NTV Telugu Site icon

Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న యూట్యూబర్.. కాల్చి చంపిన సెక్యూరిటీ గార్డు

New Project (1)

New Project (1)

టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా.. భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్ ఈ నెల 9న న్యూయార్క్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ తర్వాత పాక్ అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన హృదయ విదారక వార్త బయటకు వచ్చింది. పాకిస్థాన్ లోని కరాచీలో పనిచేస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు ఒక యూట్యూబర్‌ను కాల్చాడు.

READ MORE: Adani : అదానీ డిఫెన్స్ & ఏరోస్పేస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఒప్పందం..

పాకిస్థాన్‌లోని మీడియా కథనాల ప్రకారం.. సాద్ అహ్మద్ అనే యూట్యూబర్ భారత్ – పాకిస్థాన్‌ మ్యాచ్ కి సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని పూనుకున్నాడు. కరాచీలోని మొబైల్ మార్కెట్‌కు వెళ్లి పలువురు దుకాణదారుల వీడియో బైట్‌లను తీసుకున్నాడు. ఆ సమయంలో అతను సెక్యూరిటీ గార్డు ముందు వచ్చి అతని అభిప్రాయాన్ని అడిగేందుకు యత్నించాడు. అయితే.. ఎలాంటి వివరణ ఇచ్చేందుకు ఇష్ట పడలేదు. బలవంతం పెట్టగా.. ఒక్కసారిగా యూట్యూబర్ సాద్‌పై కాల్పులు జరిపాడు. నిజానికి మైక్రోఫోన్‌ను అతని ముందు ఉంచడంతో గార్డుకు కోపం వచ్చింది. దీంతో ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డు సాద్‌ను తన తుపాకీతో కాల్చాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ప్రమాదం తర్వాత కరాచీ మొబైల్ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. యూట్యూబర్ సాద్ కుటుంబం అతడి సంపాదనపైనే ఆధారపడిందని స్నేహితుడు తెలిపాడు. సాద్ వివాహం అయ్యిందని.. అతడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పాడు. తైమూరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) సెంట్రల్ తెలిపారు. గార్డును అరెస్టు చేశామన్నారు.