Russia-Ukraine War: 5లక్షల మంది రష్యా సైనికులను చంపేసిన జెలెన్‌స్కీ సేనలు.. పుతిన్‌కు చా*వు దెబ్బ!

Russia Ukraine War Latest News

Russia Vs Ukraine War

Russian soldiers killed: యూరప్ గుండెల్లో తుపాకుల మోత ఆగడంలేదు. మంచుతో కప్పుకున్న నేల మీద రక్తం గడ్డకట్టిపోతోంది. ఒక వైపు బాంబులు… మరోవైపు మృతదేహాలు…! నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచానికే ఒక భయంకర హెచ్చరికలా మారింది. ఇప్పుడు బయటపడిన సంఖ్యలు చూస్తే వణుకుపుడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 5లక్షల మందికిపై రష్యా(Russia) సైనికులు మరణించినట్టు బ్రిటన్‌ గూఢచారి సంస్థ గవర్నమెంట్‌ కమ్యూనికేషన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌-GCHQ నివేదించింది. YouTube video player

యుక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతాలే లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న రష్యా పూర్తి స్థాయి దాడి ప్రారంభించింది. అప్పట్లో కొన్ని రోజుల్లోనే యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకుంటామని వ్లాదిమిర్ పుతిన్ భావించారు. కానీ ఈ యుద్ధం ఏకంగా నాలుగు సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ తుపాకులు మోత ఆగలేదు.

×
×
Ad

GCHQ ఏం రిపోర్ట్ చేసింది?

ఇంతలోనే ఈ యుద్ధంపై బ్రిటన్ గూఢచారి సంస్థ GCHQ చేసిన ప్రకటన ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తోంది. బ్రిటన్‌కు చెందిన అతిపెద్ద నిఘా సంస్థ డైరెక్టర్ యాన్ కీస్ట్ బట్లర్ ప్రకారం 2022 నుంచి ఇప్పటివరకు దాదాపు 5లక్షల రష్యా సైనికులు ఈ యుద్ధంలో మరణించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో ఇంత భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగిన యుద్ధం ఇదే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రకటనను ఆమె రెండో ప్రపంచ యుద్ధంలో కోడ్ బ్రేకింగ్ కేంద్రంగా పనిచేసిన బ్లెచ్‌లీ పార్క్‌లో చేశారు. అక్కడ నుంచే ఆమె మరో కీలక హెచ్చరిక చేశారు. రష్యా ఇప్పుడు కేవలం యుద్ధరంగంలో మాత్రమే కాకుండా సైబర్ దాడులు, గూఢచారి ఆపరేషన్లు, కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ బ్రిటన్‌తో పాటు నాటో దేశాలపై హైబ్రిడ్ వార్ నడుపుతోందని ఆరోపించారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది.

రష్యా అధికారికంగా తమ సైనిక మరణాల సంఖ్యను పూర్తిగా బయటపెట్టడం లేదు. యుక్రెయిన్ కూడా తమ పూర్తి నష్టాలను చెప్పడం లేదు. 2026 ఫిబ్రవరిలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో తమ దేశానికి చెందిన 55 వేల మంది సైనికులు మరణించారని చెప్పారు.

రష్యా-యుక్రెయిన్‌ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు?

బీబీసీ రష్యన్, మీడియాజోనా అనే స్వతంత్ర సంస్థ, వాలంటీర్ల బృందం కలిసి 2022 నుంచి రష్యా సైనికుల మరణాలను ట్రాక్ చేస్తోంది. అధికారిక నివేదికలు, పత్రికలు, సోషల్ మీడియా పోస్టులు, సమాధులు, స్మారక చిహ్నాల ఆధారంగా ఇప్పటివరకు 2 లక్షల 23 వేల 539 మంది రష్యా సైనికుల మరణాలను నిర్ధారించామని చెబుతోంది. కానీ ఇది అసలు సంఖ్యలో కేవలం 45 నుంచి 65 శాతం మాత్రమే కావచ్చని సైనిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే వాస్తవ సంఖ్య GCHQ చెప్పినట్టు 5లక్షలకు చేరి ఉండొచ్చు. ఇక ఈ యుద్ధం ఎందుకు మొదలైందన్నది కూడా ఒకసారి గుర్తుచేసుకోవాలి. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత యుక్రెయిన్ స్వతంత్ర దేశంగా మారింది. ఇదే సమయంలో యుక్రెయిన్ నాటోకు దగ్గరవడం రష్యాకు నచ్చలేదు.

పశ్చిమ దేశాలు తమ సరిహద్దుల వరకూ వస్తున్నాయని రష్యా భావించింది. 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించింది. అప్పటి నుంచి ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. చివరకు 2022లో పూర్తి స్థాయి యుద్ధం మొదలైంది. ఇప్పుడు ఈ యుద్ధం కేవలం రష్యా-యుక్రెయిన్ మధ్య పోరులా కాకుండా ఇది పరోక్షంగా అమెరికా వర్సెస్‌ రష్యాగా మారింది.

ఒకవైపు నాటో, యూరప్ ఉంటే… మరోవైపు చైనా సహకారంతో రష్యా-యుక్రెయిన్‌ మిత్రదేశాలపై ఫైట్ చేస్తోంది. ఇటు అమెరికా ఇప్పటికే బిలియన్ల డాలర్ల సైనిక సహాయాన్ని యుక్రెయిన్‌కు అందించింది. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ కూడా ఆయుధాలు పంపిస్తున్నాయి. మరోవైపు రష్యా కూడా భారీ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులు ఉపయోగిస్తోంది. ఇక GCHQ హెచ్చరికల్లో మరో కీలక అంశం చైనా. చైనా ఇప్పుడు విజ్ఞానశాస్త్రం, టెక్నాలజీలో సూపర్ పవర్‌గా మారిందని… అంతరిక్షం నుంచి సైబర్ యుద్ధం వరకు భారీగా పెట్టుబడులు పెడుతోందని బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది.

అంతేకాదు… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోందని… ఈ టెక్నాలజీలో వెనుకబడితే భద్రతకే ప్రమాదమని హెచ్చరించింది. సైబర్ దాడులు ఇప్పుడు ప్రభుత్వాలకే కాకుండా సాధారణ ప్రజలకూ ప్రమాదంగా మారాయని చెప్పుకొచ్చింది. ఫిషింగ్, ర్యాన్సమ్‌వేర్ దాడులతో బ్రిటన్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటున్న నేర ముఠాలతో ప్రతిరోజూ పోరాడుతున్నామని GCHQ చెబుతోంది.

మరోవైపు ఈ యుద్ధం ఇంకా ఆగే సూచనలు కనిపించడం లేదు. ప్రతిరోజూ కొత్త మృతదేహాలు… కొత్త దాడులు… కొత్త హెచ్చరికలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఒకప్పుడు కొన్ని వారాల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం… ఇప్పుడు లక్షల ప్రాణాలను బలి తీసుకున్న రక్తపాతంగా మారిపోవడం నిజంగా ఊహకందని విషాదం.