేదు. అనేక దేశాలు డేటాను గోప్యంగా ఉంచాయి. ఎక్కడ ఎంత రేడియేషన్ పాతిపెట్టారో, ఏ ప్రాంతాలు ఇంకా ప్రమాదంలో ఉన్నాయో చెప్పడం లేదు.

బాధితులకు సరైన వైద్యం లేదు. స్క్రీనింగ్ లేదు. నష్టపరిహారం పేరుతో చేసిన పథకాలు కూడా బాధితులను ఆదుకునేలా కాకుండా ప్రభుత్వాల బాధ్యతను తగ్గించేలా ఉన్నాయని నివేదిక ఆరోపిస్తోంది. ఇప్పటివరకు ఒక్క అణుశక్తి దేశం కూడా ఈ పరీక్షల కోసం బహిరంగంగా క్షమాపణ చెప్పలేదు. నిజానికి అణు పరీక్షలను దేశ భద్రత పేరుతో జరుపుతుంటారు కానీ ఈ నివేదిక చెబుతున్న కథ వేరే. ఇది భద్రత కాదు. ఇది నెమ్మదిగా సాగిన మానవ హత్య. యుద్ధం లేకుండానే కోట్ల మంది ప్రాణాలు తీసిన విధ్వంసం. అణు బాంబు పేలుడు ఒక క్షణం మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని ప్రభావం తరతరాలుగా కొనసాగుతుంది.

ప్రపంచం ఇప్పుడు మరోసారి అణు పరీక్షల మాట మాట్లాడుతున్న సమయంలో ఈ నివేదిక ఒక హెచ్చరిక. గతం మిగిల్చిన విషం ఇంకా మన శరీరాల్లో ఉంది. దాన్ని మరిచి మళ్లీ అదే దారి ఎంచుకుంటే, రానున్న తరాలు మరింత మూల్యం చెల్లించాల్సి రావడం ఖాయం!

Exit mobile version