Virat Kohli Cried in the Bathroom After 2019 WC Semi-Final Loss: 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్.. ప్రతి ఒక్క భారత క్రికెట్ అభిమానికి గుర్తుండే ఉంటుంది. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 221 పరుగులకు ఆలౌట్ అయింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పోరాడినా భారత్కు ఓటమి తప్పలేదు. ఈ పరాభవం ప్రతిఒక్క భారత అభిమాని హృదయాన్ని కలిచివేసింది. ఫాన్స్ మాత్రమే కాదు.. టీమిండియా ప్లేయర్స్ కూడా ఏడ్చారు. విరాట్ కోహ్లీ ఏకంగా బాత్రూమ్లోకి వెళ్లి మరీ ఏడ్చాడని మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ తాజాగా తెలిపాడు.
తాజాగా ‘ఫిగరింగ్ అవుట్ విత్ రాజ్ షమానీ’ అనే పాడ్కాస్ట్లో యుజ్వేంద్ర చహల్ పాల్గొన్నాడు. షమానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ మధ్య వ్యత్యాసం గురించి అడగా… ‘రోహిత్ భయ్యా మైదానంలో తనను తాను చాలా కంట్రోల్ చేసుకుంటాడు. అది నాకు చాలా ఇష్టం. రోహిత్ చాలా మంచి కెప్టెన్. విరాట్ భయ్యా అద్భుతం. అతడు ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతాడు. రోజు మొత్తం ఒకే ఎనర్జీతో ఉంటాడు. రోజులో విరాట్ ఎనర్జీ పెరుగుతుందే తప్ప తగ్గదు’ అని బదులిచ్చాడు. ఐపీఎల్ 2025 టైటిల్ను ఆర్సీబీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఈ క్రమంలో 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ను యూజీ గుర్తుచేసుకున్నాడు.
Also Read: ENG vs IND: టీమిండియాకు శుభవార్త.. ఇంగ్లండ్ స్టార్ పేసర్ అవుట్! ఐదవ టెస్ట్ గెలిచినా?
‘2019 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ బాత్రూమ్లో ఏడవడంను నేను చూశాను. విరాట్ మాత్రమే కాదు.. జట్టులోని అందరి పరిస్థితి అదే. నేను చివరి బ్యాటర్ని. నేను కోహ్లీని క్రాస్ చేస్తున్నప్పుడు అప్పటికే అతని కళ్లలో నీళ్ళు వచ్చాయి. అందరూ ఏడవడంను నేను చూశాను. ఎఎంఎస్ ధోనీకిదే చివరి మ్యాచ్. నేను 15 పరుగులు తక్కువగా ఇవ్వాల్సింది. ఉత్తమంగా బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది’ అని యుజ్వేంద్ర చహల్ తెలిపాడు. మ్యాచ్లో యూజీ 10 ఓవర్లలో 63 రన్స్ ఇచ్చి ఒకే వికెట్ పడగొట్టాడు. ఇక కోహ్లీ 6 బంతులు ఆడి ఓకే ఒక్క పరుగు చేశాడు. 2023 ప్రపంచకప్లో ఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ ఓడింది. ఇక 2027 ప్రపంచకప్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది.