Harmanpreet Kaur Says India Will Win the Women’s ODI World Cup 2025: వన్డే ప్రపంచకప్ 2025 గెలిచి ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించుతామని భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచకప్ ఎల్లప్పుడూ ప్రత్యేకమే అని, ఈసారి తప్పక గెలుస్తాం అని చెప్పారు. 2017 ప్రపంచకప్ సెమీస్లో ఆస్ట్రేలియా మ్యాచ్ అనంతరం చాలా విషయాలు మారిపోయాయని, అభిమానులు ఎంతగానో ఉత్సాహపరిచారన్నారు. యువరాజ్ సింగ్ను చూసినప్పుడల్లా తనకు చాలా ప్రేరణ లభిస్తుందని హర్మన్ప్రీత్ చెప్పారు. సోమవారం వన్డే ప్రపంచకప్ 2025 ట్రోఫీని ముంబైలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా, మాజీ ప్లేయర్ యువరాజ్సింగ్, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్లతో పాటు హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ పాల్గొన్నారు.
హర్మన్ప్రీత్ కౌర్ మాట్లాడుతూ… ‘భారతీయులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న అడ్డంకిని మేం బద్దలు కొడతాం. ప్రపంచకప్ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. యువరాజ్ సింగ్ను చూసినప్పుడల్లా నాకు ఎంతో ప్రేరణ లభిస్తుంది. ఆస్ట్రేలియాతో ఆడటం సవాల్తో కూడుకున్నదే. మెగా టోర్నీకి ముందు ఆసీస్తో వన్డే సిరీస్ ఆడడం కలిసొస్తుంది. మేం చాలా కష్టపడుతున్నాం. 2017 ప్రపంచకప్ సెమీస్లో ఆస్ట్రేలియాతో ఆడిన ఇన్నింగ్స్ (171) నాకు ఎంతో ప్రత్యేకం. ఆ మ్యాచ్ తర్వాత చాలా విషయాలు మారిపోయాయి. ఫైనల్లో ఓడిపోయి తిరిగొచ్చినా మాకు ఘన స్వాగతం దక్కింది. ఈసారి వన్డే ప్రపంచకప్ తప్పక గెలుస్తాం’ అని చెప్పారు.
Also Read: Ramchander Rao: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్!
మరో 50 రోజుల్లో వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది. సెప్టెంబరు 30 నుంచి నవంబరు 2 వరకు జరిగే ప్రపంచకప్ జరగనుంది. మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. సెప్టెంబరు 14 నుంచి 20 వరకు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత్కు ఆస్ట్రేలియా రానుంది. భారత మహిళల జట్టు వన్డే, టీ20 ప్రపంచకప్ గెలవలేదు. విజయానికి దగ్గరగా వెళ్లి తుది మెట్టుపై బోల్తా పడ్డారు. 2017 ప్రపంచకప్లో భారత్ రన్నరప్గా నిలిచింది. ఈ ఏడాది ఐసీసీ ట్రోఫీ గెలవాలని భారత్ చూస్తోంది.
