కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందాం అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ నేతలు, కార్యకర్తలకు చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని మండిపడ్డారు. స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ నగర పంచాయతీ కౌన్సిలర్లు ఈ కలిశారు.
Also Read: Kolusu Partha Sarathy: పొగాకు రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం!
తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి ఘటనను వైఎస్ జగన్కు నేతలు వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును జగన్ దృష్టికి వైసీపీ నేతలు తీసుకొచ్చారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచారంటూ కౌన్సిలర్లను జగన్ అభినందించిచారు. ‘ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోంది. స్ధానిక సంస్ధల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందాం. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుంది’ అని నేతలతో వైఎస్ జగన్ అన్నారు.