Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భవిష్యత్తు, ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడతాడా లేదా అన్న చర్చలపై మొదటిసారి బహిరంగంగా స్పందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన కోహ్లీ.. తాను ఇప్పటికే ఎన్నోసార్లు తన అంకితభావాన్ని నిరూపించుకున్నానని, మళ్లీ మళ్లీ తన విలువను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉండాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశాడు.

టీ20 వరల్డ్‌కప్ 2024 విజయానంతరం టీ20లకు వీడ్కోలు చెప్పిన కోహ్లీ, గత ఏడాది ఇంగ్లండ్ టూర్‌కు ముందు టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు. ప్రస్తుతం భారత్ తరఫున కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్న ఈ స్టార్ బ్యాటర్, తనకు క్రికెట్‌పై ఉన్న దృక్పథం ఇప్పుడు చాలా స్పష్టంగా ఉందని తెలిపాడు. నేను ఉన్న వాతావరణానికి విలువ జోడించగలనని, ఆ వాతావరణం భావిస్తే నేను అక్కడ ఉంటాను. కానీ మళ్లీ మళ్లీ నా విలువను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తే, నేను ఆ స్థలంలో ఉండను. ఎందుకంటే నా ప్రిపరేషన్ విషయంలో నేను నిజాయితీగా ఉంటానని కోహ్లీ అన్నాడు.

తన కెరీర్‌లో ఎప్పటిలాగే ఇప్పటికీ అదే స్థాయి క్రమశిక్షణతో కష్టపడుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు. నేను ఎప్పుడూ తలదించుకుని కష్టపడతాను. వన్డేలో 40 ఓవర్లు బౌండరీ నుంచి బౌండరీకి పరుగెత్తమంటే కూడా ఎలాంటి ఫిర్యాదు లేకుండా చేస్తాను. ఎందుకంటే నేను ఆ విధంగానే సిద్ధమవుతాను అని అన్నారు. ప్రతి బంతినీ కెరీర్‌లో చివరి బంతిలా భావిస్తూ ఆడతానని, జట్టు కోసం చేయాల్సిన ప్రతి పనిని పూర్తి అంకితభావంతో చేస్తానని కోహ్లీ చెప్పాడు. ఇలా ఆడిన తర్వాత కూడా నా విలువను నిరూపించుకోవాలని చెబితే, ఆ స్థలం నాకు సరిపోదు అంటూ గట్టి సమాధానం ఇచ్చాడు.

2027 వరల్డ్‌కప్‌లో కోహ్లీ ఆడతాడా అన్న అనుమానాలు ఇటీవల మరింత పెరిగాయి. వన్డే క్రికెట్‌కు అంతర్జాతీయ షెడ్యూల్‌లో తక్కువ ప్రాధాన్యం లభిస్తుండటంతో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విషయంలో తనకు స్పష్టత ఉందని కోహ్లీ తెలిపాడు. 2027 వరల్డ్‌కప్ గురించి నన్ను చాలా సార్లు అడిగారు. నేను ఏం చేయాలనుకుంటున్నానో నాకు తెలుసు. ఆడాలనిపించకపోతే ఇంటిని వదిలి వచ్చి ఇలా సిద్ధంగా ఉండను కదా. భారత్ కోసం వరల్డ్‌కప్ ఆడటం గొప్ప విషయం. కానీ ఆ విలువ రెండు వైపులా ఉండాలని అన్నాడు.

ఈ ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున తిరిగి ఆడిన అనుభవాన్ని కూడా కోహ్లీ పంచుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనే ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 208 పరుగులు చేసిన కోహ్లీ, దేశీయ క్రికెట్ తనలో మళ్లీ ఆటపై ఉన్న స్వచ్ఛమైన ఆనందాన్ని గుర్తు చేసిందని చెప్పాడు. అక్కడ ఎలాంటి హడావుడి లేదు. నేను కేవలం బ్యాటింగ్‌ను ఆస్వాదించాలనుకున్నాను. అది ఇతరుల కోసం కాకుండా.. నా కోసం, ఆట కోసం మాత్రమే అని అన్నారు. తన భవిష్యత్తుపై అనవసర చర్చలు చేయకుండా స్పష్టంగా మాట్లాడాలని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. నేను సరిపోనివాడిని అనుకుంటే మొదటి రోజే చెప్పండి. కానీ అవసరం ఉందని చెప్పి, తర్వాత ఫలితాల ఆధారంగా అభిప్రాయాలు మార్చుకోవడం సరికాదు అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.