ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) రెండవ సీజన్ కోసం రంగం సిద్దమవుతోంది. డీపీఎల్ 2025 వేలం జూలై 5న జరగనుంది. ఈ వేలం జాబితాలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అన్నయ్య వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్యవీర్ కోహ్లీ పేరు కూడా ఉంది. అంతేకాదు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు ఆర్యవీర్, వేదాంత్ కూడా డ్రాఫ్ట్లో ఉన్నారు. ఇక్కడ విరాట్ అన్నయ్య కొడుకు, సెహ్వాగ్ కొడుకు పేరు ఆర్యవీర్ కావడం విశేషం. విషయం తెలిసిన సెహ్వాగ్, విరాట్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ బాల్య కోచ్ రాజ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో 15 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఆర్యవీర్ కోహ్లీ పశ్చిమ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. గత సీజన్లో ఢిల్లీ అండర్-16 జట్టుకు రిజిస్టర్డ్ ఆటగాడిగా ఉన్న కారణంగా ఆర్యవీర్ను కేటగిరీ సీలో చేర్చారు. వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు ఆర్యవీర్, వేదాంత్ ఇద్దరు కేటగిరీ బీలో ఉన్నారు. ఆర్యవీర్ ఢిల్లీ అండర్-19కి ప్రాతినిధ్యం వహించి మేఘాలయపై 297 పరుగులు చేశాడు. వేదాంత్ ఆఫ్-స్పిన్నర్ కాగా.. ఢిల్లీ అండర్-16 జట్టు తరపున ఆడాడు.
Also Read: Kannappa Movie: ఊహకు మించి ‘కన్నప్ప’.. ‘మైల్ స్టోన్’ చిత్రం అవుతుంది: డిప్యూటీ సీఎం
2024లో డీపీఎల్ ప్రారంభమైంది. ప్రారంభ సీజన్లో ప్రియాంష్ ఆర్య, దిగ్వేష్ రతి, ప్రిన్స్ యాదవ్ వంటి అత్యుత్తమ ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. వీరంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో పాల్గొన్నారు. గత సీజన్తో పోలిస్తే ఈ సారి 2 కొత్త జట్లు వచ్చాయి. ఈసారి మొత్తంగా 8 జట్లు పాల్గొననున్నాయి. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురానీ ఢిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ టీమ్స్ 2025 డీపీఎల్లో పాల్గొననున్నాయి.