భారత క్రికెట్ చరిత్రలో యువరాజ్ సింగ్ ఒక అజేయమైన పోరాట యోధుడు. 2011 ప్రపంచ కప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన కొద్ది నెలలకే ఆయన తన జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నారు. తనకు క్యాన్సర్ సోకిందని తెలిసినప్పటి నుంచి.. తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే వరకు ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.
జీవితం 3-6 నెలలేనని తెలిసినప్పుడు..
ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ తన క్యాన్సర్ నిర్ధారణ సమయం గురించి మాట్లాడుతూ.. వైద్యులు తనతో చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. “నీకు ఇంకా మూడు నుంచి ఆరు నెలల సమయం మాత్రమే ఉండవచ్చు” అని డాక్టర్లు చెప్పినప్పుడు ఒక్కసారిగా షాక్కు గురయ్యానన్నారు. ఆయన ఊపిరితిత్తులు, గుండె మధ్యలో ఒక పెద్ద ట్యూమర్ (కణితి) ఏర్పడింది. ఒకవేళ వెంటనే కీమోథెరపీ చేయించుకోకపోతే.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించడంతో ఏమి చేయాలో అర్థం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
క్రికెట్ పట్ల ఉన్న మక్కువ..
ఆ సమయంలో యువరాజ్ సింగ్ తన కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నారు. ఏడు ఏళ్లు 12వ ఆటగాడిగా వేచి చూసిన తర్వాత టెస్ట్ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాలని ఎంతో ఆశపడ్డారు. కానీ శారీరక పరిస్థితి విషమించడంతో.. క్రికెట్ను పక్కన పెట్టి చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది.
మనోబలమే మందుగా..
అమెరికాలో చికిత్స పొందుతున్నప్పుడు డాక్టర్ లారెన్స్ ఐన్హార్న్ చెప్పిన మాటలు యువరాజ్ కు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. “నీవు ఈ ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, అసలు నీకు క్యాన్సర్ రాలేదన్నంత ఆరోగ్యంగా వెళ్తావు” అని ఆయన భరోసా ఇచ్చారు. ఆ మాటలే యువరాజ్ లో ప్రాణశక్తిని నింపాయి.
చివరకు 2012లో క్యాన్సర్ను జయించి.. తిరిగి భారత జట్టులోకి అడుగుపెట్టి తన పునరాగమనాన్ని చాటారు. 2017లో ఇంగ్లాండ్పై తన కెరీర్ లోనే అత్యధిక స్కోరు (150) సాధించి తానెప్పుడూ ‘ఫైటర్’నే అని నిరూపించుకున్నారు. నేడు ఆయన తన YouWeCan ఫౌండేషన్ ద్వారా వేలాది మంది క్యాన్సర్ రోగులలో ఆశలు నింపుతున్నారు.