Rs 20 Note Viral in Anantapur: అనంతపురం జిల్లాలోని ఓ దేవాలయంలో హుండీ లెక్కింపు సమయంలో వెలుగుచూసిన ఘటన భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా భక్తులు ఆరోగ్యం, ఉద్యోగం, విద్య, ఆర్థికాభివృద్ధి వంటి కోరికలను దేవుడికి మొక్కుకుంటారు. అయితే ఓ మహిళ మాత్రం తన అత్త వేధింపుల నుంచి విముక్తి కల్పించాలంటూ.. దేవుడికి చేసిన వినతి అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన 20 రూపాయల నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అధికారులు గురువారం (జూన్ 18) హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సమర్పించిన నగదు, కానుకలను పరిశీలిస్తుండగా.. ఓ రూ.20 నోటుపై రాసిన సందేశం అధికారుల దృష్టికి వచ్చింది. ఆ నోటుపై ‘స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు’ అని చేతిరాతతో రాసి ఉంది. ఇది చూసి ఆలయ సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంగ్లీషులో రాసున్న మరో నోటు కూడా ఉంది.
ఈ వినతి సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ కలహాలు, అత్తా-కోడళ్ల మధ్య విభేదాలు ఎంత తీవ్ర స్థాయికి చేరుకుంటే.. ఇలాంటి కోరికను దేవుడి ముందుంచుతారో అంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు దీనిని సరదాగా తీసుకుంటుండగా.. ఇంకొందరు కుటుంబ సమస్యల తీవ్రతకు ఇది నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. దేవాలయ హుండీల్లో భక్తులు తమ కోరికలను కాగితాలపై రాసి వేయడం కొత్త విషయం కాదు. అయితే ఒకరి మరణాన్ని కోరుతూ నోటుపై నేరుగా వినతి రాయడం మాత్రం చాలా అరుదైన ఘటన అనే చెప్పాలి. ఈ వింత కోరిక ప్రస్తుతం అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.

