టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయపడటంపై వస్తున్న తీవ్ర విమర్శలపై బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) హెడ్ VVS లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. క్రీడాకారుల జీవితంలో గాయాలు సహజమైన భాగమని, ఈ విషయంలో ఎవరినీ నిందించడం లేదా బలిపశువులను చేయాలని చూడడం ఏమాత్రం సరికాదని ఆయన తేల్చి చెప్పారు. ‘బ్లేమ్’ (నిందించడం) అనే పదాన్ని వాడటం తమకు ఇష్టం లేదని, దీనివల్ల సమస్యలు పరిష్కారం కావని బెంగళూరులోని సిఓఈ వేదికగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
శ్రీలంకతో జరగనున్న కీలక టెస్టు సిరీస్కు ముందు జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ వంటి పలువురు స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడి సిఓఈలో పునరావాసం పొందుతున్నారు. ఆటగాళ్లను అరకొర ఫిట్నెస్తోనే మైదానంలోకి దించుతున్నారన్న విమర్శలపై లక్ష్మణ్ స్పందిస్తూ.. సీఓఈ అనేది కేవలం గాయపడిన ఆటగాళ్లకు చికిత్స అందించే ‘రిహాబిలిటేషన్ సెంటర్’ మాత్రమే కాదని, అంతకుమించిన బాధ్యతలతో నడుస్తున్న ఉన్నతమైన వ్యవస్థ అని వివరించారు. క్రీడాకారుల శారీరక సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు అధునాతన ‘బ్రోంకో టెస్ట్’ వంటి సరికొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్ ఎంపికలు పూర్తిస్థాయి ఫిట్నెస్కు లోబడి జరిగాయని, వైద్య బృందం పరిశీలన తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. సాయి సుదర్శన్ నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ బొటనవేలి నొప్పి పూర్తిగా తగ్గకపోవడం, బుమ్రా మోకాలి వాపు సమస్య తగ్గకపోవడంతో వైద్యులు వారి విషయంలో ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నట్లు వివరించారు. సిఓఈ, టీమ్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్ సైన్స్ విభాగాలు మరియు సెలక్షన్ కమిటీ మధ్య సమాచార వ్యవస్థ చాలా పారదర్శకంగా, నిరంతరం కొనసాగుతోందని చెప్పారు.
సెలెక్టర్ల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, ఆటగాళ్లను తొందరపడి మైదానంలోకి దించకుండా సుదీర్ఘ కెరీర్ను దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకోబడుతున్నాయని స్పష్టం చేశారు. బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా కూడా ఇటీవల సిఓఈకి చేరుకుని పరిస్థితిని సమీక్షించిన వేళ, లక్ష్మణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్పష్టమైన డేటా ఆధారంగా, క్రీడాకారుల శ్రేయస్సే ధ్యేయంగా నిర్ణయాలు జరుగుతున్నప్పుడు ఆధారాలు లేకుండా నిందలు వేయడం సముచితం కాదని లక్ష్మణ్ ముగించారు.

