Virat Kohli: భారమైన హృదయంతో ఆస్ట్రేలియాను వీడుతున్నాం.. కోహ్లీ ఉద్వేగభరిత ట్వీట్‌

Virat Kohli

Virat Kohli

Virat Kohli: టీ20 ప్రపంచకప్‌ కల తీరకుండానే టీమిండియా ప్రయాణం ముగిసింది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని సెమీస్ చేసిన భారత్ టైటిల్ కల తీరకుండానే నిష్క్రమించింది. ఈ ఓటమి ఆటగాళ్లనే కాకుండా, కోట్లాది మంది అభిమానులను నిరాశలోకి నెట్టేసింది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ అసంపూర్ణ ప్రయాణంపై భారత కీలక ఆటగాడు విరాట్‌ కోహ్లీ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. భారమైన హృదయంతో ఆస్ట్రేలియాను వీడుతున్నామంటూ విరాట్‌ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశాడు. ఈ టోర్నీ నుంచి మరిన్ని పాఠాలను నేర్చుకుని భవిష్యత్‌లో మరింత మెరుగవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటామన్నారు.

“మేము మా కలను సాధించకుండానే తీవ్ర నిరాశతో కూడిన హృదయాలతో ఆస్ట్రేలియా తీరాలను వదిలివెళ్తున్నాం. కానీ చిరస్మరణీయమైన క్షణాలను తిరిగి తీసుకెళ్తున్నాం. . ఇక్కడి నుంచి మరింత మెరుగవ్వాలనేదే మా లక్ష్యం. మైదానంలో మాకు మద్దతు ఇచ్చిన ప్రతి అభిమానికీ కృతజ్ఞతలు. ఈ జెర్సీని ధరించి మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తున్నా.” అని కోహ్లీ ట్వీట్‌ చేశారు. కోహ్లీతో పాటు సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌ కూడా భావోద్వేగ ట్వీట్లు చేశారు.

Asia Elite Boxing Championship: ఆసియా బాక్సింగ్‌లో పతకం సాధించిన తెలంగాణ బాక్సర్‌

భారత్‌ సెమీస్‌లో ఓటమి పాలైనా టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో సూపర్‌ ఫామ్‌తో చెలరేగి ఆడుతున్న పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కింగ్‌ కోహ్లీ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటికే అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న కోహ్లీ.. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వేల మైలురాయిని దాటడం గమనార్హం. మొత్తంగా 115 మ్యాచ్‌ల్లో 4008 పరుగులతో టీ20 ఫార్మాట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 36 అర్ధశతకాలు ఉన్నాయి. కోహ్లీ తర్వాత 3,853 పరుగులతో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు గప్తిల్(3497), పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(3323), ఐర్లాండ్‌ ఆటగాడు స్టిర్లింగ్‌ (3181) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.