TV Serial Scam: ఎవరిని నమ్మాలి..? ఎవరి పరిచయం వెనుక ఏ ప్లాన్ ఉందో కూడా తెలియని పరిస్థితులు.. నమ్మబలికి అడ్డంగా దోచేసి పరారవుతున్నారు.. తాజాగా, విశాఖపట్నంలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. టీవీ సీరియల్స్లో హీరోయిన్గా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మహిళ నుంచి దాదాపు రూ.60 లక్షలు కాజేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని ఈ మోసానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ వైద్యుడి భార్యను విశాఖకు చెందిన వ్యక్తి టార్గెట్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన నిందితుడు, తనకు టెలివిజన్ రంగంలో మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పి బాధితురాలిని నమ్మించాడు. సీరియల్స్లో హీరోయిన్ పాత్ర ఇప్పిస్తానని ఆశ చూపుతూ ఆమె నుంచి దశలవారీగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం.
నిందితుడు బాధితురాలి నమ్మకాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, వివిధ అవసరాల పేరుతో మొత్తంగా సుమారు రూ.60 లక్షలు కాజేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాధితురాలి బ్యాంక్ ఖాతా నుంచి రూ.22 లక్షల విలువైన కారును కూడా కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటనపై బాధితురాలు తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తు భాగంగా కారును కొనుగోలు చేసిన కార్ల షోరూం బ్యాంక్ అకౌంట్ను తెలంగాణ పోలీసులు ఫ్రీజ్ చేశారు. దీంతో షోరూం యజమాని విశాఖ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ మోసానికి పాల్పడిన వ్యక్తి విశాఖ నగరంలోని మధురవాడ బాంబే కాలనీకి చెందిన జంబాడ లక్ష్మీ వరప్రసాద్గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా పరిచయాలను నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయొద్దని, ముఖ్యంగా సినీ అవకాశాలు, ఉద్యోగాలు లేదా పెట్టుబడుల పేరుతో వచ్చే ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
