విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చెవి నొప్పి సమస్యతో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన 13 ఏళ్ల బాలిక మృతి చెందడం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు చనిపోయిందంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన విశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఆనందపురం ప్రాంతానికి చెందిన యజ్ఞశ్రీ (13) అనే బాలిక చెవి నొప్పి సమస్యతో విశాఖలోని ఆయుష్మాన్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరింది. వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించేందుకు సిద్ధమవుతున్న సమయంలో కొన్ని మందులు ఇచ్చారు. అయితే ఆపరేషన్కు ముందు వైద్యులు ఓవర్ డోస్ మందులు ఇవ్వడం వల్లే బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. మందులు ఇచ్చిన అనంతరం యజ్ఞశ్రీ హార్ట్ బీట్ బాగా పెరిగి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బాలిక మృతి చెందిన విషయాన్ని ఆయుష్మాన్ ఆస్పత్రి యాజమాన్యం కొంతసేపు దాచిపెట్టిందని కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే యజ్ఞశ్రీ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
