ఆ నియోజకవర్గానికి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఉన్నట్టా? లేనట్టా? ఒరే…. బాబూ….నేను ఎమ్మెల్యేన్రా…… నన్ను గుర్తించండ్రా…. అంటూ గట్టిగా అరవాలని ఉన్నా… ఆ పని చేయలేకపోతున్నారా? ఈయన కష్టం పగోళ్లకు కూడా రాకూడదని సొంత బీఆర్ఎస్ కార్యకర్తలే అనుకుంటున్నది ఎవరి గురించి? సదరు ఎమ్మెల్యే సాబ్కు అంత దుస్థితి ఎందుకు దాపురించింది?
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్. కాంగ్రెస్ పార్టీకి ఒకప్పడు కంచుకోట ఇది. అలాంటి కోటను 2014లోనే బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నేత మాణిక్ రావు. కానీ… స్వల్ప తేడాతో అప్పుడు ఓడిపోయారాయన. ఇక 2018లో మాత్రం మాణిక్రావు గురితప్పలేదు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి….అదే ఊపును 2023లో కూడా కొనసాగించారు. అంతవరకు బాగానే ఉన్నా…. ఎన్నికైన రెండు సార్లు.. ఆయనకు ఎమ్మెల్యేనన్న సంతోషం లేకుండా చేస్తున్నారట పార్టీ సీనియర్ నాయకులు. తనను పక్కనపెట్టి వాళ్ళే పెత్తనాలు చేస్తుండటంతో… ఇక నేను గెలిచి ఉపయోగం ఏంటంటూ ఎమ్మెల్యే సాబ్ తెగ ఫీలైపోతున్నారట.
2018లో మొదటిసారి మాణిక్ రావు ఎమ్మెల్యే అయినప్పుడు ఫరీదుద్దీన్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. 2004 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన ఫరీదుద్దీన్… బీఆర్ఎస్లో చేరాక ఆయన్ని ఎమ్మెల్సీ చేసింది. దీంతో ఎమ్మెల్యేగా మాణిక్రావు ఉన్నా… అప్పట్లో పార్టీ వ్యవహారాలతో పాటు పనులన్నిటినీ ఫరీదుద్దీనే చక్కపెట్టేవారట. ఒక రకంగా నాడు ఫరీదుద్దీన్ను షాడో ఎమ్మెల్యేగా చెప్పుకున్నారు. ఆయన చనిపోయాక వెలుగులోకి వచ్చి నియోజకవర్గంలో తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేశారు మాణిక్రావు. అయినాసరే… కొద్ది రోజుల పాటు ఆయన పీఏ కూడా షాడో ఎమ్మెల్యేగా పనిచేశారన్న ప్రచారం జరిగింది. అంతలోనే మరో నాయకుడు యాక్టివ్ అవ్వడంతో మళ్లీ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఈసారి గెలిచాక డీసీఎంస్ మాజీ చైర్మన్ శివకుమార్ నియోజవవర్గానికి షాడో ఎమ్మెల్యేగా తయారయ్యారన్న ప్రచారం బీఆర్ఎస్ వర్గాల్లోనే జోరుగా జరుగుతోంది.
ఎమ్మెల్యే మాణిక్ రావు దగ్గరికి వెళ్తే పని అవుతుందో లేదో తెలియదుగానీ…. శివకుమార్ దగ్గరికి వెళ్తే మాత్రం పార్టీ పెద్దలతో మాట్లాడి చేయిస్తారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఆయన కాకుంటే ఈయన, ఈయన కాకుంటే… ఇంకొకాయన అంటూ… ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యే మాణిక్రావుని కీలుబొమ్మగా మార్చేస్తున్నట్టు నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో… ఏం చేయాలో పాలుపోక ఆయన కూడా సర్దుకుపోతున్నారన్నది సన్నిహితుల మాట. ప్రస్తుతం పేరుకు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావే అయినా… పదవిని ఎక్కువగా అనుభవిస్తోంది మాత్రం శివకుమారేనన్నది లోకల్ టాక్. దీన్ని చూస్తున్న రాజకీయ ప్రత్యర్థులు కూడా డమ్మీ ఎమ్మెల్యే అంటూ గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.
సంగారెడ్డి, జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలంటూ తాజాగా కేంద్ర మంత్రి అశ్విని వైష్టవ్ని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్ రావు. ఈ టూర్లో కూడా శివకుమార్ ఎమ్మెల్యేతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. దీన్ని మాణిక్రావు అస్సలు తట్టుకోలేకపోతున్నట్టు సమాచారం. ఇంటా బయటా మొత్తం మీరే చేసేస్తే… ఇక నేనెందుకు? జనం నన్ను గెలిపించింది ఎందుకంటూ… లోలోపల మధనపడుతున్నారట. బొమ్మరిల్లు సినిమాలో హీరోలాగా…. ఇక నేను ఎమ్మెల్యేగా ఉండటం ఎందుకని గట్టిగా అరవాలని ఉన్నా… ఆపని చేయలేకపోతున్నారట. ఈ సారి బీఆర్ఎస్ ప్రభుత్వం రాలేదని షాడోలు చల్లబడ్డారుగానీ, లేదంటే… ఒకరు కాదు ఇద్దరు కాదు… జహీరాబాద్కు ఎంత మంది ఎమ్మెల్యేలు తయారయ్యేవారోనని బీఆర్ఎస్ కేడర్లోనే చర్చ జరుగుతోంది.
పగవాడికి కూడా మాణిక్రావు లాంటిన కష్టం రావొద్దంటూ కార్యకర్తలు బాధపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే… కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంతో ఇంతో పని చేయగలుగుతున్నానని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మాత్రం తన పరిస్థితి ఇంకోలా ఉండేదని అత్యంత సన్నిహితులతో అంటున్నారట మాణిక్రావు. మొత్తం మీద షాడో శివకుమార్ నీడ నుంచి బయటపడాలని ఎమ్మెల్యే గట్టిగా ప్రయత్నిస్తున్నారట. ఆ ఫ్రీ హ్యాండ్ దొరుకుతుందో లేదో చూడాలి మరి.

