WPL 2024 Schedule Announced: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్కు కౌంట్డౌన్ మొదలైంది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ ఫిబ్రవరి 23న బెంగళూరులో ప్రారంభం కానుంది. గత ఏడాది ఫైనలిస్టులు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో టోర్నీ మొదటి మ్యాచ్ జరుగుతుంది. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం.. రెండో మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, వారియర్స్ జట్ల మధ్య ఫిబ్రవరి 24న జరుగునుంది. మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరగనున్నాయి.
తొలి సీజన్లో ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్.. రెండో సీజన్లో మాత్రం రెండు నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. డబ్ల్యూపీఎల్ 2024లో ఐదు జట్లు బెంగళూరు, ఢిల్లీ వేదికగా 22 మ్యాచ్లు ఆడనున్నాయి. బెంగళూరు లెగ్ మార్చి 4 వరకు కొనసాగుతుంది. తర్వాత ఢిల్లీకి టోర్నీ తరలిపోతుంది. రెండవ సీజన్లో మ్యాచ్లు 24 రోజులు జరగనుండగా.. డబుల్ హెడర్లు మాత్రం లేవు. అన్ని మ్యాచ్లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.
Also Read: T20 World Cup 2024: టీమిండియాకు వ్యతిరేకంగా ఆడటమే నా లక్ష్యం.. భారత ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సక్సెస్ కావడంతో.. మహిళలకు డబ్ల్యూపీఎల్ లీగ్ గతేడాది బీసీసీఐ నిర్వహించింది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ క్రీడాభిమానులను అలరించింది. ముంబై వేదికగా జరిగిన ఈ టోర్నీలో.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు టైటిలో కోసం పోటీ పడ్డాయి. ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై చాంపియిన్గా నిలిచింది. మొదటి సీజన్ పూర్తిగా ముంబైలో జరిగింది. రెండో సీజన్ను హోమ్ మరియు హోమ్ అవే మోడల్లో బీసీసీఐ ప్లాన్ చేసింది. అయితే బీసీసీఐ ప్రణాళికను అమలు చేయడానికి లాజిస్టికల్ సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చింది.