YS Jagan Review Tobacco Procurement at Devarapalli: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి.. అక్కడ జరుగుతున్న కొనుగోళ్ల తీరును పరిశీలించనున్నారు. అనంతరం పొగాకు రైతులతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
షెడ్యూల్ ప్రకారం.. వైఎస్ జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడ పొగాకు కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించి.. సంబంధిత అంశాలపై ఆరా తీస్తారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న జగన్.. పంట సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, గిట్టుబాటు ధరలు, కొనుగోళ్ల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై వారితో నేరుగా చర్చించనున్నారు.
వైఎస్ జగన్ పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతుల అభిప్రాయాలు, సమస్యలను స్వయంగా తెలుసుకుని.. వాటిపై స్పందించే అవకాశం ఉంది. రైతులతో ముఖాముఖి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. అనంతరం దేవరపల్లి నుంచి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు, రైతులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

