చేతిలో స్టెతస్కోప్.. ఒంటిపైన డాక్టర్ కోటు.. దర్జాగా లోపలికి ఎంట్రీ.. ఆ తర్వాత నింపాదిగా ఆస్పత్రి నుంచి ఎగ్జిట్. సీన్ కట్ చేస్తే ఓ మహిళా పేషెంట్ మెడలో బంగారు ఆభరణాలు చోరీ. ఆస్పత్రి నిండా సీసీ కెమెరాలు.. ఎక్కడికక్కడ భద్రతా సిబ్బంది.. అయినా పసిగట్టని వైనం. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో ఘటన. మహిళ ఒంటిపై ఉన్న ఆభరణాలు కొట్టేసింది ఎవరు? ఆస్పత్రి సిబ్బంది ఏం తేల్చింది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బోయిన్పల్లికి చెందిన సుధారాణి .. అనారోగ్య సమస్యలతో యశోద ఆసుపత్రిలో మార్చి 10న అడ్మిట్ అయింది. మార్చి 11 న ఆమెను డిశ్చార్జ్ చేసే సమయంలో కొన్ని టెస్ట్లు చేయాలని డాక్టర్లు సూచించారు. ఈ క్రమంలో ఆమె అడ్మిట్ రూమ్లొనే వేచి చూస్తోంది. ఐతే డాక్టర్ వేషధారణలో ఉన్న ఓ మహిళ.. పేషేంట్ సుధారాణి రూంలోకి వచ్చింది. వెంటనే హడావుడి చేసి అందరినీ బయటకు పంపించింది. లోపలి నుంచి తలుపులు వేసేసింది. తరువాత ఆమె ఒంటిపై ఉన్న బంగారంతో ఉడాయించింది.
Also Read:Inter Student: కామాంధుడిగా మారిన ఇంటర్ విద్యార్థి.. ప్రేమ పేరుతో ముగ్గురు అమ్మాయిలను ఇలా..
డాక్టర్ వెళ్లిన అనంతరం రూములోకి వెళ్లిన బంధువులు.. సుధారాణి స్పృహలో లేకపోవడం గమనించారు. అంతే కాదు ఆమె ఒంటిపై ఉన్న బంగారం కనిపించకపోవడంతో.. వెంటనే యశోద యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. తమకు సంబంధం లేదని ఆస్పత్రి యాజమాన్యం తెలపడంతో.. మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యశోద ఆస్పత్రిలో ఉన్న సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. అందులో ఓ మహిళ డాక్టర్ కోటు ధరించి లోపలికి వచ్చి.. మళ్లీ తిరిగి వెళ్లిపోయినట్లుగా గుర్తించారు. నిజానికి ఆస్పత్రి సిబ్బంది అందరి మెడలో ఐడీ కార్డులు ఉన్నాయి. కానీ ఐడీ కార్డు లేకుండా వచ్చిన మహిళను భద్రతా సిబ్బంది ఎవరూ అడ్డుకోలేదు. దీంతో తాపీగా వచ్చి పని చూసుకుని తిరిగి వెళ్లిపోయింది. మొత్తంగా సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కిలాడీ లేడీ డాక్టర్ను పట్టుకునే పనిలో పడ్డారు.
ఐతే వందల మంది భద్రతా సిబ్బంది.. పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ధైర్యంగా వచ్చి బంగారు ఆభరణాలు చోరీ చేసి వెళ్లిన మహిళ తీరుపై పోలీసులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం ఘటనలో యశోద ఆస్పత్రిలో సెక్యూరిటీ డొల్లతనాన్ని బయటపెట్టింది.
