WPL 2027 Dates Announced: మహిళల క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త వచ్చింది. ఉమెన్స్ ప్రిమియర్ లీగ్ (WPL) ఐదో సీజన్కు సంబంధించిన కీలక తేదీలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది. దీంతో 2027 ఆరంభంలోనే భారత క్రికెట్ మైదానాల్లో పరుగుల పండగ మొదలుకానుంది. 2027 డబ్ల్యూపీఎల్ సీజన్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు హోరాహోరీగా సాగనుంది. లీగ్ ముగిసిన వెంటనే అభిమానులను అలరించేందుకు మరొక మెగా టోర్నీ సిద్ధంగా ఉంది. నిజానికి శ్రీలంకలో జరగాల్సిన తొలి ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక భారత్కు మారడంతో ఆ టోర్నీని ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు నిర్వహించనున్నారు. అంటే డబ్ల్యూపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల వ్యవధిలోనే ఛాంపియన్స్ ట్రోఫీ షురూ కానుంది. ఇలా 2027 ప్రారంభంలోనే మహిళా క్రికెటర్ల సుదీర్ఘ, బిజీ షెడ్యూల్తో అభిమానులకు నాన్-స్టాప్ వినోదం దక్కనుంది.
కొత్త సీజన్ సమరానికి ముందు జట్ల బలాబలాలను సరిచూసుకునే అసలైన ఘట్టం ఆటగాళ్ల వేలం. కొచ్చిలోని గ్రాండ్ హయత్ వేదికగా అక్టోబర్ 28న WPL 2027 మెగా వేలం జరగనుంది. అంతకంటే ముందే, అంటే సెప్టెంబర్ 28 నాటికే తమ జట్లలో రిటైన్ (ముందుగానే ఉంచుకునే) చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఖరారు చేయాలని ఫ్రాంచైజీలకు బార్డర్ లైన్ విధించారు. ఈ రిటైన్ ప్రక్రియ ముగిశాక, వేలంలో మిగిలిన ఖాళీలను భర్తీ చేసుకుంటూ ఐదు ఫ్రాంచైజీలు సరికొత్త వ్యూహాలతో బలమైన జట్లను రూపుదిద్దుకోవడానికి సిద్ధమవుతున్నాయి. “తమ ప్రస్తుత స్క్వాడ్లోని కీలక ప్లేయర్లను ఉంచుకుని, కొత్త సీజన్కు అవసరమైన కాంబినేషన్లను నిర్మించుకోవడానికి ఐదు ఫ్రాంచైజీలకు ఇది మంచి అవకాశం” అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు ఈ మ్యాచ్ల వేదికలపై కూడా బీసీసీఐ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. స్పోర్ట్స్ స్టార్ నివేదికల ప్రకారం, ఈ ఐదో సీజన్ మ్యాచ్లకు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, వడోదరలోని కొటాంబి స్టేడియంలు రేసులో ముందు వరుసలో ఉన్నాయి. విశేషమేమిటంటే, డబ్ల్యూపీఎల్ ముగిసిన వెంటనే జరిగే ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ పోరుకు కూడా ఈ రెండు మైదానాలే ఆతిథ్యమివ్వబోతున్నాయి. మొత్తానికి వేలం ఈ 2027 మహిళల క్రికెట్ సీజన్ క్రికెట్ ప్రియులకు ఖచ్చితంగా కిక్ ఇవ్వనుంది.

