Viral Video: హృదయ విదారక ఘటన.. బైక్‌పై భార్య మృతదేహం తరలింపు, నిస్సహాయంగా భర్త!

  • నాగ్‌పూర్‌లో హృదయ విదారక ఘటన
  • బైక్‌పై భార్య మృతదేహం తరలింపు
  • వాహనదారులపై మండిపడుతున్న నెటిజెన్స్
Man Carries Wife’s Dead Body

Man Carries Wife’s Dead Body

Husband carries wife’s body on Bike in Nagpur: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్య మృతదేహాన్ని బైక్‌పై స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశాడు. అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడం, రోడ్డుపై ఎవరూ సాయం చేయకపోవడంతో.. భర్త నిస్సహాయంగా ఉండిపోయాడు. తీవ్ర నిరాశకు గురైన భర్త తన భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి తీసుకెళ్లాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన డియోలాపర్ పోలీసు అధికార పరిధిలోని మోర్ఫాటా ప్రాంతం సమీపంలోని నాగ్‌పూర్-జబల్‌పూర్ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని సియోనికి చెందిన అమిత్ యాదవ్, గ్యార్సి అమిత్ యాదవ్ దంపతులు గత 10 సంవత్సరాలుగా నాగ్‌పూర్ సమీపంలోని లోనారాలో నివసిస్తున్నారు. రక్షాబంధన్ రోజున అమిత్ తన భార్యతో కలిసి లోనారా నుండి కరణ్‌పూర్‌కు బయల్దేరాడు. బైక్‌పై వెళ్తున్న ఈ జంటను మోర్ఫాటా ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 32 ఏళ్ల గ్యార్సి అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం తర్వాత అమిత్ వాహనదారుల సహాయం కోరాడు. కానీ ఎవరూ అతడికి సాయం చేయలేదు. అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడం, రోడ్డుపై ఎవరూ సాయం చేయకపోవడంతో అమిత్ నిరాశకు గురయ్యాడు. చివరికి భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టి కొన్ని కిలోమీటర్ల పాటు తీసుకెళ్లాడు.

Also Read: Asia Cup 2025: ‘సూరీడు’ ఫిట్‌నెస్‌తో లేడా?.. శుభ్‌మాన్ గిల్ రీఎంట్రీ!

నాగ్‌పూర్-జబల్‌పూర్ హైవే భార్య మృతదేహాన్ని అమిత్ యాదవ్ తరలిస్తుండగా వాహనదారులు కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అమిత్‌ను ఆపడానికి ప్రయత్నించగా.. అతడు బైక్ ఆపలేదు. చివరకు పోలీసులు అమిత్‌ను ఆపి.. మృతదేహాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోస్ట్‌మార్టం కోసం నాగ్‌పూర్‌లోని మాయో ఆసుపత్రికి పంపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. వాహనదారులపై నెటిజెన్స్ మండిపడుతున్నారు.