Zelensky: యుద్ధాన్ని ముగించేందుకు “పుతిన్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నాను”.. జెలెన్స్కీ సంచలన పోస్ట్.!

  • X ద్వారా జెలెన్స్కీ సంచలన పోస్ట్..
  • యుద్ధాన్ని ముగించేందుకు "పుతిన్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నాను".
  • మే 16న (గురువారం) టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఎదురుచూస్తానని..
Zelensky, Vladimir Putin

Zelensky, Vladimir Putin

Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. మే 16న (గురువారం) టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగే చర్చల కోసం పుతిన్‌ రాక కోసం ఎదురుచూస్తానని ఆయన తెలిపారు. ఈ ప్రకటనను జెలెన్స్కీ తాజాగా “ఎక్స్‌” లో పోస్ట్ చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యాతో వెంటనే చర్చలకు ఒప్పుకోవాలని సూచించిన వెంటనే ఈ ప్రకటన వెలువడింది.

Read Also: Diamond League: నీరజ్ చోప్రా నేతృత్వంలో రంగంలోకి నలుగురు అథ్లెట్లు..!

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం సోమవారం నుంచే పూర్తి స్థాయి యుద్ధ విరమణ ప్రారంభమవుతుందని ఆశిస్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇది ద్వైపాక్షిక చర్చలకు సరైన వాతావరణాన్ని ఏర్పరచడమే లక్ష్యంగా ఉందని ఆయన తెలిపారు. యుద్ధానికి ముగింపు కావాలంటే రాజనీతిక పరిష్కారాలు తప్పవు. అందుకే గురువారం టర్కీలో పుతిన్‌ను కలవడానికి నేను సిద్ధంగా ఉన్నానని జెలెన్స్కీ తన పోస్ట్ లో స్పష్టం చేశారు.

ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైనప్పటి నుండి ఇంత స్పష్టమైన శాంతి చర్చల ప్రకటన ఇదే తొలిసారి కావచ్చు. ఈ ప్రకటనతో యుద్ధం ముగియాలన్న అంతర్జాతీయ ప్రయత్నాలకు కొత్త ఊపొచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి అనేక దేశాలు మద్యవర్తిత్వానికి ముందుకొచ్చినప్పటికీ, మౌలిక సమస్యలపై రెండు దేశాలు ఒప్పందానికి రాలేదు. భూభాగాల ఆక్రమణ, నాటో సభ్యత్వం, భద్రతా హామీలు వంటి అంశాలపై తీవ్ర విభేదాలున్నాయి. గతంలో టర్కీ, ఇజ్రాయెల్, బెలారస్ వంటి దేశాలు చర్చల వేదికలుగా ప్రయత్నించాయి కానీ.. అనూహ్యంగా శాంతి ఒప్పందాలు జరగలేదు.

Read Also: Operation Sindoor: ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ సిబ్బంది.. పేర్లను విడుదల చేసిన భారత్

టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్, యుద్ధ ప్రారంభం నుండి రెండు దేశాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు. గతంలో అనేక సందర్భాల్లో టర్కీ మద్యవర్తిత్వం ద్వారా ఖైదీ మార్పిడి, ధాన్య సరఫరా ఒప్పందాలను సాధించిన సంగతి తెలిసిందే. అందుకే ఇస్తాంబుల్‌ను చర్చల వేదికగా జెలెన్స్కీ సూచించడం అనుకూల నిర్ణయంగా భావించబడుతోంది.