West Bengal Violence: బెంగాల్‌లో ఎన్నికల రక్తపాతం.. కత్తితో వెంటాడిన టీఎంసీ నేత.. ఇద్దరు కార్యకర్తల హత్య!

West Bengal Election Violence

West Bengal Election Violence

West Bengal Election Violence: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే రాష్ట్రంలో హింసాకాండ మొదలైంది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (TMC) మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. హౌరా, బీర్భూమ్ జిల్లాల నుంచి ఈ మరణాలు నమోదయ్యాయి. హౌరా జిల్లా ఉదయ్‌నారాయణ్‌పూర్‌లోని దేబీపూర్ గ్రామంలో సోమవారం రాత్రి బీజేపీ కార్యకర్త జాదవ్ బార్ (45) దారుణ హత్యకు గురయ్యారు. విజయోత్సవ వేడుక నుంచి తిరిగి వస్తుండగా టీఎంసీ కార్యకర్తలు ఆయనపై దాడి చేసి కొట్టి చంపారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ.. ప్రధాన నిందితుడు కలిపద బాగ్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే, ఇది వ్యక్తిగత కక్షల వల్ల జరిగిందా లేదా రాజకీయ కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, స్థానిక టీఎంసీ ఎమ్మెల్యే సమీర్ పంజాపై జరిగిన దాడికి సంబంధించిన పేర్లను చెప్పమని జాదవ్‌ను హింసించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిని ఖండించిన ఎమ్మెల్యే పంజా.. బీజేపీ మద్దతుదారులే తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసి ఇళ్లను ధ్వంసం చేశారని ఎదురుదాడికి దిగారు.

ఇక బీర్భూమ్ జిల్లా నాన్నూర్ పరిధిలోని సంతోష్‌పూర్ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం టీఎంసీ కార్యకర్త అబీర్ షేక్ (45) దారుణ హత్యకు గురయ్యారు. బంధువుతో కలిసి ఇంటికి వస్తుండగా బీజేపీ మద్దతుదారులు మారణాయుధాలతో దాడి చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో అబీర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన బంధువు అలీ హుస్సేన్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే, ఈ హత్యతో తమకు సంబంధం లేదని, ఇది టీఎంసీలోని వర్గ పోరు వల్ల జరిగి ఉంటుందని బీజేపీ కొట్టిపారేసింది. ఉత్తర బెంగాల్‌లోని జల్పాయ్‌గురిలోనూ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోయిన టీఎంసీ అభ్యర్థి కృష్ణదాస్ తన అనుచరులతో కలిసి బీజేపీ మద్దతుదారులపై కత్తులతో దాడి చేయడమే కాకుండా కాల్పులు జరిపారని ఆరోపణలు వచ్చాయి. భ్రమరీ దేవి ఆలయానికి వెళ్తున్న బీజేపీ కార్యకర్తలపై ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరికి బుల్లెట్ సైతం తగిలింది. కృష్ణదాస్ కత్తితో బీజేపీ కార్యకర్తలను వెంటాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం కృష్ణదాస్ పరారీలో ఉండగా, తాను ఆత్మరక్షణ కోసమే అలా చేయాల్సి వచ్చిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆయా ప్రాంతాల్లో కేంద్ర బలగాలను భారీగా మోహరించారు.